హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 12 కేసులు నమోదయ్యాయి. ఇందులో తొమ్మిదిమంది విదేశీయులు, ముగ్గురు భారతీయులు. 10 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి, ఇద్దరు రిస్క్ దేశాల నుంచి వచ్చారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. కెన్యాకు చెందినవారు ఆరుగురు, సోమాలియాకు చెందిన ఇద్దరు, యూఏఈకి చెందిన ఇద్దరు, ఘనా, టాంజానియా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్టు వివరించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి పెరిగిందని తెలిపారు. శనివారం రిస్క్ దేశాల నుంచి 315 మంది రాగా.. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలిందని, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో శనివారం కొత్తగా 185 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 78, మేడ్చల్ మల్కాజిగిరిలో 15, ఖమ్మం, రంగారెడ్డిలో 14 చొప్పున, హనుమకొండలో 11 కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు. ఇండ్లు, దవాఖానల్లో 3,761 మంది చికిత్స పొందుతున్నారు. 205 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 98.85 శాతం నమోదైందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.