హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : రైల్వే టికెట్ జారీలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సౌకర్యాన్ని గురువారం నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల టికెట్ కొనుగోలు చేసే క్రమంలో.. తలెత్తే చిల్లర సమస్యలను సంపూర్ణంగా అధిగమించవచ్చని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 14 రైల్వే స్టేషన్లలో 31 కౌంటర్లను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ఫోన్పే, గూగుల్పే, భీమ్, పేటీఎం వంటి వాలెట్ ద్వారా టికెట్ బుకింగ్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ పొందే సౌకర్యాన్ని కల్పించినట్టు పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ ధరల పట్టికను స్టేషన్లలో ప్రదర్శించాలని అధికారులు నిర్ణయించారు.