హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో కాజేసిన డబ్బును నిందితులు ఎక్కడకి తరలించారు? ఆ డబ్బుతో ఎక్కడ ఆస్తులు కొన్నారు? ఇందుకు ఎవరెవరు సహకరించారు? అనే కోణంలో సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు ఎక్కువగా లిటిగేషన్ ఆస్తులే కొన్నట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేయగా.. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. 9 మందిని కస్టడీలోకి తీసుకుని ఏసీపీ మనోజ్కుమార్ నేతృత్వంలో విచారిస్తున్నారు. సాయికుమార్ తన వాటా రూ.20 కోట్లను వివాదాస్పద ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడయింది. పెద్దఅంబర్పేట్లో 34 ఎకరాల పొలాన్ని రూ.5 కోట్లకు కొని, ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టినట్టు తెలిసింది. కేసులు అయినప్పుడు వివాదాస్పద ఆస్తుల స్వాధీనానికి వెనుకాడతారని, అందుకే డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న పొలాలపై పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తున్నది. నిందితుడు వెంకటరమణ కొండాపూర్, తణుకు, వైజాగ్లో రూ.6.5 కోట్ల విలువైన మూడు ప్లాట్లను కొనుగోలు చేసినట్టు గుర్తించిన పోలీసులు.. పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.