లక్షెట్టిపేట, సెప్టెంబర్ 22 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మోదెల రోడ్డుకు చెందిన నల్ల కావ్యశ్రీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. పట్టణానికి చెందిన నల్ల చంద్రయ్య, సునీత దంపతుల పెద్ద కుమార్తె కావ్యశ్రీ.. లక్షెట్టిపేటలోని ప్రైవేట్ పాఠశాలలో ఆరోతరగతి నుంచి పదో తరగతి వరకు చదివింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఈఈఈ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన ఈమె మూడేండ్లు కష్టపడి చదివి పరీక్ష రాసింది. గురువారం వెలువడిన ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఆదర్శంగా నిలిచింది. తన తమ్ముడు హేమంత్కుమార్ ఉస్మానియా యూనిర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కావ్యశ్రీ తండ్రి చంద్రయ్య కోటపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2003 డీఎస్సీలో తన తండ్రి డిస్ట్రిక్ ఫస్ట్ ర్యాంక్ సాధించారని, ఆయన్ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్టు కావ్యశ్రీ తెలిపింది.