సూర్యాపేట అర్బన్ ఫిబ్రవరి 20 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థ్ధుల బంగారు భవిష్యత్కు ఆదర్శ పాఠశాలలు బాటలు వేస్తున్నాయి. పేద విద్యార్థులకు ప్రైవేటుకు దీటుగా ఆంగ్లమాధ్యమ విద్యనందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. మార్చి 10 వరకు గడువు ఉంది.
2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతితోపాటు 7 నుంచి 10 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తులు కొనసాగుతున్నాయి. సీటు సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందుతుంది. ఆంగ్ల మాధ్యమ బోధనతోపాటు ఉచిత భోజన వసతి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో 26 పాఠశాలలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 26 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 9 పాఠశాలల్లో ఇప్పటికే 5,919 మంది, నల్లగొండ జిల్లాలోని 17 పాఠశాలల్లో 10,200 మంది విద్యార్థ్ధులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రవేశాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో సుమారు 500 మంది, నల్లగొండ జిల్లాలో 920 మందికి పైగా విద్యార్థ్ధులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.
మార్చి 10 వరకు దరఖాస్తుకు అవకాశం
ప్రవేశ పరీక్షకోసం విద్యార్థులు మార్చి 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా కులం, ఆదాయం, స్డడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటోతో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఆసక్తి కలిగిన విద్యార్థ్ధులు మార్చి 10లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రవేశం పొందిన విద్యార్థ్ధులకు హాస్టల్ వసతితోపాటు అన్నిరకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్య సైతం అందుతుంది.
– అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి, సూర్యాపేట