ముకరంపుర, నవంబర్ 11: మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు చేసి ఏం తేల్చిందో చెప్పాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బీ వినోద్కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి మీద బురద చల్లాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇంటి తలుపులు తెరిచి ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరించారని దుయ్యబట్టారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, రైతులకు మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి పీఎంవో నుంచి సీఎం కేసీఆర్కు ఆహ్వానం లేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రిది సంకుచిత మనస్తత్వమని విమర్శించారు. బండి సంజయ్ ఎంపీగా చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే కరీంనగర్లో జాతీయ రహదారులకు ఆమోదం చేయించినట్టు గుర్తుచేశారు. కరీంనగర్-వేములవాడ-సిరిసిల్ల- కామారెడ్డి-పిట్లం, ఎల్కతుర్తి-హుజూరాబాద్-సిద్దిపేట-మెదక్ రహదారులను 2016 లోనే ఆమోదింపజేశామని చెప్పారు.
కరీంనగర్-వీణవంక-జమ్మికుంట, భూపాలపల్లి-టేకుమట్ల-సిరోంచ ఆమోదం పొందిందని, సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కథలాపూర్-కోరుట్ల రహదారి మాత్రం పీఎం వోలోని నీతిఆయోగ్లో పెండింగ్లో ఉంద న్నారు. భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.670 కోట్లు కేటా యించిందని చెప్పారు. రామగుండం నుంచి మణుగూరు వయా భూపాలపల్లి, తాడ్వా యి-ఏటూరునాగారం-మంగపేట-మణు గూరు, రామగుండం-హైదరాబాద్ రహదారి ని జాతీయ రహదారిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పు తెచ్చి మరీ వడ్లు కొంటున్నామని, వారం రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, అయినా రాష్ర్టాన్ని కేంద్రం అనేక రకాలుగా ఇబ్బంది పెడుతు న్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘పచ్చగా ఉన్న తెలంగాణపై ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నరు.. దీన్ని దీటుగా ఎదుర్కోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణలో గతంలో ఉన్న బాధలన్నీ తొలిగిపోయి, రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు మొగులు చూసి పంట పండించే పరిస్థితి ఉండగా, కాళేశ్వరం జలాలతో బీళ్లు కూడా సాగులోకి వచ్చాయని చెప్పారు. కరెంటు, ఎరువులు, నీళ్లు, పెట్టుబడి బాధలు తప్పి, దరఖాస్తు లేకుండానే పెట్టుబడి సాయంగా రైతు బంధు, రైతు బీమా వస్తున్నదని చెప్పారు. ‘ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పంట కొంటున్నం. వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నయి.
రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నం. తెలంగాణ రాక ముందు 14 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం పది రెట్ల్లు అధికంగా వస్తున్నది. రాష్ట్రంలో 7,065 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా ఇప్పటివరకు 3,844 కేంద్రాలను ప్రారంభించాం. 4.45 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశాం. 66,737 మంది రైతులు రూ.950 కోట్ల విలువైన పంట అమ్ముకున్నారు. త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు వేస్తాం. గొంతులో ప్రాణం ఉండగా మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని, రైతులకు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పిన ఏకైక సీఎం కేసీఆర్’ అని పేర్కొన్నారు.