సాధారణ ఉద్యోగాలకు… సైనికులు, అంబులెన్స్ డ్రైవర్ల ఉద్యోగాలకు చాలా తేడా ఉంటుంది. సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తారు. ఇక ఇతరుల ప్రాణాలను రక్షించే క్రమంలో అంబులెన్స్ డ్రైవర్లు ఒక్కోసారి భోజనం మానుకుని మరీ పనిచేస్తారు. అయితే, వాళ్ల తిండి గురించి ఆలోచించే వాళ్లు అంతగా ఉండరనే చెప్పాలి. తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి దగ్గర్లోని కట్టూర్కు చెందిన కార్తికేయన్, మనీష దంపతులు మాత్రం ఈ విషయంలో ఇతరులకు భిన్నంగా ఆలోచించారు. సైనికులు, అంబులెన్స్ డ్రైవర్లకు ఉచితంగా ఆహారం పెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఉదార హృదయాల వెనక వారి జీవిత నేపథ్యం ఉండటం విశేషం.
పదిహేనేండ్ల కింద… 2009లో కార్తికేయన్ బైక్ ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో అంబులెన్స్ డ్రైవర్ సరైన సమయంలో దవాఖానలో చేర్చకపోయి ఉంటే ఈ రోజు కార్తికేయన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగిలేది కాదు. అప్పుడే అంబులెన్స్ డ్రైవర్ల ప్రాధాన్యం అతనికి తెలిసివచ్చింది. కార్తికేయన్ 2014లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. క్వాలిటీ ఇంజినీర్గా పనిచేస్తున్నప్పుడే సొంత వ్యాపార ఆలోచన ఉండేది. కానీ, అతను ప్రారంభించిన వ్యాపారంలో నష్టాలు రావడంతో.. అది ఎక్కువకాలం నడవలేదు. మనీష 2017లో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేసింది. 2019లో కార్తికేయన్, మనీష పెళ్లి చేసుకున్నారు.
2021లో కట్టూర్లో సొంతంగా ‘తిరుమురుగన్ ఇడ్లీ షాప్’ పేరుతో ఓ ఫుడ్వ్యాన్ నిర్వహిస్తూ ఆహార వ్యాపారంలోకి వచ్చారు. అప్పటినుంచి అంబులెన్స్ డ్రైవర్లు, ఆర్మీ సిబ్బందికి ఉచితంగానే టిఫిన్ పెడుతున్నారు. రిటైరైన వాళ్లకూ ఈ సదుపాయం ఉంది. ఈ ఇడ్లీ బండిలో ఇడ్లీలతోపాటు అన్ని రకాల దోశలు దొరుకుతాయి. బండిపై ‘అంబులెన్స్ డ్రైవర్లు, ఆర్మీ సిబ్బందికి ఆహారం ఉచితం’ అని రాసి ఉన్న వాక్యం అక్కడికి వచ్చేవాళ్లకు ప్రధాన ఆకర్షణ. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఫలహారపు బండి తెరిచి ఉంటుంది. “మా ఇద్దరి తాతయ్యలు సైన్యంలో పనిచేశారు.
ఒకరు యుద్ధంలో ప్రాణాలు అర్పించారు కూడా. దేశం కోసం వాళ్లు చేసిన సేవల గురించి మాకు చెప్పేవాళ్లు. అవి మా గుండెలను తాకాయి. అలా ఆర్మీ అంటే చిన్నతనంలోనే గౌరవం ఏర్పడింది. దాంతో సైనికులను మాకు తోచినవిధంగా గౌరవించాలనుకున్నాం” అంటాడు కార్తికేయన్. ఈ దంపతులు తమ వ్యాపారాన్ని తిరుచ్చి నగరంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ఆలోచన చేస్తున్నారు. అంతేకాదు జీవితం దినదినగండంగా పోరాడుతున్న వాళ్లకు కూడా పైసలు తీసుకోకుండానే తిండి పెడతామని చెబుతున్నారు. ఉచిత ఆహారాన్ని ఆ దంపతులు ఏదో సేవగా భావించడం లేదు. మనస్సాక్షిగా చేస్తున్నారు.