న్యూఢిల్లీ, మే 23: నెల రోజుల క్రితం రోజుకు సుమారు 20 వేలకు మించి కరోనా పాజిటివ్ కేసులు, వెయ్యి మరణాలతో తల్లడిల్లిన ఢిల్లీ కుదుటపడుతున్నది. ఆదివారం అక్కడ 1,649 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 189 మంది మరణించారు. మార్చి 30 తర్వాత రోజూవారీ కేసులలో ఇంత తక్కువ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే ప్రథమం. ఇక వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో పాజిటివిటీ రేటు కూడా 2.42 శాతానికి పడిపోయింది. మరోవైపు, లాక్డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈనెల 31 దాకా లాక్డౌన్ పొడిగించిన సీఎం.. ఆ తర్వాత ఆంక్షలను దశల వారీగా ఎత్తివేస్తామని చెప్పారు. తొందరపడి ఆంక్షలను ఎత్తివేస్తే నెలన్నరగా పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
లాక్డౌన్ను పొడిగించిన మరికొన్ని రాష్ర్టాలు
గతంలో విధించిన లాక్డౌన్ గడువు ఆదివారానికి ముగియడంతో పలు రాష్ర్టాలు దానిని పొడిగించుతూ ఉత్తర్వులు జారీ చేశాయి. రాజస్థాన్లో లాక్డౌన్ను 15 రోజుల పాటు (జూన్ 8 దాకా) పెంచగా..హర్యానాలో లాక్డౌన్ ఆంక్షలను ఈనెల 31 దాకా పొడిగించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈనెల 31 దాకా లాక్డౌన్ అమల్లో ఉండనుంది.