హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): బ్యాంకులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద చేసిన అప్పులను తీర్చలేని పరిస్థితిలో ఉన్న సన్నకారు రైతులు నిరాశకు గురికాకుండా రైతు రుణ ఉపశమన కమిషన్ను ఆశ్రయించాలని కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు సూచించారు. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులపై ఈనెల 27న కమిషన్ కార్యాలయంలో విచారిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రైతుల ఆత్మహత్యలను నివారించడం కోసం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పని చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే రైతుల అప్పుల తిప్పలను తీర్చేందుకు రైతు రుణ ఉపశమనకమిషన్ను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని నాగుర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటి వరకు 90కి పైగా ఫిర్యాదులు అందగా వాటిలో కొందరికి ఉపశమనం కల్పించామన్నారు. మరికొన్ని ఫిర్యాదులపై విచారణ కొనసాగుతున్నదని చెప్పారు.
రుణ ఉపశమన కమిషన్ గురించి తెలియక చాలా మంది రైతుల ఆధైర్యపడి అఘాయిత్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా మాసబ్ ట్యాంక్లోని కమిషన్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. లేదా 040-23393532 నంబర్కు గానీ ఫోన్ చేయాలని సూచించారు.