ఐటీ, స్టార్టప్లలో హైదరా‘బాద్షా’
తెలంగాణకు వెల్లువలా కంపెనీలు
మంత్రి కేటీఆర్ పనితీరు అద్భుతం
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం
వచ్చే డిసెంబర్లోగా ఐఐటీ రెండో దశ
ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి వెల్లడి
సంగారెడ్డి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సాఫ్ట్వేర్, స్టార్టప్ రంగాల్లో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. ఈ రంగాల్లో అమెరికాలోని సిలికాన్ వ్యాలీతో పోటీపడి ఎదిగే సత్తా హైదరాబాద్కు ఉన్నదని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి, మంత్రి కేటీఆర్ ముందుచూపే కారణమని కొనియాడారు. మంగళవారం ఐఐటీ హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ, స్టార్టప్ రంగాల్లో వేగంగా పురోగతి సాధించేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఫలితంగా రాష్ర్టానికి అనేక అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి వస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఐఐటీ హైదరాబాద్ కలిసి పనిచేస్తున్నదని, రాబోయే రోజుల్లో మరిన్ని రంగాల్లో కలిసి పనిచేస్తామని అన్నారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులను పరిశోధనలవైపు మళ్లించేందుకు మల్లారెడ్డి, గీతం విద్యాసంస్థలతో ఎంవోయూ కుదుర్చుకొన్నామని, త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు వివరించారు. ఇప్పటికే టీ-హబ్, టీ-ఎయిమ్తో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. త్వరలో మరిన్ని కాలేజీలతో ఎంవోయూ కుదుర్చుకొంటామని వెల్లడించారు. ఐఐటీ హైదరాబాద్ రెండో దశ నిర్మాణ పనులు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, దాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో రూఫ్ఫోల్డింగ్ ఇండోర్ స్టేడియాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సంస్థ అండగా ఉంటున్నదని, అక్కడి సర్కారు బడి పిల్లలను జేఈఈలో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు. ఐఐటీ-హైదరాబాద్ పరిసరాల్లోని గ్రామాల అభివృద్ధికి రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్టు వివరించారు.
కొత్త కోర్సులు, పరిశోధనలపై దృష్టి
ఐఐటీ హైదరాబాద్ విజన్-2024లో భాగంగా కొత్త కోర్సులు ప్రారంభించటంతోపాటు నూతన పరిశోధనలు, ఆవిష్కరణలపై దృషి సారించినట్టు బీఎస్ మూర్తి తెలిపారు. ఎంటెక్లో కొత్తగా ఆరు ఆన్లైన్ కోర్సులను ప్రారంభించామని, టెక్నో ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సును ప్రారంభిస్తామని వెల్లడించారు. బీటెక్, ఎంటెక్ విద్యార్థుల కోసం డ్యూయల్ డిగ్రీ కోర్సులను ప్రారంభిస్తున్నట్టు వివరించారు. ఐఐటీలో రిసెర్చ్ సెంటర్, ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేశామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. మెడికల్ డివైజ్ ప్రోగ్రామ్లో భాగంగా హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానతో, సెంటర్ ఫర్ మెటలర్జికల్ టెక్నాలజీ(సీ-మెట్)లో నూతన ఆవిష్కరణలకు డీఆర్డీవోతో కలిసి పనిచేస్తున్నట్టు వివరించారు. ఐఐటీ హైదరాబాద్లో సంస్కృతం కోర్సులు ఐదు విభాగాలుగా ఉన్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొనేందుకు సంస్కృతాన్ని బోధిస్తున్నట్టు చెప్పారు. క్యాంపస్లో సినిమా, హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన కోర్సులు ఉన్నాయని అన్నారు. పారిశ్రామిక వేత్తలు ఐఐటీతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.
సుజుకీ పరిశోధన కేంద్రం, తైవాన్తో కలిసి పరిశోధనలు
‘జపాన్ తొలిసారిగా దేశం వెలుపల ఐఐటీ హైదరాబాద్లో సుజుకీ రిసెర్చ్ ఆండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నది. వాహన తయారీ రంగంలో పరిశోధనలు చేస్తుంది. అలాగే సెమీ కండక్టర్ రంగంలో తైవాన్తో కలిసి పరిశోధనలు చేస్తున్నాం. బీటెక్ విద్యార్థులు ఇక్కడ రెండేండ్లు చదివి, మిగతా రెండేండ్లు తైవాన్లో చదవటంతోపాటు సెమీ కండక్టర్ పరిశ్రమల్లో పరిశోధనలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఐఐటీ హైదరాబాద్లో మానవ రహిత(అటానమస్ వెహికల్) వాహనాల తయారీపై వేగంగా పరిశోధనలు సాగిస్తున్నాం’ అని పేర్కొన్నారు. సమావేశంలో ఐఐటీ ప్రొఫెసర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు.