హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ): పత్తి సాగులో కూలీల కొరతకు నివారించేందుకు విత్తనాలు విత్తే ప్రత్యేక యంత్రాన్ని వ్యవసాయశాఖ అందుబాటులోకి తెచ్చింది. పది యంత్రాలను తెప్పించిన రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ.. జిల్లాల్లోని ప్రయోగ కేంద్రాలకు అందించింది. ఈ యంత్రాల ద్వారా ప్రయోగాత్మకంగా ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన రైతుల వద్ద పత్తి విత్తనాలను విత్తనున్నారు. ఈ సీజన్లో అధిక సాంద్రత పత్తి సాగుపై వ్యవసాయశాఖ దృష్టి పెట్టింది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట మొత్తం ఒకేసారి పూత, కాత వస్తుంది. పత్తిని తెంపేందుకు(కోత) కూడా యంత్రాన్ని వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. తమిళనాడులో ఇప్పటికే పత్తికోత యంత్రాలు ఉన్నాయి. వాటిని తెప్పించి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు. ఈ సీజన్ ఫలితాలను పరిశీలించిన తర్వాత వచ్చే సీజన్లో మరిన్ని యంత్రాలు తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రైతులకు పెట్టుబడి ఆదా…
పత్తి విత్తనాలు నాటడానికి, పత్తి కోసేందుకు యంత్రాలను వాడటం వల్ల రైతులకు భారీ మొత్తంలో పెట్టుబడి ఆదా కానున్నది. ఒక యంత్రం ద్వారా 45 నిమిషాల్లోనే ఎకరంలో పత్తిని విత్తే అవకాశం ఉన్నది. సాధారణ పత్తి సాగులో ఎకరానికి ఏడు వేల వరకు విత్తనాలు నాటితే అధిక సాంద్రత పద్ధతిలో 25 వేల వరకు ఉన్నాయి. కూలీల ద్వారా విత్తనాలు విత్తితే ఎకరాకు రూ.3500-4000 వరకు రైతుకు ఖర్చు అవుతుంది. అదే యంత్రం ద్వారా రూ.1500ల్లోనే పూర్తవుతుంది. అంటే రైతుకు ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.2500 వరకు ఆదా కానున్నది. పెట్టుబడి ఖర్చులో 40 శాతం పత్తి కోసేందుకు అవుతుంది. ఈ నేపథ్యంలో విత్తడానికి, కోయడానికి యంత్రాలను వాడితే రైతులకు భారీ మొత్తంలో పెట్టుబడి ఆదా అవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు.