సూర్యాపేట, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో స్వయంగా తెలుసుకుంటూ అన్ని రంగాలకు అన్నీ చేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా అమలవుతుండడంతో ప్రజల్లో ఆనందాలు వెల్లివిరిస్తున్నాయి. ఇక జిల్లా విషయానికి వస్తే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి వేల కోట్లు తీసుకొచ్చి జిల్లా సమగ్రాభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా సూర్యాపేటలో జగదీశ్రెడ్డికి ముందు.. తరువాత అనే స్థాయిలో మార్పు చెందుతున్నది. సూర్యాపేటకు మెడికల్ కళాశాల రావడంతో జిల్లా ప్రజలకు విరివిగా వైద్య సేవలు అందుతున్నాయి. కొవిడ్ సమయంలో జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలే గాక పక్క రాష్ట్రమైన ఏపీ నుంచి కూడా ఇక్కడకు వచ్చి కొవిడ్ చికిత్స పొంది ఆరోగ్యంగా వెళ్లారు. తాజాగా జనరల్ ఆసుపత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో మంత్రి జగదీశ్రెడ్డి రూ.35 లక్షలతో 20 పడకలతో కూడిన ప్రత్యేక నవజాత శిశువు చికిత్స కేంద్రాన్ని (ఎస్ఎన్సీయూ) మంజూరు చేయించారు. ఈ కేంద్రాన్ని గత నెల 29న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించారు. ఇందులో నయాపైసా ఖర్చు లేకుండా నెలలు నిండని, తక్కువ బరువుతో జన్మించే నవజాత శిశువులకు ఊపిరి పోస్తున్నారు. దవాఖాన సూపరింటెండెంట్ ధరణీధర్రెడ్డి పర్యవేక్షణలో నవజాత శిశువులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయి.
20 వార్మర్లు.. అన్ని రకాల చికిత్సలు
నవజాత శిశు చికిత్సా కేంద్రంలో 20 వార్మర్లు ఉన్నాయి. గర్భంలో శిశువు ఉంటే ఎలాంటి వాతావరణం ఉంటుందో వార్మర్ల ద్వారా అదే వాతావరణం కల్పిస్తారు. కేంద్రంలో ఆక్సిజన్ అందించడం, అవసరం ఉన్న వారికి ప్రత్యేకమైన స్కానింగ్ మిషన్తో స్కాన్ చేయడం, కావాల్సిన మందులు ఇస్తున్నారు. దీంతోపాటు తల్లులకు మదర్ కేర్పై చిన్నపాటి శిక్షణ ఇచ్చి కొద్ది సమయం శిశువును తల్లి ఒడిలో ఉంచి పాలు ఇప్పించడం చేస్తున్నారు. ఈ కేంద్రంలో 24 గంటల పాటు చిన్న పిల్లల డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంటున్నారు. అలాగే పుట్టు కామెర్లు వచ్చిన శిశువులకు ఫొటో థెరపీతో నయం చేస్తున్నారు.
వంద మందికి పైగా శిశువులకు చికిత్స..
నవజాత శిశు చికిత్సా కేంద్రం ప్రారంభమైన 20 రోజుల్లో వందకు పైగా శిశువులు చికిత్స పొంది చిరునవ్వుతో తల్లి ఒడికి చేరుకున్నారు. వారందరికీ కలిపి దాదాపు 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఆదా అయింది. గతంలో తక్కువ బరువు, నెలలు నిండకముందే జన్మించిన శిశువులను కాపాడుకునేందుకు ఖమ్మం, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వెంటిలేటర్లలో చికిత్స అందించేందుకు గంటకు దాదాపు రూ.4వేల నుంచి రూ.10 వేల వరకు చార్జి చేస్తారు. ఇలా రెండు నుంచి వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచితే లక్షన్నర నుంచి 10 లక్షల వరకు వ్యయం అయ్యేది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తమ శిశువులను కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. ఈ క్రమంలో నవజాత శిశువులను రక్షించేందుకు, శిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో మంత్రి జగదీశ్రెడ్డి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో 20 పడకల ప్రత్యేక నవజాత శిశువుల కేంద్రం ఏర్పాటు చేయించారు. ఎస్ఎన్సీయూ ఏర్పాటు కావడంతో నిపుణులైన ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 20 రోజుల్లో వందకు పైనే మంది చిన్నారులు చికిత్స పొంది చిరునవ్వుతో బయటకు వచ్చారు. నవజాత శిశువుల ఆరోగ్యానికి మంత్రి జగదీశ్రెడ్డి ఇటువంటి ప్రత్యేక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం పట్ల చికిత్స పొందిన శిశువుల తల్లుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వారికి లక్ష.. నాకు ఉచితం
మా బంధువుల్లో ఒకరు గతేడాది ఏడు నెలలకే ప్రసవమైతే ఆ శిశువును కాపాడుకునేందుకు ఖమ్మం వెళ్లి వెంటిలేటర్లో ఉంచారు. అందుకు లక్ష రూపాయలకు పైనే ఖర్చు అయ్యింది. నాకు ఎనిమిది రోజుల క్రితం సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో ఫ్రీగా ఆపరేషన్ చేశారు. 1.7కిలోల బరువున్న ఆడ శిశువు జన్మించింది. ఆ శిశువును బతికించేందుకు ఈ ఆసుపత్రిలో పది రోజులుగా వెంటిలేటర్లో ఉంచారు. ఆరోగ్యంగానే బయటకు పంపిస్తామని డాక్టర్లు చెప్పారు.
– పూజిత, కేసారం
సకల సౌకర్యాలు ఉన్నాయి..
సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో తక్కువ బరువు, నెలలు నిండకుండా జన్మించే శిశువులను కాపాడేందుకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 24గంటల పాటు డాక్టర్లు, నర్సుల సంరక్షణలో ఈ కేంద్రం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ పూర్తిగా ఉచితమే అయినందున పేద, మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ శ్రీకాంత్భట్, నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఇన్చార్జి
1.40 కిలోల శిశువును బతికించారు..
మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన భూమికకు 20 రోజుల క్రితం సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో 1.40 కిలోల శిశువు జన్మించింది. 20 రోజులుగా ఆసుపత్రిలోని వెంటిలేటర్లో ఉంచి చికిత్స అందిస్తుండడంతో నా బిడ్డ కళు ్లతెరిచి చూస్తూ ఆరోగ్యంగా ఉందని భూమిక సంతోషంతో చెప్పింది. ఇంత తక్కువ బరువుతో జన్మిస్తే సాధారణంగా ఏ ఆసుపత్రి వారు కూడా టేకప్ చేయరు. కానీ.. ఇక్కడ మంచి చికిత్సను అందించారు. అవసరమైతే హైదరాబాద్కు కూడా పంపిస్తామని భరోసా ఇచ్చి ఇక్కడే చికిత్స అందించారు. ఈ అవకాశం కల్పించిన మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు.