తన ప్రాణాలు పణంగా పెట్టి జన్మనివ్వడమే కాదు.. తన రక్తాన్ని పాలుగా మార్చి మనల్ని పెంచుతుంది తల్లి. మన అభివృద్ధి కోసం ఎన్నో సంఘర్షణలు పడి, మౌనపోరాటాలు చేసి పెద్ద చేస్తుంది. నిస్సందేహంగా జగన్మాతకు మరో రూపమే అమ్మ. అలాంటి అమ్మను ఎన్ని రకాలుగా పూజించినా, కీర్తించినా తక్కువే అవుతుంది. ‘మాతృవందనం’లో ఆ మాతృమూర్తి ఉన్నత రూపాన్ని, ఔన్నత్యాన్ని, అత్యున్నత స్థానాన్ని ఎన్నో విధాలుగా ప్రస్తుతించారు చంద్ర ప్రతాప్. ‘జన్మదాతే అసలు జగన్మాత’, ‘అమ్మ చూపు అమృత ధార’, ‘తాను చచ్చి బ్రతికి తనువిచ్చురా తల్లి’, ‘అమ్మ నవ్వులోని అందమే అందము’ అని కొనియాడారు.
ఇంతటితో ఆగలేదు. అమ్మను ఎంత అపు రూపంగా చూసుకోవాలో, ఆమె రుణం కొంతయినా ఎలా తీర్చుకోవాలో చెవి మెలేసి మరీ చెప్పారు. ‘మాతృదూషణంబు మనిషికి శాపంబు’ ‘అని హెచ్చరించారు. ‘మనకు అమ్మ కలదు తనకు ఏది?’ అని దేవుడి లోటుని గడుసుగా ఎత్తిచూపారు. ఈ పద్యాలన్నీ ఎంతో సరళంగా ‘విశ్వసూక్తి తరచి వినరచంద్ర’ మకుటంతో శ్రావ్యంగా సాగాయి. మనసును, మమతను కదిలించేలా అమ్మపాలతో తడిసి ఈ అక్షరాలు ప్రవహించాయి.
మాతృ వందనం
రచన: చంద్ర ప్రతాప్ కంతేటి
పేజీలు: 105, వెల: రూ. 100/-
ప్రతులకు : 8008143507
ప్రతి మనిషి పరుగూ జీరో దగ్గరే మొదలవుతుంది. కొందరు అడుగు ముందుకేయకుండా ఆగిపోతారు. మరికొందరు మధ్యలోనే నిష్క్రమిస్తారు. కష్టాల్ని అధిగమించి, నష్టాల్ని తట్టుకుని, అవరోధాలకు తలొంచకుండా అంతిమలక్ష్యాన్ని చేరి హీరో అనిపించుకునేవారు నూటికో కోటికో ఒక్కరు. అలా శూన్యం నుంచి అనంతానికి ఎదిగిన ఇరవైనాలుగు సంస్థల వ్యవస్థాపకుల గెలుపు కథల సమాహారం ఈ సంకలనం. చిటారు కొమ్మన మిఠాయి స్వప్నాన్ని అందుకునే క్రమంలో.. ఆత్మవిశ్వాసం, దార్శనికత, ప్రేరణ, సృజన, సాహసం, నిజాయతీ.. తదితర గుణాలు సోపానాలు అవుతాయని చాటేలా ఉంది ఈ పుస్తక ముఖచిత్రం.
బంధన్ బ్యాంకు వ్యవస్థాపకుడు, నీలోఫర్ చాయ్ బాబూరావ్, దోసె ప్లాజా ప్రేమ్ గణపతి.. ఇలా ప్రతి కథా విలక్షణమే, ప్రతి విజయం స్ఫూర్తిమంత్రమే. రచయిత సునీల్ ధవళ ఎంచుకున్న కథాకథనాత్మక పద్ధతి ఓ కారణం కావచ్చు.. ప్రతి వ్యాసం ఓ స్క్రీన్ప్లేలా అనిపిస్తుంది. చివరిపేజీకి చేరుకునేసరికి.. ఆ
జాబితాలో ఇరవై ఐదో వ్యక్తిగా చేరిపోవాలనే తపన మొదలవుతుంది. ఉత్తమ సాహిత్య లక్షణం కూడా ఇదే. ప్రతి విజయ యాత్రికుడూ చదవాల్సిన పుస్తకం. ఇందులోని ప్రతి వాక్యం ఓ గెలుపు సూత్రమే.
జీరో 2 హీరో
రచన: సునీల్ ధవళ
పేజీలు: 212; వెల రూ. 276
ప్రతులకు: 9741747700 ప్రధాన పుస్తక కేంద్రాలు, అమెజాన్