-సూర్యాపేట, జనవరి 4(నమస్తే తెలంగాణ): వ్యవసాయం ప్రధానాధారమైన జిల్లాలో రూపాయి రాక మొదలయ్యేది ప్రధానంగా పల్లె నుంచే. కర్షకుడి చమట చుక్క నుంచి పుట్టే రూపాయి లోకమంతా తిరిగి అన్ని వర్గాల ప్రజలకూ భరోసాను కల్పిస్తుంది. వ్యవసాయం బాగున్న రోజుల్లోనే వ్యాపారాలు, కొనుగోలు శక్తి మెరుగ్గా ఉంటుండడమే ఇందుకు నిదర్శనం. ఈ మొత్తం చట్రంలో రైతే కీలకం. అలాంటిఅన్నదాతకు దన్నుగా నిలిచి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రైతుబంధును అందుకే అన్ని వర్గాల ప్రజలూ గుండెలకు హత్తుకుంటున్నారు. రైతులే గాక విద్యార్థులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు రైతు బంధు వారోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముగ్గులు, వ్యాస రచనలు, కేక్ కటింగ్లు, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలతో రైతు బంధు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రెండో రోజూ రైతు సంబురాలు సాగాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా రైతులు 8,95,044మందికి రూ.914కోట్ల రైతుబంధు అందింది. మంగళవారం సూర్యాపేట జిల్లాలో 7,804, నల్లగొండలో 16,109, యాదాద్రిలో 7,705 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది.
8,95,044 మంది రైతులకు రూ.914కోట్లు
రైతు బంధు డబ్బులు ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 8,95,044 మంది రైతులకు రూ.914,10,24,104 జమయ్యాయి. తాజాగా మంగళవారం 31,618 మంది రైతులకు రూ.84.53 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 7,804 మంది రైతులకు రూ.20,88,05,914 జమకాగా నల్లగొండ జిల్లాలో 16,109 మంది రైతుల అకౌంట్లలో రూ.43,18,41,790, యాదాద్రి జిల్లాలో 7,705 మంది రైతులకు రూ.20,46,05,546 జమయ్యాయి.
రెండోరోజూ ఉత్సాహంగా..
రైతుబంధు సంబురాలు పండుగ వాతావరణంలో సాగాయి. ఒక పథకం ద్వారా రైతులకు ఇప్పటివరకు దేశంలోని ఏరాష్ట్రంలోనూ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సాయం అందించలేదంటూ రైతన్నలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడా రైతుబంధు తరహా పథకాలతో ప్రభుత్వాలు రైతులను ఆదుకున్న దాఖలాల్లేవని నేతలు తమ ప్రసంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను వేనోళ్లా పొగిడారు. జిల్లావ్యాప్తంగా రైతులు సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి సంతోషాన్ని పంచుకున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాల్లోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రైతన్నల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో రైతుబంధు అక్షరాల రూపంలో రైతులు వరి నాట్లు వేశారు. సీతారాంపురం, చివ్వెంల మండలం బండమీది చందుపట్ల సహా పలు గ్రామాల్లో మహిళలు తమ ఇండ్ల ముంగిళ్లలో ముగ్గులు వేశారు. నల్లగొండ జిల్లా త్రిపురారం, కనగల్ మండలం చర్లగౌరారం తదితర గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. చివ్వెంల మండలం తిరుమలగిరి, తడకమళ్ల పాఠశాలల్లో వ్యవసాయం దాని ప్రాధాన్యత, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వ్యవసాయ రంగం పరిస్థితిపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు.
రైతు బంధు సంబురాల్లో చిత్రలేఖనం పోటీ
మిర్యాలగూడ రూరల్, జనవరి 4 : రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం తడకమళ్ల ప్రాథమిక పాఠశాలలో చిత్రలేఖనం పోటీ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు మామిళ్ల శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు వ్యవసాయ రంగంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు తెలియజేస్తూ వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నాం..
మేం 8ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాం. మా ఇద్దరు కొడుకులు నల్లగొండ, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నరు. మేం ఇద్దరం పొద్దున లేస్తే పొలం కాడనే ఉంటం. రోజంతా వ్యవసాయ పనులే. గతంలో ఏ ప్రభుత్వాలూ గిట్లా రైతులకు ఉపయోగపడే సాయం చేయలేదు. మాకు ఏటా 80వేల రూపాయలు రైతు బంధు డబ్బులు వస్తున్నయి. పెట్టుబడికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పత్తి, పామాయిల్, మినుములు, శనగలు పండిస్తున్నాం. సీజన్కు ముందే పెట్టుబడి సాయం పడడంతో ఎరువులు, విత్తనాలు సకాలంలో తెచ్చుకుంటున్నాం. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో అప్పులు లేకుండా వ్యవసాయం చేస్తున్నాం. సాగు నీరు కూడా పుష్కలంగా వస్తుంది. 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్నరు. ఎవుసాన్ని నమ్ముకున్న మాలాంటి రైతులకు ఈ రైతు బంధు పథకం ఎంతో భరోసానిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నం.
రైతులకు ఎంతో ఆసరా..
రైతు బంధు పథకం నిధులు పంట పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతున్నయి. వానకాలం, యాసంగి సీజన్కు ముందుగానే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల అప్పు కోసం ఎవ్వరి దగ్గరకూ వెళ్లాల్సిన అవసరం రాలేదు. మా నాన్న పేరు మీద 2 ఎకరాలు, మా అమ్మ పేరుమీద, నాపేరు మీద చెరో ఎకరం ఉన్నది. ఏటా రైతు బంధు డబ్బులు 40వేలు బ్యాంకు ఖాతాలో పడుతున్నయి. ఎప్పుడూ వరి సాగు చేసేవాళ్లం. కానీ, ఈ సారి యాసంగిలో వరికి బదులు వేరే పంటలు వేసుకోమన్నారు. అందుకే అర ఎకరంలో కూరగాయలు సాగు చేసుకుంటున్నా. రైతు బంధు డబ్బులు విత్తనాలకు, మందులకు ఉపయోగపడుతున్నయి.
పెట్టుబడి ఎల్తున్నది..
నాకు మూడు ఎకరాల పొలం ఉంది. పెట్టుబడి కోసం గప్పట్ల షావుకారు దగ్గర తెచ్చిన సొమ్ముకు మిత్తి కట్టలేక వ్యవసాయం పడావుపడ్డది. పండిన పంటకు అప్పు కూడా తీరకపోయేది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం అందిస్తున్నడు. ఇప్పటికి ఎనిమిది కార్లకు పెట్టుబడికి రైతు బంధు డబ్బులే ఆసరా అయినయి. వ్యవసాయానికి మళ్లీ జీవం వచ్చింది. రైతులందరికీ దేవుడిగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ సారు కడుపు సల్లంగా ఉండాలి.
రైతుల పాలిట వరం..
రాష్ట్రం ఏర్పడినంకనే రైతుల కష్టాలు తీరుతున్నయి. రైతుల బాగు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ తీసుకొచ్చిన రైతుబంధు పథకం మా పాలిట వరమైంది. గతంలో ఏటా వానలు పడుతుండగనే అప్పు కోసం షావుకారు చుట్టూ తిరుగాల్సి వచ్చేది. వారు చెప్పిన వడ్డీలకు తెచ్చి.. ఉందునా, పోదునా అన్న కరెంటుతో వ్యవసాయం చేసినా వచ్చిన డబ్బులన్నీ అప్పుకట్టేందుకే సరిపోయేది. కానీ ఇప్పుడు రైతు బంధు, 24 గంటల కరంటు, వాగులు, వంకలు, చెరువులు నిండుగా మారి వ్యవసాయం పండుగైంది. రైతుల బాగు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పనులు ఎంతో బాగున్నాయి.