హైదరాబాద్: కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఇంకా నిర్మాణాత్మక దశలో ఉన్నప్పుడు ఏర్పడిన రాతి ఆనవాళ్లు, రాతి సిరలు సిద్ధిపేట సమీపంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం (KTCB) సభ్యులు గుర్తించారు. సిద్ధిపేటకు 50 కిలోమీటర్ల దూరంలోని గట్టుమల్లన్నగుట్టలోని గ్రానైట్ కొండపై సన్నని సిర లాంటి నమూనాలు కనుగొన్నారు. ఇవి 250 నుండి 280 కోట్ల సంవత్సరాల నాటి క్వార్ట్జ్ నిర్మాణాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. రాతి యుగానికి సంబంధించిన ఇటువంటి నిర్మాణాలు తెలంగాణలో దాదాపు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని అన్నారు. సన్నని, పొడవైన ఈ రూపాన్ని ప్రజలు రాతి సిరలుగా పిలుస్తారని వివరించారు. ఇటువంటి నిర్మాణాలు భూమి ఏర్పడటం గురించి వెల్లడిస్తాయని అన్నారు. అయితే కార్బన్ డేటింగ్ వంటి పద్ధతులు రాళ్లు, ఇతర భౌగోళిక అంశాలకు పని చేయవని వెల్లడించారు.
కాగా, గుట్ట చుట్టూ గ్రానైట్ ఏర్పడినప్పుడు ఇలాంటి క్వార్ట్జ్ సిరలు ఏర్పడే అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్ రావు తెలిపారు. ‘వందల కోట్ల సంవత్సరాల క్రితం శిలాద్రవం (కరిగిన శిల) ఉపరితలం నుండి బయటకు వచ్చినప్పుడు ఇలాంటి గ్రానైట్ నిర్మాణాలు ఏర్పడ్డాయి. అది చల్లబడినప్పుడు, శిలలు మరియు ఇతర కరిగిన రాతి పదార్థాల మధ్య అంతరాలు ఏర్పడే అవకాశం ఉంది. క్వార్ట్జ్ ఏర్పడటానికి ఈ అంతరాలలో అధిక సాంద్రత సిలిక కలిగి ఉంటుంది’ అని చెప్పారు.
ఈ సిరలు గ్రానైట్ ఉపరితలంపై మాత్రమే కాక, కొంత లోతు వరకు కూడా ఉన్నాయని వేణుగోపాల్ రావు తెలిపారు. ‘క్వార్ట్జ్, ఇతర సిలికేట్ పదార్థాలు స్థిరపడినప్పుడు అది పగుళ్లలోకి ప్రవేశిస్తుంది. పగుళ్ల ఉపరితలం కింద కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఉపరితలంపై వివిధ ఆకృతులలో ఏర్పడుతుంది. ఇది దైవిక వస్తువు అని ప్రజలు నమ్మేలా చేస్తుంది. వాస్తవానికి ఇది కేవలం ఒక సహజ భౌగోళిక కార్యకలాపం’ అని రావు వివరించారు. చాలా సందర్భాలలో అవి ప్రవహించిన ఒక నిర్దిష్ట దిశలో ఏర్పడినప్పుడు వాటికి ఒక దిశాత్మక ధోరణి కూడా ఉంటుందని అన్నారు. ఇలాంటి నిర్మాణాలు ఒక ప్రాంత భౌగోళిక చరిత్రలో పరిశోధనకు చాలా సహాయపడతాయని వెల్లడించారు. ఇటువంటి నిర్మాణాలు పెట్రోజెనిసిస్, అంటే శిలల మూలం, నిర్మాణం గురించి చాలా చెబుతాయన్నారు.