నేటి నుంచి కొండగట్ట్టుపై అఖండ హనుమాన్ చాలీసా పారాయణం అంజన్న సేవాసమితి ధ్వర్యంలో ఏర్పాట్లపూర్తయిన ప్రత్యేక వేదిక
మల్యాల, మార్చి 16 : హనుమాన్ చిన్న జయంతికి ఒకరోజు ముందు నుంచే.. అంటే బుధవారం నుంచి కొండగట్టు అంజన్న సన్నిధిలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం పఠనం చేయనున్నారు. రెండు మండలాల కాలం (82రోజులు)పాటు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు చేపట్టేందుకు కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త కోనేరు సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ప్రత్యేక వేదికను వేశారు. ఆలయ నూతన కార్యాలయ భవనం ఎదుట అంజన్న చరిత్ర ఉట్టి పడేలా భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. బుధవారం జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలసి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యాహ్నం మూడు గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇప్పటికే ఇతరులు రాసిన ఐదు కోట్ల శ్రీరామకోటి ప్రతులను గుట్టపై ఉన్న వై జంక్షన్ నుంచి మేళతాళాలు, కరతాళ ధ్వనుల మధ్య శోభాయమానంగా ఆలయంలోని స్వామివారి వద్దకు చేర్చనున్నారు. అనంతరం వేదిక వద్దకు ఉత్సవమూర్తులను చేర్చి, ఆంజనేయస్వామికి అభిషేకం చేస్తారు. తదుపరి వేదపండితులు, అర్చకులు, హనుమాన్ దీక్షాపరులు, స్వామివారి భక్తులతో కలసి 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ పఠనం చేయనున్నారు. ఇలాగే ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు.. కొండపై 11 సార్లు పారాయణం చేస్తారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయాల్లోనూ పారాయణం చేయాలని కొండగట్టు అంజన్న సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చారు.