చిన్మయి.. అప్పటిదాకా భద్రునితో ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతున్న చేతిలోని మొబైల్ ఫోన్ను ముందున్న టేబుల్పై పెట్టి, వెనక్కి వాలి కళ్లు మూసుకుంది అలసటగా!
టైం తెలుసు ఆమెకు. రాత్రి పదకొండూ పది నిమిషాలు. మానవ శరీరం ఒక బయోవాచ్. సమయం తనంతట అదే తెలుస్తూ ఉంటుంది స్పృహిస్తే. బయట సన్నగా కురుస్తున్న వర్షం చినుకుల చప్పుడు లయాత్మకంగా వినిపిస్తూనే ఉంది. ఎందుకో ఆమె మనసు చాలా
ఉద్విగ్నంగా ఉంది.. కొండొకచో దుఃఖంగా కూడా ఉంది.
‘ఈ దేశంలో ఎందుకిలా విలువలూ, నీతీ నియమాలూ, ధర్మాధర్మ విచక్షణా, మానవీయ ఉదాత్తతా.. ఇవన్నీ వారసత్వంగా కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చీ వచ్చీ.. ఇప్పుడెందుకిలా అతి వేగంగా ధ్వంసమైపోతున్నాయి? కొండపైనుంచి జారిపడిపోతున్న బండరాయిలా! ఎటు చూసినా మనదేశం లోపలా, బయటి దేశాల్లో కూడా సకల మానవ జాతిలోనే సామూహిక విలువలు లుప్తమవుతూ సాంస్కృతిక విధ్వంసం కొనసాగుతూ వస్తున్నది. ఎందుకు.. ఎందుకిలా.. ఎందుకు ఈ నైతిక పతనం మహోధృతంగా ఒక మహాసముద్రపు ఉప్పెనలా దూసుకొస్తున్నది? ఈ దుష్టతరపు మానవ సమాజంపై కరోనాకంటే కూడా అతిప్రమాదకరంగా!’
ఆమె ముందున్న టేబుల్పై వరుసగా పేర్చి ఉన్న పదిహేను సంపుటాల ఇండియన్ నేషనల్ ఎపిక్.. భారతదేశ జాతీయ ఇతిహాసం, పంచమ వేదం.. వ్యాస విరచిత ‘మహాభారతం’ బౌండ్ సంపుటాలు పేర్చి ఉన్నాయి. టీటీడీ ఆ గ్రంథాలను ప్రచురించి, పద్దెనిమిది వందల రూపాయలకే అందిస్తున్నది. ఆ ధరకు కనీసం వాటి బైండింగ్ కూడా చేయించలేం. అవి వ్యాసుడు రచించిన ఒరిజినల్ మహాభారతానికి నన్నయభట్టు చేసిన తెలుగు అనువాద.. సరళ తెలుగీకరణ సంపుటాలు. ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని గత నెలరోజులుగా ఆ అన్ని సంపుటాలనూ పట్టువిడువక చదువుతున్న చిన్మయి.. చిట్టచివరి పదిహేనవ సంపుటిని కూడా చదవడం పూర్తి చేసి, ఒక రకమైన పూర్ణతృప్తి నిండిన మహదానుభూతితో పరవశించిపోతూ ప్రచలిస్తున్నది. వేదాలూ, శాస్ర్తాలూ, పురాణాలూ, ఉపనిషత్తుల పాఠాన్ని సమీకృతపర్చుకున్న ఈ ‘మహాభారతం’ అనబడే ప్రపంచ మహోత్కృష్ట మహాగ్రంథానికి వారసురాలై.. ఈ పుణ్యభూమిపై పుట్టిన తన జన్మ ధన్యమైనట్టేనా.. అనుకుంటూ, ఆమె తనను తాను ఒకసారి అవలోకించి చూసుకొని పులకించిపోయింది.
ఐదు వేల సంవత్సరాల క్రితం రాసినట్టు చెప్పే మహాభారతం.. ఇప్పటికి కూడా పరిపూర్ణ ఔచిత్యంతో, అన్వయానుకూలతతో వర్ధిల్లుతున్న ఈ ఇతిహాసంలో వ్యాసుడు ఏమన్నాడంటే..
‘యదిహాస్తి తదన్యత్ర, యన్నేహాస్తి న తత్ క్వచిత్’
అంటే.. ఇందులో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఎక్కడా లేదు’
( What is in mahabhaarata is every where. what is not in Mahabharata is nowhere ) – అని. ఈ ఇతిహాసంలో సృష్టించిన పాత్రల చిత్రణ
(Character delineation), ఉద్వేగ
వైవిధ్యత (Range of emotions) కూడా ఏ ఇతర గ్రంథాల్లోనూ లేదు.
చిన్మయి మొబైల్ ఫోన్ చటుక్కున మోగింది.. ఏదో లోకంలో మునిగిపోయిన ఆమె, ఉలిక్కిపడి ఫోన్ ఎత్తి..
“హలో” అన్నది. అటువైపు భద్రుడు.
“అంతా రెడీ మేడం”.
“మొత్తం ఎంతమంది మనవాళ్లు”.
“నలభై మంది మేడం”.
“స్థావరమెక్కడ”.
“జూబ్లీహిల్స్ మేడం”.
“మొబైల్ పబ్బా? ఒకవైపు మనం నిర్మూలించుకుంటూ పోతూంటే, మరోవైపు వాళ్లు జరాసంధుని బాడీలాగ మళ్లీ మళ్లీ పుట్టుకొస్తున్నారు కదా భద్రుడూ!” అన్నది. మళ్లీ తనే..
“ఖాళీగా ఉన్న భవనాలను కిరాయికి తీసుకొని, సర్కస్ గుడారాల్లా అప్పటికప్పుడు అంతా సెట్ చేసి, ఈ బహిరంగ దందా చేస్తున్న ఆ నిర్వాహకుణ్నీ, బిల్డింగును కిరాయికి ఇచ్చినవాణ్నీ ఈసారి బట్టలు విడిపించి.. నెత్తిపైన విస్కీ సీసాలను పెట్టి అదే జూబ్లీహిల్స్ నడిరోడ్డుపై ఊరేగిద్దామా భద్రుడూ!” అన్నది చిన్మయి ఐపీఎస్.
“కానీ, పొలిటికల్, బ్యూరోక్రాట్స్ ప్రెషర్..”.
“అది మామూలే కదా మనకు! చూద్దాం.. ముందు నేనూ, ఇంకో ఇద్దరు లేడీ స్టాఫ్ మఫ్టీలో వెళ్తాం. ట్రూ షేప్ బయటికొస్తది. ఇంకో పావుగంట తర్వాత రెడీ జంగ్.. నేనే అక్కడికొస్తా! లొకేషన్ షేర్ చెయ్యి”.
“ఎస్ మేడం!”.
“ఓకే”.. అంటూ ఫోన్ కట్ చేసి, కలెక్టర్కు లైన్ కలిపింది చిన్మయి.
అటునుండి కలెక్టర్.. “హలో!” అన్నాడు.
ఐదు నిమిషాల తర్వాత ఆయన జవాబు.. “ప్లీజ్ గో ఎహెడ్” అని రాగానే, లోపలినుంచి విద్యుత్తు విరజిమ్ముతుండగా లేచి నిలబడ్డది చిన్మయి. భూమిలోంచి మొలిచిన శివుడి శూలంలా!
v v v
భయం గొప్పదా? ప్రేమ గొప్పదా? అని ప్రశ్న. ప్రేమ అనేది ఒక మాయ. కథల్లో, సినిమాల్లో, ఉటోపియన్ కల్పితాల్లో తప్ప.. ప్రేమ ఎక్కడా దీర్ఘకాలం జీవిస్తూ, ఒక వ్యక్తి జీవితాంతం పొగచూరకుండా ఉజ్జ్వలమై తృప్తిని మిగిల్చిన సందర్భాలు ఉండవు. ‘ఆలుమగలు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రులు మాయ, తాను మాయ, మాయ తెలియనీదు దీనిల్లు పాడాయె విశ్వదాభిరామ వినుర వేమ’.. అన్న పద్యంలో వేమన నిష్కర్షగా చెప్పింది అబద్ధం కాదు. అయితే ప్రేమ మాయ అని తెలియడానికీ, మనిషి అంగీకరించడానికీ ఒక జీవితకాలం పడుతుంది. ఒక సర్వేలో ఇరవై వృద్ధాశ్రమాలలో ఉంటున్న దాదాపు ఐదువందల మంది వృద్ధులను ఒక్కరొక్కరిగా ఇంటర్వ్యూ చేసి, అందరి అభిప్రాయాలను క్రోడీకరిస్తే.. కన్నీళ్ల పర్యంతమవుతూ తొంభై శాతం మంది వెలిబుచ్చిన అభిప్రాయం ఏమిటంటే.. ‘ప్రేమ అనేది ఒక భ్రాంతి’ అని. అది యవ్వన దశలో ఉడికిస్తూ, ఉరికిస్తూ మత్తులా మనిషిని కమ్మేసి, చక్కిలిగిలి పెట్టి.. రాగితీగలో నుంచి అంతర్ధానమయ్యే కరెంటులా మాయమైపోతుంది. వయసు పెరుగుతున్నకొద్దీ వెలిసిపోయే రంగులా అంతా పాలిపోయి, పాతచెప్పులా మిగులుతూ, ఒట్టి వెలిసిపోయిన వాసనలేని కాగితపు పువ్వులా మిగిలిపోతుంది ప్రేమ.. పరమ వికారంగా! ఇక భయం.. నిత్య నూతనమూ, నిత్య యవ్వనీ అయినది. చిన్నప్పుడు నాన్న కొడతాడనీ, అమ్మ తిడుతుందనీ భయం. బడికి పోకుంటే పంతులు దండిస్తాడని భయం. పెద్దయ్యాక ఆఫీసర్ తిడతాడని భయం. తప్పు చేస్తే ఇంక్రిమెంట్ కట్ చేస్తాడనీ భయం. రోజులు గడుస్తూంటే.. మాట వినకుంటే పెళ్లాం రాత్రికి అన్నీ బంద్ చేస్తుందని భయం. ఒకప్పుడు మనకు భయపడే పిల్లలు.. మనల్ని భయపెట్టే స్థితికి ఎదిగిన తర్వాత, అవమానకరంగా భయపడలేక భయం. పోలీసోళ్లతో భయం, ఫీజులు ఇచ్చుకొని కూడా డాక్టర్లతో భయం. రాజకీయాల్లోనైతే పార్టీ పెద్ద పదవులివ్వడని భయం, ప్రమోషన్లు ఇవ్వడని భయం.. చివరికి పిల్లలు చరమదశలో పట్టించుకోక కుక్కతిట్లు తిడతారని భయం. భయమే శాశ్వతం! భయమే సత్యం! భయమే నిత్యం! భయమే జీవితమై.. అంతిమంగా అనుక్షణం వెంటాడుతూ రోగాలతో, నొప్పులతో సంక్లిష్టమై, చావుగా పరిణమిస్తూ.. భయమే మృత్యువు.
“కాబట్టి డియర్ ఫ్రెండ్స్! మనం భయమనే ఆయుధంతోనే ఈ సమాజాన్నీ, రోగగ్రస్తమైన ఈ వ్యవస్థలనూ, ఈ చిలుంపట్టి శిథిలమవుతున్న వర్తమానాన్నీ, అతిస్వేచ్ఛ అనే విచిత్రమైన వ్యాధితో బాధపడుతూ, దారి తప్పుతూ ఏ మరమ్మతులకూ లొంగని మొండి జబ్బుగా మిగిలిపోతున్న ఈ మనుషులను షాక్ ట్రీట్మెంట్తో సెట్రైట్ చేయాలె. బయల్దేరుదామా!”.. చిన్మయి తన నాలుగు బ్యాచ్లకు అప్పటికే స్పష్టమైన ఆదేశాలనూ, అసైన్మెంట్లనూ ఇచ్చింది. 30 మంది సుశిక్షితులైన నిజాయితీగల పోలీసులు ఒక జట్టు. ఏక కాలంలో నాలుగు
స్థావరాలపై దాడి.
ఔటర్ రింగ్రోడ్కు రెండు కిలోమీటర్ల దూరంలో.. ఒక ఫార్మ్హౌజ్. ఐదు ఎకరాలు. మధ్యలో దేదీప్యమానంగా వెలిగిపోతూ విలాసవంతమైన విల్లా. బయట అతివిశాలమైన పార్కింగ్ ఏరియా. టైల్స్తో ఫ్లోరింగ్. అన్నీ హైఎండ్ కార్లు. బీఎండబ్యూ స్థాయికి తగ్గకుండా జాగ్వార్లు, మెర్సిడెజ్ బెంజ్, ఆడి, పోర్చే, లెక్సస్, వోల్వో, ఫెరారీ, ల్యాండ్ రోవర్ వంటివి. వాటిని చూస్తేనే చిన్మయికి అర్థమైపోయింది.. లోపల మనుషులు ఎవరెవరు ఉంటారోనని.
అదొక అనఫీషియల్ అడ్డా. సకల అక్రమ దందాలకు ఆలవాలమై, అక్రమార్జనతో సర్వ దుర్లక్షణాలను కలిగి ‘డబ్బు మదం’ అనే వ్యాధితో కళ్లనూ, చూపునూ కోల్పోయి, హృదయాన్ని పోగొట్టుకొని, పొగరూ, దర్పమూ తలకెక్కి.. కన్నూ మిన్నూ కానక వ్యవహరించే ఒక ప్రత్యేక జాతితో ఏమి పని? ఈ మదాంధ జనానిది గుడ్లగూబ జాతి. దినమంతా ఎక్కడెక్కడో మంది కొంపలు ముంచుతూ, దేశాన్ని పందికొక్కుల్లా తోడుకు తింటూ.. రాత్రుళ్లు మాత్రం అతి చురుగ్గా సమూహాలు సమూహాలుగా, ఈ అసాంఘిక
స్థావరాల్లో మిలాఖతై.. బృందాలు బృందాలుగా సంచరించే రాక్షస తెగ అది.
బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, పేకాట, డ్రగ్స్, ఆల్కహాల్, వ్యభిచారం.. మనుషుల బలహీనతలన్నిటినీ క్యాష్ చేసుకుంటూ, అన్ని రకాల సౌఖ్యాలను ‘అమ్మకానికి’ పెట్టగలిగే వృత్తిలో తరించే పరాన్నభుక్కు అజ్ఞాత వర్గం ఒకటుంటుంది ఈ ఉన్నతవర్గ సమాజంలో! ‘గాలం వేసి చేపను పట్టు’, ‘చేపను వలలో పెట్టి బ్లాక్ మెయిల్ దందా చెయ్’, ‘యూజ్ అండ్ త్రో.. త్రో అండ్ ఎగైన్ యూజ్’, ‘హిట్ అండ్ మిస్’, ‘కిల్ అండ్ ఎస్కేప్’ వంటి థియరీలతో కర్కశ సాధన చేసిన జన్మతః క్రిమినల్స్ వాళ్లు. ఈ దేశ దౌర్భాగ్యమేమిటో గానీ, సోకాల్డ్ పెద్దలకు వీళ్లతోనే చాలా పని ఉంటుందెప్పుడూ. లేకుంటే ఈ దేశ పవిత్ర లోక్సభలో 50% మంది ప్రజాప్రతినిధులు నేరస్థులే ఎందుకుంటారు?
ముందు చిన్మయీ, భద్రుడూ మరో ఇద్దరు షూటర్స్ మఫ్టీలో వెళ్లారు లోపలికి. లోపల అంతా ఫిష్ మార్కెట్ కోలాహలం. ఒక పెద్ద రేవ్పార్టీ. హైదరాబాద్లోని చాలామంది కార్పొరేట్ హాస్పిటళ్లకు చెందిన ప్రసిద్ధ డాక్టర్లు ఉన్నారక్కడ.. తూలుతూ, అమ్మాయిల కౌగిళ్లలో తూగుతూ! విచ్చలవిడి శృంగార ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా ఓ ఇరవై ముప్ఫై పేకాట టేబుల్స్ ఉన్నాయి. టేబుల్స్ పైనే ఐదు వందల, రెండువేల రూపాయల నోట్ల కట్టలు పరిచి.. అంతా ఓ గమ్మత్తయిన మందూ, తిండీ మసాలాల వాసన.. పెర్ఫ్యూం మత్తు.. కల్లు దుకాణం కన్నా అధ్వాన్నంగా కోలాహలం! బేరర్స్ అందరూ శృంగారాన్ని ఒలకబోస్తున్న వయ్యారులే. చిన్మయి సూచనతో భద్రుడు వెళ్లి ఒక రౌండ్ అంతా పరికిద్దామని కదులుతూండగా.. ఇద్దరు బౌన్సర్లు ఉరికొచ్చారు. భద్రుడు చాలా హుందాగా, వ్యూహాత్మకంగా ప్రతిస్పందిస్తుండగా.. అర్థమైపోయింది నిర్వాహకులకు. ఇటువంటి డెన్లను నిర్వహించే వాళ్లందరిదీ నిజానికి రేచుకుక్క జాతి అయి
ఉంటుంది. వాసన పసిగట్టి ఎదురుదాడి చేయడం, అవసరమైతే తప్పించుకొని నీటిలోకి చేపలా జారిపోవడం వాళ్లకు అబ్బిన జన్మవిద్య. ఓ పది నిమిషాలు భద్రుడూ అండ్ అదర్స్.. ప్రాథమిక చర్యలు ప్రారంభించిన తర్వాత, చిన్మయి తన చేతిలోని పిస్టల్ను గాలిలోకి కాల్చి ఒక ఉలిక్కిపాటును క్రియేట్ చేసి.. సడెన్గా ఒక తుఫాన్ ఉప్పెనగా మారి పైబడ్డట్టు.. అంతా కకావికలు. చెల్లాచెదురు. తత్తరబిత్తర. అప్పుడు ప్రవేశించింది మిగిలిన ఇరవైకిపైగా పోలీసుల బృందం..
ఓ వార్నింగ్.. “ఎక్కడివాళ్లక్కడే ఉండండి. డోంట్ మూవ్” అని గంభీర ప్రకటన.
టీవీల్లో ‘బ్రేకింగ్ న్యూస్’ బాంబులు పేలుతున్నాయి. రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, పెద్దమనుషులు, బడా బాబులు, పరువులేని పనులు చేస్తూ పరువుకోసం పాకులాడేవాళ్లు..
గంట తర్వాత లెక్క తేలింది. ఎనిమిది మంది నిర్వాహకులు, ఒక ఆర్గనైజర్, దాదాపు వందమంది ఏజెంట్లు, వందకు పైగా యవ్వనవతులైన అమ్మాయిలు. గదుల్లో కొనసాగుతున్న అసభ్యకర శృంగార సంభోగ తంతు. భారీ స్థాయిలో డ్రగ్స్.. వయాగ్రా వంటి అనేక ఉద్దీపన టాబ్లెట్లు!
v v v
రెండో స్థావరం.
ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర్లో ఓ పది ఫర్లాంగుల దూరంలో.. ఒక నిశ్శబ్ద ఫార్మ్హౌజ్.. రెండు ఎకరాల్లో. బయట బోర్డ్.. వెంకటేశ్వరా గెస్ట్హౌజ్. లైట్లు వెలుగుతున్నాయి దేదీప్యమానంగా. ఎక్కడా ఎవరూ లేరు. పోర్టికో కింద ఐదారు మోటార్ సైకిళ్లు.. బుల్లెట్లు, పల్సర్, హార్లే డెవిడ్సన్.. ఇంకా ఏవేవో స్పోర్ట్స్ బైకులు. జీప్ను చూడగానే లోపలి నుంచి నెత్తికి రుమాలు చుట్టుకున్న ఒక రైతువంటివాడు పరుగెత్తుకొచ్చాడు. చేతులు కట్టుకొని..
“అయ్యా!” అన్నాడు వినయంగా.. భయం భయంగా.
“ఎవరిదీ గెస్ట్హౌస్?”.
ఆ పల్లెటూరి మనిషి తన బనీను జేబులో నుంచి ఒక విజిటింగ్ కార్డ్ తీసిచ్చాడు. లయన్ రమణకుమార్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రిటైర్డ్). గచ్చిబౌలి. ఇంకేవో వివరాలు.
“లోపలెవరున్నారు?”.
“ఆ.. మా అయ్యగారి బిడ్డ”.
“ఇంకా?”.
“ఆమె దోస్తీగాళ్లు”.
“మొత్తం ఎంతమంది?”.
“నలుగురు ఆడోళ్లు.. ఆరుగురు మొగపోరగాళ్లు సర్”.
“ఎప్పుడొచ్చిండ్లు?”.
“కాలేజీ నుంచి పగటీలి దొరా”.
“ఇప్పుడేం చేస్తాండ్లు లోపల?”.
“గదే.. తాగుడు తినుడు. మూజిక్ పెట్టుకొని చెంగడబింగడ ఎగురుడు! రూంలల్లకు పోయి ఇష్టమొచ్చినట్టు వాయివరుసలు లేకుంట దుకాణం పెట్టుడు”.
“మరి నువ్వేం జేస్తాన్నవ్?”.
“నేనేంజేస్త దొరా.. బక్కపీసుగాన్ని. ఈ చెల్క నాదే! రెండేండ్ల కింద అమ్మిన ఈ పోలీస్ సార్కు. పది లచ్చలకు. ఐదిచ్చిండు. ఈ బంగ్లా కట్టిండు.. మిగిలిన పైసలియ్యిమంటే.. ‘ఏ పోరా! ఇత్తతియ్యిర. ఏం జేసుకుంటవ్ పైసల్.. ఇక్కడ్నే పనిజెయ్యి నా దగ్గర..’ అంటడు. అడిగి అడిగి మా ముసల్ది పానం తీసుకుంది ఉరేసుకొని. అగో ప్రతిరోజూ వాని బిడ్డ, లేకుంటె వాని మదమెక్కిన కొడుకు.. దోస్తులను వెంటేసుకొని వస్తరు. ఒకటే తినుడు తాగుడు.. దుకాణం పెట్టుడు రూంలల్ల. ఛీఛీ లండు ముండలు, దొంగ ముండా కొడుకులు సారు”.
.. అంతా అర్థమైపోయింది సీఐ అర్జున్రెడ్డికి. లోపలికి సరసరా వెళ్లి.. స్వర్గలోకంలాంటి ఆ ఇంటీరియర్లో.. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లి ఒక గది తలుపులను హ్యాండిల్తో బాది.. తెరుచుకున్నాక చూస్తే.. మద్హోష్లో తూలుతూ ఒక రొయ్యకాళ్ల పోరడు. అటుపక్క బెడ్ మీద ఒంటిపై బట్టలు తొలగిపోయి అన్నీ కనబడుతున్న స్థితిలో ఇద్దరు అమ్మాయిలు.. మద్హోష్. దగ్గరికి వెళ్లి పరిశీలనగా గమనిస్తే.. ఐదారు ఖాళీ బీర్ సీసాలు, పక్కన సిల్డినాఫిల్ సిట్రేట్ పెనెగ్రా టాబ్లెట్స్.. టాడాల్ఫిల్ మెగాలిస్ – 50 బిళ్లలు.
ఈ విచ్చలవిడితనం, అతి స్వేచ్ఛ, ఎవరి హద్దూ అదుపూలేని బీభత్స ప్రవర్తన.. అడిగేవాళ్లెవరూ లేని.. అస్సలే పట్టించుకోని తల్లిదండ్రులు. ఏమిటిది? వీళ్లేనా భావిభారత పౌరులు. ‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని శ్రీశ్రీ చెప్పింది అక్షరాలా సత్యమేగదా!
అర్జున్ రెడ్డి మొబైల్ మోగింది.
“రిపోర్ట్”.. చిన్మయి గొంతు.
“మనకొచ్చిన రిపోర్ట్ కరెక్టే మేడం”.
“హౌమెనీ?”.
“మొత్తం పది మంది మేడం!”.
“కరెక్టా? వివరాలన్నీ రికార్డ్ చేసుకొని, అందరినీ అరెస్ట్ చేసి తీసుకురా స్టేషన్కు.. ఓవర్!”.
v v v
స్థావరం మూడు.
జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 12.
మధురా బృందావనం. రాత్రి మూడున్నర.
సెక్యూరిటీ గూర్ఖా లోపలికి రానివ్వలేదు.. ఎవ్వరినీ ఎంత సముదాయించినా! చిన్మయి సైగ చేయగానే భద్రుడు వాణ్ని మెడలమీద ఒకరకంగా మెలికపెట్టి ఒత్తాడు. అంతే.. వాడు స్పృహతప్పి గిలగిలా కొట్టుకున్నాడు.
పది పోలీస్ టొయోటా కార్లు బుల్లెట్లలా దూసుకొచ్చి, ఆ విశాల ఆవరణలో ఆగాయి. అంతా నిశ్శబ్దం. అటు పక్కన ఒక షెల్టర్ కింద లోపల ఉన్న తొమ్మిదిమంది స్వతంత్ర ఎమ్మెల్యేలకు చెందిన పద్దెనిమిదిమంది గన్మెన్లు మస్తుగా తాగి, కూన్పాట్లు పడుతూ ఏ ఒక్కరు వచ్చినా.. పట్టించుకోకుండా, గమనించకుండా పొర్లుతున్న తరుణంలో..
ఒక విశాలమైన హాల్లో, నిశ్శబ్ద విందు జరుగుతున్నది. టేబుళ్లపై అన్నీ ఇంపోర్టెడ్ సీసాలు. వివిధ రకాల వెజ్, నాన్ వెజ్ అద్భుత వంటకాలు. అందరికీ సర్వ్ చేస్తున్న ఆడ పరిచారికలు.. ఏదంటే అది అందించేందుకు!
చిన్మయి లేజర్ చూపులతో అందర్నీ గమనించి.. గుర్తుపట్టి..
ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నాడు..
లోస్వరంతో..
“ఇప్పటిదాకా మా ఆడిటర్ గారు మీరందరూ ఇటీవలి ఎన్నికల్లో పెట్టిన ఖర్చును మదింపుజేసి.. అనుకున్న ప్రకారం దానికి రెట్టింపు మొత్తాలను అన్నీ రెండువేల నోట్లతో సూట్
కేసుల్లో నింపి మీ మనుషులకు చెప్పి భద్రంగా మీరు చెప్పిన ఇండ్లకు చేరవేశారు. ఇట్స్ ఓవర్. ఇక రేపు మీరు మా పార్టీలో చేరుతున్నట్టు అఫీషియల్ ఫార్మాట్లో ఒక వినతిపత్రం విడుదల చేస్తారు. మిగతా అన్ని సంగతులను మా పీఏ చూసుకుంటాడు. ఓకే!”. టపటపా చప్పట్లు.
ఆ ప్రసంగాన్నీ, పరిసరాలనూ అదృశ్య
కెమెరాలు రికార్డ్ చేశాయి. చిన్మయి మెల్లగా చప్పుడు కాకుండా నడుస్తూ, అందరూ విందుకోసం కూర్చున్న చోటుకు వెళ్లి నిలబడి.. నిశ్శబ్దంగా చూస్తూండగా.. ఆ ప్రతిపక్ష నాయకుడి పీఏ.. మొబైల్తో ఎవరికో ఫోన్ చేయబోయాడు.
“నో మిస్టర్ జగదీశ్!” అరిచింది చిన్మయి.
అంతా నిశ్శబ్దం.
“యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్”.
అంతా ఉక్కపోత.. అందరికీ! ఆ చల్లని ఏసీ హాల్లో.. ఎందుకో బయట కుక్కలు గుంపుగా అరవడం వినిపిస్తున్నదప్పుడు.
నగరం అట్టుడికిపోయింది.. అన్ని ఛానెళ్లలో బ్రేకింగ్ న్యూస్లతో.
ఉదయం ఆరు వరకు చిన్మయి నాలుగో స్థావరం.. నగరంలోని పది ఆన్లైన్ వ్యభిచార గృహాల్లోనుంచి మొత్తం ఇరవై రెండుమంది వేశ్యలను పట్టుకొని తెచ్చారు. అందరూ రాజమండ్రి, పాలకొల్లు, కరీం
నగర్, వరంగల్కు చెందినవాళ్లు. ప్యాసింజర్ ఆన్లైన్లోనే మనిషిని నెట్లో చూసి బుక్ చేసుకుంటాడు. డబ్బును ఫోన్ పే చేస్తాడు చెప్పిన అకౌంట్కు. వాళ్లు ఓటీపీ లాగా ఒక కార్ నంబర్ ఇస్తారు.. టైంతో సహా! ఆ సమయానికి కారూ, అమ్మాయీ వస్తారు ప్యాసింజర్ అపార్ట్మెంట్కు. అంతా వస్తు మార్పిడి. నో రిఫండ్.
చిన్మయి ముందే కోర్టునూ, జిల్లా కలెక్టర్నూ, తనలా ఏకరీతి అభ్యుదయ ఆలోచనలుగల సహ ఐపీఎస్ అధికారులనూ కలిసి.. కోర్టులో సుమోటో పిటిషన్ కోసం విజ్ఞప్తి చేసి.. ఒక అవినీతి ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మిస్తున్నది.
ఉదయం పది గంటలకు.. జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ .. పార్క్ ఏరియా. అన్ని మీడియా చానెళ్ల కెమెరాలు కళ్లు తెరిచి చూస్తుండగా.. చిన్మయి తన వెంట పదుల సంఖ్యలో సహ ఐపీఎస్ ఆఫీసర్లను తీసుకొని.. అందరూ మోస్ట్ యంగ్.. వెంట గత దినపు చానెళ్లలో ప్రకటించిన నాలుగు స్థావరాలపై జరిగిన దాడుల్లో అరెస్ట్ చేసిన మొత్తం నూటా అరవై రెండు మంది.. డాక్టర్లు, లాయర్లు, కొందరు పోలీస్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, అనేకమంది వేశ్యలు, కాలేజ్ ఎగ్గొట్టి రసికులైన ఫాంహౌస్ పావనకారులు, విద్యార్థులు.. అందరినీ ఫొటోలతో సహా.. ప్రజల సందర్శనార్థం ప్రత్యక్ష పరిచినపుడు.. అక్కడ ప్రజల తీర్థం! జాతర! సమాజంలో సెలెబ్రిటీలుగా చెలామణి అవుతున్నవాళ్లు.. తప్పుచేసిన శిశు తరగతి పిల్లలకన్నా హీనంగా సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉన్న పెద్దలను చూస్తూండగా.. చిన్మయి మాట్లాడటం
ప్రారంభించింది.
“వీళ్లందరూ ఏ కారణం చేతనైతే అరెస్టయి మీముందు నిలబడి తలలు వంచుకొని ఉన్నారో.. ఇప్పుడు వాళ్లకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. తాము ఎంత బ్లండర్ చేశారో! ఈ క్షణం వీళ్లందర్నీ వాళ్ల వాళ్ల భార్యాపిల్లలు, కుటుంబసభ్యులు, స్నేహితులు టీవీల్లో చూస్తూంటారు. వీళ్లను కోర్టులో ప్రవేశపెడితే, ఎన్ని రూపాయలు జరిమానా విధించినా నిస్సిగ్గుగా కట్టి జారుకుంటారు. మళ్లీ మళ్లీ ఇటువంటి తప్పులే చేస్తుంటారు. నిజానికి ఈ ప్రవర్తనకు కారణం.. వీళ్లలో జెనెటికల్గా ఉన్న నేరప్రవృత్తి. విచ్చలవిడితనం. అనుభవిస్తున్న అతిస్వేచ్ఛ. సమాజంపట్ల అసలు బాధ్యతే లేని జులాయితనం. మనుషులకు అసలైన శిక్ష.. వాళ్ల పరువు పోతున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలముందు సిగ్గుతో తలదించుకొని నిలబడ్డ వీళ్లందరూ.. ఇకముందు ఇటువంటి తప్పులను మళ్లీ చేయరని బలంగా నమ్ముతాను నేను. కోర్టులు వీళ్లకు జరిమానా విధిస్తే అప్పుడే కట్టి వెళ్లిపోతారు. లేదా డబ్బు కట్టి బెయిల్ తెచ్చుకుంటారు. దోషిగా నిలబెట్టి మనిషిలో పరివర్తన తెచ్చినపుడు.. అది మనిషిని శాశ్వతంగా మారుస్తుంది. మరో ముఖ్యమైన విషయం గమనించండి.. వీళ్లందరూ విద్యావంతులు. వీళ్లే ఎక్కువగా తప్పులు చేస్తూ సమాజానికి తలవంపులు తెస్తున్నారు. ఈ దేశానికి వేల కోట్ల రూపాయలను బ్యాంకులద్వారా ఎగ్గొట్టి మోసం చేస్తున్నవాళ్లందరూ ఉన్నత విద్యావంతులూ, హైలీ క్వాలిఫైడే! వేలకోట్ల రూపాయలను ఈ రకంగా తస్కరించినవాళ్లే ఈ మన సమాజానికి చీడపురుగులు..” చిన్మయి గంగలా గలగలా ప్రవహిస్తున్నది.
ఒక్క గంగే క్షేత్రాన్నంతటినీ శుభ్రిస్తూ ప్రక్షాళన చేయగలదా? భ్రష్టుపట్టి పోతున్న విశృంఖలతతో తమను తామే ధ్వంసించుకుంటున్న ఇప్పటి తరం ఈ సత్యాన్ని గ్రహిస్తూ స్పృహించాలె.. ఆలోచించండి. ప్రతి మనిషీ ఒక నది కావాలె. ప్రవహించాలె. మనందరి చుట్టూ కాలుష్య కారకాలైన టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, చేయి చాస్తే అందే సకల విచ్చలవిడి సౌకర్యాలు, ల్యాప్టాప్లు.. ఇవన్నీ రెండువైపులా పదునున్న కత్తుల్లాంటివి. మనల్ని మనమే.. మనపైకి దండెత్తే ఈ అదృశ్య కాలుష్యంనుంచి కాపాడుకోవాలె!
ఆలోచన ఒక అగ్నిమొలక. అది దహిస్తుంది. వెలుగిస్తుంది కూడా!
ప్రొఫెసర్ రామా చంద్రమౌళి
ప్రొఫెసర్ రామా చంద్రమౌళి.. కవి, కథకులు, నవలాకారులు
విమర్శకులు. మెకానికల్ ఇంజినీరింగ్లో పీజీ చేశారు. ఇప్పటివరకూ 76 పుస్తకాలను ప్రచురించారు. అందులో 32 నవలలు, 385 కథలు, 12 కవిత్వ సంపుటాలు, 3 నాటకాలు, 4 విమర్శా గ్రంథాలు. 2011లో గ్రీస్లో, 2016లో తైవాన్లో జరిగిన ‘ప్రపంచకవుల
సదస్సు’లలో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 2386 ఎంట్రీలను పరిశీలించి, ప్రపంచవ్యాప్తంగా 60 మందికి ప్రకటించిన ‘నాజి నామన్ ప్రపంచస్థాయి జీవితకాల సాఫల్య పురస్కారం – 2019’ భారతదేశంలో ఒక్క రామా చంద్రమౌళి మాత్రమే దక్కించుకున్నారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు చేతులమీదుగా ‘కాళోజీ పురస్కారం – 2020’ అందుకున్నారు. వీటితోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను దక్కించుకొన్నారు.
-ప్రొఫెసర్ రామా చంద్రమౌళి,
93901 09993