సూర్యాపేట అర్బన్, ఫిబ్రవరి 4: ఆత్మకూర్ ఎస్. మండలంలోని పాతర్లపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో తెలుగు మీడియం మాత్రమే ఉండడంతో 6,7 తరగతుల్లో అడ్మిషన్ల సంఖ్య పది మంది లోపే. స్థానిక విద్యార్థులు 150 మందికి పైగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్తుండడంతో ఉపాధ్యాయులు, స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. దాంతో అడ్మిషన్ల సంఖ్య ఐదింతలు పెరిగి ప్రైవేటు పాఠశాలల అడ్మిషన్లు తగ్గిపోయాయి. ఈ విద్యాసంవత్సరం 6, 7 తరగతుల్లో 30మందికి పైగా విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు. ఆంగ్ల మాధ్యమానికి ఉన్న ఆదరణ గురించి చెప్పడానికి పాతర్లపహాడ్ పాఠశాల ఉదాహరణ మాత్రమే. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు.. మన బడి ద్వారా అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సర్కారు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగనున్నది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా సర్కారు పాఠశాలల్లో ఇప్పటికే సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులు కొనసాగుతున్నా.. పూర్తి స్థాయిలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంగ్ల మాధ్యమంతో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్లానికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 950 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇప్పటికే 261 పాఠశాలల్లో అంగ్ల మాధ్యమం కొనసాగుతున్నది. మిగిలిన 689 పాఠశాలల్లోనూ సాంకేతిక సమస్యలను పరిష్కరించి
పూర్తిస్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో బోధించనున్నారు.
సర్కారు బడికే వెళ్తున్నాం..
గతంలో మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో సూర్యాపేటలో ప్రైవేటు స్కూల్కు వెళ్లేవాళ్లం. పొద్దుపొద్దున్నే నిద్ర లేచి రెడీ అయ్యి స్కూల్ బస్సులో వెళ్లేవాళ్లం. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సరికి చాలా ఆలస్యమయ్యేది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లిష్ మీడియం స్టార్ట్ చేయడంతో ఇక్కడికే వెళ్తున్నాం.
– బానోత్ అశ్విత, విద్యార్థిని, 6వ తరగతి
చాలా పెద్ద ఆట స్థలం ఉంది…
ప్రైవేటు స్కూల్కు వెళ్తే ప్లే గ్రౌండ్ లేదు. కానీ, మా ఊరి పాఠశాలలో పెద్ద గ్రౌండ్ ఉంది. సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత ఆడుకోవడంతో పాటు ఇంటికి వెళ్లగానే హోమ్ వర్క్ పూర్తి చేసుకోవడానికి సమయం చాలా ఉంటుంది. గతంలో బస్సులో సూర్యాపేటకు వెళ్లి రావడానికి చాలా సమయం పట్టేది. హరితహారంలో భాగంగా పాఠశాలలో మొక్కలను నాటి పరిరక్షిస్తున్నాం.
– కట్ట మోక్ష శ్రీ, విద్యార్థిని, 6వ తరగతి