‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
“రైట్.. రైట్..” నన్ను అక్కడ దింపి.. కండక్టర్ కేకతో వెళ్లిపోతున్న ఆర్టీసీ బస్సు కనుమరుగయ్యాక తలతిప్పి ఊరివైపు చూశాను. సీతారామపురం! చేతిలో బ్యాగ్ను భుజానికి వేసుకొని, దగ్గర్లోని ‘టీ స్టాల్’ వైపు కదిలాను. “సీతారామపురానికి ఎలా వెళ్లాలి?”.. టీతాగి, డబ్బు చెల్లిస్తూ అడిగాను. “అదేంది సారూ! అట్లా అడుగుతారూ? ఇదే సీతారాంపూర్!” అన్నాడతను నవ్వుతూ. “ఉహుఁ.. ఇది కాదు! ఈ రోడ్డునుంచి రెండు కిలో మీటర్లు వెళ్తే వస్తుంది చూడూ..” అని నేననగానే.. “ఓహోఁ.. ఊరికి ఆ సివరా? ఐనా ఆడ ఏముందనీ? పాడుబడ్డ రాములోరి గుడీ, పాత సర్కారీ ఇస్కూలే కదా?” అన్నాడు. అది వింటూనే.. “య్యస్స్.. అదే! ఆ గుడీ, ఆ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికే వెళ్లాలి నేను!” అన్నాను ఉత్సాహంగా.
“అట్నా? మరి సెప్పరే?” అని తలూపి, చేత్తో దూరంగా చూపిస్తూ.. “ఆ మెకానిక్ షాప్ పక్కనే లోనికి రోడ్డుంటాది. ఆడ నిలబడినారంటే షేరింగ్ ఆటోలొస్తయి. పది రూపాయలిస్తే గుడికాడ దింపుతాయి సారూ!” అన్నాడు. “థాంక్యూ! ఆటో అక్కర్లేదులే! నడిచే వెళ్తాను!”. ఆ మాటకు అతను ఆశ్చర్యపోయాడు. “ఏందీ! అంతదూరం నడిసెల్తారా?”. “ఔను! ఒకప్పుడు ఈ రోడ్డునుంచి రాములవారి గుడిదాకా కొన్నివేలసార్లు నడిచినవాణ్ని. నేను చదువుకున్నది ఆ సర్కారీ స్కూల్లోనే! మా ఊరు ఈ రోడ్డుకు ఇటుపక్కనుండే రంగంపేట. రోజూ ఉదయాన్నే మా ఊర్నుంచొచ్చే ఏదో ఒక ఎడ్లబండిలో ఇక్కడిదాకా వచ్చి, ఇక్కణ్నుంచి స్కూలుకు నడిచే వెళ్లేవాణ్ని!” అన్నాను. “అట్నా? కానీ, తవర్ని ఈ సుట్టుపక్కల ఎప్పుడూ నేను సూడ్నేదే?!” అన్నాడతను. అక్కణ్నుంచి కదలబోతూ వెనక్కితిరిగి..
“నీ వయసెంతోయ్?” అనడిగాను.
“పోయిన్నెల్లోనే నలభై రెండు దాటినాయి! ఐనా.. నా వొయిసెందుకు సారూ?” అర్థంకానట్లు అడిగాడతను. “ఏం లేదులే! సరిగ్గా నువ్వు పుట్టిన ఏడాదే నేను ఈ ఊర్నుంచి.. కాదు ఈ దేశం నుంచే వెళ్లిపోయి ఇప్పుడొచ్చాను!” అని అక్కణ్నుంచి కదిలాను. రోడ్డునుంచి ఊర్లోకి అరగంటకి పైగా నడిచి, ఓ మూడుదారుల కూడలి చేరుకొని, ఎదురుగా కనిపించినదాన్ని చూసి ఆగిపోయాను. సీతారామస్వామి దేవాలయం! గుడి ముందునుంచి ఉత్తరంగా ఊర్లోకి వెళ్లేదారి ఇప్పటికీ మట్టిరోడ్డుగానే ఉంది. ఆ రోడ్డుకు ఇటుపక్క ‘ప్రభుత్వ ఉన్నత పాఠశాల – సీతారామపురం’ అనే బోర్డుతో.. దీనావస్థలో ఉన్న స్కూలు, దానికి ఎడమపక్క తుప్పుపట్టి, చువ్వలూడిపోయిన ఇనుపగేటుతో, పాడుబడ్డ కాంపౌండ్ వాల్తో పార్కు అక్కడే ఉన్నాయి. కానీ, వాటి ‘కళ’లోనూ, ‘ప్రభ’లోనూ వచ్చిన మార్పుల్ని గమనిస్తూ.. అలాగే ఉండిపోయాను. కాసేపటికి తేరుకుని, నెమ్మదిగా స్కూలు వైపు నడిచాను.
“నేనిక్కడికి హెడ్మాస్టర్గా వచ్చి ఐదేళ్లు అయ్యింది సార్! మిగతా స్టాఫంతా కొత్తవాళ్లే! వాళ్లుకూడా రిక్రూట్ అయ్యాక మొదటి రెండుమూడేళ్లు రూరల్ స్కూళ్లలో పనిచేయాలన్న రూలుంది కాబట్టి ఈ స్కూల్లో ఉన్నారు. కాస్త సీనియారిటీ రాగానే వాళ్ల నేటివ్ ప్లేస్లకో, పక్కనే ఉన్న టౌన్లకో ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్లిపోతుంటారు. అంతేతప్ప.. ఇలాంటి స్కూళ్లలో ఏ టీచరూ ఎక్కువకాలం ఉండరు సార్! అలాంటిది, నలభయ్యేళ్ల క్రితం ఈ స్కూల్లో పనిజేసిన..” అంటూ మళ్లీ ఆయనే.. “అవునూఁ.. ఆయన పేరేంటన్నారూ?” అని అడిగారు ఆ స్కూల్ హెడ్మాస్టార్. “శంకరం మాస్టారు!”.
“ఆఁ! ఆయన, ఆయన ఫ్యామిలీ గురించి అడిగితే.. నేనేం చెప్పగలను సార్?!”
నిస్సహాయత వ్యక్తం చేశాడాయన. “ఇట్స్ ఓకే! ఈ స్కూల్లో ఎంక్వయిరీ చేస్తే శంకరం మాస్టారు ఫ్యామిలీ గురించి తెలుస్తుందన్న ఆశతో చాలాదూరం నుంచి వచ్చానండీ! ప్చ్.. మై బ్యాడ్లక్!” నిరాశగా కుర్చీలోంచి లేవబోయాను. అంతలోనే ఆయనేదో గుర్తొచ్చినట్లు.. “అన్నట్టూఁ… మా రామ్మూర్తిని కలిస్తే మీకేమైనా ఉపయోగం ఉండొచ్చు సార్!” అన్నాడు. “రామ్మూర్తా? ఆయనెవరు?”.. ఏదో చిరు ఆశ కళ్లలో మెదుల్తూండగా అడిగాన్నేను. “మా ఆఫీస్ క్లర్క్ సార్! ఈ ఊరివాడే.. స్కూలు పనిమీద డీఈవో ఆఫీసుకెళ్లాడు. లంచ్కల్లా వచ్చేస్తాడు. ఇంకో గంటసేపే కదా సార్.. మీరు మా స్టాఫ్రూమ్లో వెయిట్ చేయొచ్చు!” అన్నాడు. “థాంక్స్ అండీ! మీ రామ్మూర్తి వచ్చేలోపు స్కూలు కాంపౌండ్లోనే అలా తిరిగొస్తాను..” అని నేను లేవబోతూండగా.. “శంకరం మాస్టారు మీకు బంధువా సార్?” అడిగాడు హెడ్మాస్టర్. “కాదు.. నలభైమూడేళ్ల క్రితం నేను ఇదే స్కూల్లో చదివేటప్పుడు మాకు లెక్కలు చెప్పిన మాస్టారు!”. “ఓ! మీ సార్ను కలవడానికి వచ్చారన్నమాట!”. “నేనాయన్ని కలవలేకపోవచ్చు. నేను ఎనిమిదో క్లాసు చదివేటప్పుడే ఆయనకు యాభైయ్యారేళ్లు. మే బీ..
హి ఈజ్ నో మోర్!”. “మరి?”.
“వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్నైనా కలుద్దామనీ!”. “కలిసి?”.. ఆసక్తిగా ముఖంపెట్టి అడుగుతున్న హెడ్మాస్టర్ను చూస్తూ నవ్వుతూ చెప్పాను.. “కలిసి.. ఆ తర్వాత ఇంకేమీ లేదు. కలవాలని వచ్చాను. కలిసి వెళ్లిపోతాను. అంతే!”. “ఇంతకీ.. మీరెక్కణ్నుంచి వచ్చారు సార్?”. “కౌలాలంపూర్!”.
పాతకాలపు కట్టడం కాబట్టి పద్ధతిగా, స్కూలు అవసరాలకు తగినట్లుగా ఉందా ప్రాంగణం! లోపల క్లాస్రూమ్స్ ముందున్నట్లే.. స్కూలు బయట కూడా మెయిన్డోర్కు అటూఇటూ ఏడడుగుల కారిడార్, దాన్నుంచి ఐదుమెట్లు కిందికి దిగితే.. ఎడమవైపుంది పార్కు. చువ్వలూడిపోయి ఉన్న గేటును తోసుకుని లోనికెళ్లాను. గేటుకు అభిముఖంగా అటుచివర సిమెంటు దిమ్మెపై ఓ చేత్తో గీత, మరోచేత్తో చేతికర్రతో నవ్వుతూ నడిచొస్తున్న గాంధీగారి విగ్రహం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది.. పెచ్చులూడిపోయి, దుమ్మూ ధూళితో నిండిపోయి.. దీనంగా నవ్వుతూ! నడుస్తూ వెళ్లి గాంధీగారి విగ్రహం దగ్గరికి చేరుకున్నాను. చుట్టూ మూడుమెట్లు కట్టి, దానిపై నాలుగడుగుల ఎత్తున్న గుండ్రటి సిమెంటు దిమ్మెపై నిర్మించిన విగ్రహమది.
బ్యాగులోంచి న్యూస్పేపర్ తీసి మెట్టుపై పరచి కూర్చున్నాను. గాంధీబొమ్మ మొదట్లోని మెట్లతో నా అనుబంధం ఏనాటికీ మర్చిపోలేనిది. నలభైమూడేళ్ల క్రితం.. ఎన్నో మధ్యాహ్నాలు ఇక్కడే కూర్చుని ‘శారద’తో మాట్లాడాను! మధ్యాహ్నం భోజనాల వేళకు స్కూలుబెల్లు మోగగానే.. క్లాసుల్లోంచి టిఫిన్ బాక్సులతో పార్కులోకి పరిగెత్తుకొచ్చే తోటిపిల్లలతోపాటు నేనూ, శారద కూడా వచ్చి.. ఇదిగో.. ఈ మెట్లపైనే కూర్చునేవాళ్లం! శారద పైమెట్టుపై.. నేను కిందిమెట్టుపై! “ఒరేయ్ఁ.. ఇలా పైకొచ్చి కూర్చోరా!” అంటూ శారద తన పక్కన స్థలం చూపిస్తున్నా.. “ఒద్దులే శారదా! మీరు గొప్పింటోళ్లు. నేనిలా కింద కూర్చుంటేనే బావుంటుంది!” అనేవాణ్ని. “సర్సరేఁ.. ఇవాళ మీ అమ్మ బాక్సులో ఏంపెట్టి పంపిందో చూపించరా!” అనేది. “ఏముంటుంది శారదా.. జొన్నసంగట్లో పచ్చడో, కారమో! మీలాగా రోజుకో కూర చేసుకునే స్తోమత కాదుగా! పండగలూ, పబ్బాలప్పుడు నూకల అన్నం చేసుకోవడమే మహాగొప్ప మాకు!” అంటూ మూతతీసి చూపించేవాణ్ని.
“మీ అమ్మచేసే సంగటి భలేరుచిగా ఉంటుందిరా! ఏదీ.. నాకు సగమిచ్చి, నా బాక్స్లోంచి సగం అన్నం తీసుకో!” అంటూ, రెండుబాక్సులూ అందుకొని భాగాలు పంచేది. అంతేనా.. రోజూ తన బాక్సులో సున్నుండలో, కజ్జికాయలో పెట్టుకొచ్చి.. “ఒరేయ్ఁ.. కాకెంగిలి చేసిస్తానుండు!” అంటూ తన పరికిణీ వాటిపై కప్పి కొరికి, సగంముక్క ఇచ్చేది నాకు. శారద నన్నెప్పుడూ ‘ఒరేయ్ఁ..’ అనే పిలిచేది. నిజానికి అప్పట్లో నన్నెవరూ పేరుపెట్టి పిలిచేవారు కాదు. పేద కుటుంబానికి చెందిన వాడినవడంతో ‘అరేయ్ఁ.. ఒరేయ్ఁ..’ అనేవాళ్లందరూ. కానీ, మా అమ్మ తర్వాత శారద పిలుపే నాకు నచ్చేది. బహుశా ఇద్దరి పిలుపుల్లోనూ ఆప్యాయత నిండిన ‘మాతృస్పర్శ’ ఉండటం వల్లేమో! శారద.. స్కూల్లో మాకు లెక్కలు చెప్పే శంకరం మాస్టారి మనవరాలు! అప్పట్లో.. ఆడపిల్లలకు చదువు అక్కర్లేదని స్కూలుకు పంపని తల్లిదండ్రులు చాలామందే ఉన్నారు. పంపించినవాళ్లు కూడా ఏడో క్లాసుతో అమ్మాయిలకు చదువు ఆపించేసి పెళ్లిళ్లు చేసేసేవారు. అలాంటి రోజుల్లో తన మనవరాలిని ఎనిమిదో క్లాసులో చేర్పించిన ఆదర్శవాది ఆయన. ఆపై శారద ఎంతవరకు చదువుకుందో నాకు తెలీదు. ఎనిమిదో క్లాసులోనే నేను ఈ ఊర్నుంచి వెళ్లిపోయాను కాబట్టి!
నాకింకా గుర్తుంది. కౌలాలంపూర్ ఓడరేవులో కాంట్రాక్టర్గా ఉన్న మా మేనమామ.. భర్తను కోల్పోయి, కొడుకుతో ఒంటరిజీవితం గడుపుతున్న తన చెల్లినీ, నన్నూ తనతోపాటు కౌలాలంపూర్ తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు.. మేము ఈ ఊర్నుంచి వెళ్లిపోయే ముందురోజు సాయంత్రం.. ఇదే పార్కులో, ఈ గాంధీబొమ్మ దగ్గరే.. ఈ మెట్లమీదే, ఇలాగే కూర్చుని.. నాతో శారద అన్నమాటలూ, అప్పటి సంఘటన, ఇప్పటికీ నా మనసులో సజీవంగా ఉన్నాయి.
* * *
“ఏంట్రా.. ఎందుకా కన్నీళ్లు?”.“నాకు.. మా మావయ్యతో వెళ్లాలని లేదు శారదా!”. “ఎందుకురా వెళ్లనంటావ్? కడుపుకి పట్టెడన్నం కూడా నోచుకోలేక అవస్థపడుతూ ఈ పల్లెటూర్లో నువ్వూ, మీ అమ్మా ఎన్నాళ్లని కష్టపడతార్రా? మీ అదృష్టంకొద్దీ మీ మావయ్య మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటూంటే..” శారద ఇంకేదో అనబోతూండగా.. మధ్యలోనే అడ్డుతగుల్తూ.. “మా అదృష్టమేం కాదు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు తప్ప వారసులెవరూ లేరు. ఆమెను నాకిచ్చి పెళ్లిచేసి.. తన ఆస్తికీ, వ్యాపారానికీ నన్ను వారసుణ్ని చేసుకోవాలనుకున్న ఆయన స్వార్థం!” అన్నాను కసిగా. “ఏమైతేనేం? నీకూ, మీ అమ్మకూ ఈ కష్టాలు తప్పుతాయి కదరా! మీ మావయ్య ఆలోచనలో తప్పేం లేదురా! అయినా, నువ్వు ఈ ఊళ్లోనే ఉంటే ఏం బాగుపడ్తావురా? మీ మావయ్యతో వెళ్తే నిన్ను బాగా చదివించి, గొప్పవాణ్ని చేస్తాడు! నువ్వు పెద్దపెద్ద చదువులు చదివేసి, బాగా గొప్పవాడివైపోయి, కార్లలో, విమానాల్లో తిరుగుతూంటే.. నాకు చూడాలని ఉందిరా! ఏరా.. నీకలా అవ్వాలని లేదూ?” అన్నది ఆప్యాయంగా.
“మరింకేంట్రా? ఎందుకా కన్నీళ్లు.. చెప్పూ!”. “మరీ.. మరీ.. ఇక్కణ్నుంచి వెళ్లిపోతే ఇంక నేను నిన్ను చూళ్లేను కదా శారదా!” అన్నాను. అంతే.. అప్పటివరకూ ఊరడింపు మాటలతో నన్ను ఓదార్చిన శారద ఒక్కసారిగా అరచేతుల్తో ముఖం కప్పుకొంటూ భోరుమన్నది. ఏమనాలో, ఏం చేయాలో అప్పుడు తెలీలేదు నాకు. “అదేమిటి శారదా!? ఇంతసేపు నాకు ధైర్యంచెప్పి, ఇప్పుడు నువ్విలా..” అని మాత్రం అనగలిగాను. మోకాళ్లలో ముఖాన్ని దాచుకొని కొద్దిసేపటివరకూ వెక్కివెక్కి ఏడుస్తూ ఉండిపోయింది శారద. ఆ తర్వాత తలెత్తి పరికిణీతో కళ్లు తుడుచుకుంటూ.. “నిజమేరా! నువ్వీ ఊర్నుంచి వెళ్లిపోతే నీ కష్టాలు తీరిపోతాయనీ, పెద్దచదువులు చదివి, గొప్పోడివవుతావు అనుకున్నానే కానీ.. ఇంక నువ్వు నాకు కన్పించవన్న విషయం.. నిజంగా నాకు గుర్తురాలేదురా!” అన్నది. కొద్దిసేపాగి, మళ్లీ తనే అన్నది..
“అయినా, నువ్వు వెళ్లడమే మంచిదిరా! ఈ ఊళ్లో ఉంటే నువ్వేం పైకొస్తావు చెప్పు? వెళ్లు.. మీ మావయ్యతో వెళ్లి, బాగా గొప్పోడివైపో! అప్పుడు ఈ ఊరుగానీ, ఈ శారదగానీ నీకు గుర్తొస్తే.. మళ్లీ రా! ఇదిగో.. ఇక్కడే కూర్చుని ఏమేం చేశావో, ఎలా గొప్పోడివయ్యావో అన్నీ చెబ్దువుగాని! నీకోసం, నువ్వు చెప్పే కబుర్లకోసం ఎదురుచూస్తూ ఉంటాను. సరేనా?”.
అంతే.. ఆ తర్వాత పెద్ద శూన్యం!
అక్కడితో నా బాల్యం అసంపూర్తిగా ఆగిపోయిందో, అసంతృప్తిగా ముగిసిపోయిందో తెలీదుకానీ.. ఆ మర్నాటినుంచే నా పోరాటం మొదలైనట్లు నాకు జ్ఞాపకం! మళ్లీ ఇన్నాళ్లకు.. సగంలో వదిలేసిన నా బాల్యాన్ని మరోసారి తాకాలని వచ్చిన ఇన్నేళ్లకు.. నాకు తెలీకుండానే నా మనసు ఘోషిస్తున్నది. ‘వచ్చాను శారదా! ఇక్కణ్నుంచి వెళ్లిపోయాక జీవితంలో విజయం సాధించాకే నీ ఎదుటకొచ్చి అన్ని కబుర్లూ చెప్పాలన్న లక్ష్యంతో జీవనపోరాటం చేశాను. నా జీవితాన్ని సార్థకం చేసుకున్నాననే అనుకుంటున్నాను. మా మావయ్య ఆస్తిని వందరెట్లు పెంచాను. ఆయన కూతురుకు మంచి భర్తనయ్యాను. ఇద్దరు బిడ్డల్ని కని, ప్రయోజకుల్ని చేసి ఓ తండ్రిగా విజయం సాధించాను. వాళ్ల పెళ్లిళ్లు చేసి తాతయ్యను కూడా అయ్యాను. నాకిప్పుడు పెళ్లీడుకొచ్చిన ఇద్దరు మనవలు, ఇద్దరు మనవరాళ్లు! బాధ్యతలన్నీ ముగించుకుని, స్వేచ్ఛాజీవినై.. జీవితంలో అతిముఖ్యమైన, చివరిగా మిగిలిన ఒకేవొక్క పని.. నిన్ను కలిసేందుకే వచ్చాను. ఇన్నాళ్లూ ఏమేం చేశానో, ఎలా కష్టపడ్డానో, ఎన్ని సమస్యలకు, ఎంత సంఘర్షణకు గురయ్యానో.. ఆ కబుర్లన్నీ నీకు చెప్పుకోవడానికే వచ్చాను. నీకోసం, నీకోసమే వచ్చాను శారదా!’ నా ప్రమేయం లేకుండానే నా మనసు మౌనంగా భాషిస్తూంటే.. పరిసరాలను మర్చిపోయి, చాలాసేపు గతం తాలూకు జ్ఞాపకాల్లోనే ఉండిపోయాన్నేను.
ఎంతసేపయ్యిందో తెలీదు కానీ.. “సార్..” అన్న పిలుపుతో తలెత్తి చూశాను. “నా పేరు రామ్మూర్తి సార్!”.. పార్కుగేటు దగ్గర ఓ వ్యక్తి నిల్చుని.. ఏదో అంటున్నాడు. “శంకరం మాస్టారు గురించి వినడమేకానీ, నేనాయన్ని చూళ్లేదు సార్! నాకు ఊహ తెలిసేటప్పటికే ఆయన పోయారు. అయితే ఆయన రిటైరయ్యాక ‘శారద గురుకుల విద్యాలయం’ పేరుతో ఓ ప్రైవేటుస్కూలు పెట్టారనీ, ఆయన ఉన్నంతకాలం ఆ స్కూలు బాగానే నడిచేదంటారందరూ. ఆయన తర్వాత వాళ్లబ్బాయి నారాయణరావు మేనేజ్మెంట్లో స్కూలు బాగా దెబ్బతిని, చాలా నష్టపోయారాయన. బాకీలు తీర్చేందుకు ఇల్లు అమ్మేసి, ఊరిచివర అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత వాళ్ల కుటుంబం బాగా చితికిపోయింది సార్!” నడుస్తూ చెప్తున్నాడు రామ్మూర్తి. “శంకరం మాస్టారుకు శారద అనే మనవరాలుండేది కదా!” అన్నాను నేను అతనితోపాటే నడుస్తూ. “అవును సార్! నారాయణరావుగారి కూతురే ఆవిడ! శారదమ్మ పెళ్లినాటికే వాళ్ల కుటుంబం బాగా చితికిపోయింది. ఆవిడని పక్క ఊర్లో పంచాయతీ ఆఫీసులో పనిచేసే ఓ గుమాస్తాకిచ్చి చేశారు. ఏడాదైనా తిరక్కముందే ఆఫీసులో అతనేదో అక్రమానికి పాల్పడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. దాంతో తాగుడు, పేకాటకూ అలవాటుపడి అప్పులపాలయ్యాడు. వాటినుంచి తప్పించుకోడానికి పుట్టింటినుంచి డబ్బు తెమ్మని శారదమ్మను చాలా హింసించేవాడట!”.
శారద గురించి తెలిసేకొద్దీ గుండెజారి, మనసు పొడిబారి, నాలుక తడారిపోతూ ఉంటే.. “శారదకు పిల్లలేమైనా!?..” అర్ధోక్తిగా నేనేదో అడగబోతూండగా.. రామ్మూర్తి చెప్పసాగాడు.. “అప్పులోళ్ల బాధలు పడలేక శారదమ్మ భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శారదమ్మకు ఒకే కూతురు. ఊరినిండా అప్పులు. పైగా అత్తగారింట్లో నిలువ నీడలేని స్థితిలో కూతుర్ని తీస్కొని శారదమ్మ అన్నావదినల ఆశ్రయం కోరుతూ మళ్లీ ఈ ఊరు చేరింది. శారదమ్మ కూతుర్ని తన కొడుక్కు చేసుకున్నాడు వాళ్లన్నయ్య. శారదమ్మ జీవితంలో ఊరట కలిగించినదేదైనా ఉంటే.. అది ఇదే! కూతురుకు పెళ్లిచేసే శక్తిలేని ఆమె పరిస్థితికి జాలిపడి ఆమె కూతుర్ని తమ కోడలిగా చేసుకున్న అన్నావదినలకు చివరివరకూ ఊడిగం చేసింది!”. “అంటే?!” రామ్మూర్తి చెప్పింది వినగానే షాక్ తిన్నట్లుగా నా నోట్లోంచి కీచుగా వెలువడిందా మాట. “అవును సార్! అసలే భర్త పెట్టిన చిత్రహింసలకు శారదమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. పైగా, అన్నావదినల ఇంట్లో రాత్రనకా, పగలనకా బండెడు చాకిరీతో మనిషి పూర్తిగా క్షీణించిపోయి, సరైన వైద్యం కూడా అందక ఐదేళ్ల క్రితమే కాలంచేసింది!”.
రెండు క్షణాలాగి, మళ్లీ చెప్పసాగాడు రామ్మూర్తి..
“శారదమ్మ కూతురుకు ఇద్దరు సంతానం. ఓ అమ్మాయి, అబ్బాయి! మనమిప్పుడు వెళ్తున్నది వాళ్లింటికే! ఇప్పుడు ఆ అమ్మాయి.. అంటే శారదమ్మ మనవరాలు పెళ్లీడుకొచ్చింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ అమ్మాయిపెళ్లి ఎలా చేయాలన్నదే ఇప్పుడా కుటుంబా నికున్న అతిపెద్ద సమస్య!” చెప్పటం ముగించి.. “ఇదిగోండి సార్! వాళ్లింటికొచ్చేశాం!” అంటూ ఆ వీధిలోని మూసి ఉన్న ఓ ఇంటితలుపు తట్టాడు రామ్మూర్తి. రామ్మూర్తి చెప్పిన విషయాలకు మనసు మూగవోయి, ఆలోచనలు ఆగిపోయిన మానసిక స్థితిలో.. గుండెను చిక్కబట్టుకునే ప్రయత్నంలో ఉన్న యాభై ఐదేళ్ల నేను.. “ఎవరు కావాలండీ?” అంటూ తలుపు తెరిచిన వ్యక్తిని చూసి నివ్వెరబోయాను. అవే చారెడేసి కళ్లు, అదే కోటేరు ముక్కు, అదే చిన్నినోరు, పాలుగారే చెక్కిళ్లు, నల్లటి ఒత్తయిన కురులు, పొడవాటి జడ, పండు నిమ్మపండులాంటి మేనివర్ణంతో ఉన్న ఆ అమ్మాయిని చూసి.. నివ్వెరబోయిన నేను.. మరింత నిర్ఘాంతపోయాను.
“ఏమిటండీ.. మాట్లాడరే? ఎవరు కావాలీ?”.
ఔను.. అదే కోయిల కంఠస్వరం! అప్పటి శారద.. ‘నాకోసమే మళ్లీ అలాగే తిరిగొచ్చిందా..?!’ ఆ అమ్మాయి మరోసారి రెట్టించేసరికి.. కంగారులో.. “నువ్వూ.. శారద.. శారదా.. నువ్వేనా?” అంటూ పొంతనలేని మాటలు నా నోటినుంచి వెలువడుతూంటే.. ఆ అమ్మాయి చిరునవ్వుతో అన్నది. “అవును.. నేనే శారదని!”.
సరిగ్గా ముప్ఫై ఆరు గంటల తర్వాత.. కౌలాలంపూర్ వెళ్లే విమానంలో కూర్చున్న నేను.. సీటు వెనక్కివాలి కళ్లు మూసుకుంటూ నాలో నేనే ప్రశ్నించుకున్నాను. ‘శారద నాకేమవుతుంది? తనతో నాకున్న అనుబంధమేమిటి?’. చిత్రమైన విషయమేంటంటే.. ఇన్నేళ్లలో ఈ ప్రశ్న ఎప్పుడూ నా మెదడులో మెదలలేదు. ఇప్పుడాలోచిస్తూంటే.. ఓ తల్లిగా, ఓ చెల్లిగా, ఓ అక్కగా, ఓ స్నేహితురాలిగా, ఓ ప్రేయసిగా, ఓ గురువుగా, ఓ మార్గదర్శిగా, ఓ స్ఫూర్తిదాయినిగా.. ఉహుఁ శారదతో నాకున్న అనుబంధం వీటిలో ఏ ఒక్కదానికీ అందనిదనిపిస్తున్నది. ‘నేను శారదను అభిమానించానా? ప్రేమించానా? ఆరాధించానా?’ అని ఆలోచిస్తే.. ఈ పదాలలో వ్యక్తం చేయలేని అలౌకికభావంతో ఆమెను వీక్షించానేమో.. అనిపిస్తున్నది. ఏదిఏమైనా.. కొన్ని ‘ఆత్మబంధా’లను అర్థం చేసుకోవడానికీ, అన్వయించుకోవడానికీ, నిర్వచించడానికీ, వ్యక్తీకరించడానికీ మనుషులు ఏర్పరచుకున్న ‘భావజాలం’ సరిపోదేమో అనిపించింది.
ఎన్నో ప్రశ్నలూ, విశ్లేషణలతో మనసు మథనానికి గురయ్యాక.. అంతిమంగా ఓ స్పష్టమైన భావం నాలో స్వచ్ఛంగా స్థిరపడింది. ‘శారదా! నేను వెళ్తున్నది మళ్లీ తిరిగిరావడానికే! నిన్ను కలవలేకపోయినా నీ ప్రతిరూపమైన నీ మనవరాలిని నా మనవడికి చేసుకొని, నా ఇంటికి తీసుకెళ్లడానికి వెంటనే వస్తాను. నీకు చెప్పాలనుకున్న కబుర్లన్నీ ఆ చిట్టితల్లికి చెప్పుకొంటాను..’ సీటు వెనక్కి తలవాల్చి కళ్లు మూసుకున్న నా ముఖంలో నిశ్చింతతో కూడిన నిశ్చయం మెరిసింది.
రచయితగా, ప్రచురణకర్తగా సుపరిచితులు ఎస్వీ. కృష్ణ. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ చదివారు. న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. ఫైన్ ఆర్ట్స్ (శిల్పం)లో బీఎఫ్ఏ డిగ్రీ సంపాదించారు. మ్యూజిక్ (వయోలిన్)లో బీఏ చేశారు. కథక్ శాస్త్రీయనృత్యంలో డిప్లొమా చేసి, జాతీయ ప్రదర్శనలూ ఇచ్చారు. ఇక సాహిత్యంలో.. కవి, కథా రచయిత, నవలా రచయిత, వ్యాసకర్త, విమర్శకుడు, ప్రచురణకర్త కూడా. ‘జయంతి పబ్లికేషన్స్’ ప్రచురణ సంస్థను స్థాపించి, వర్ధమాన రచయితలు మొదలుకొని లబ్ధప్రతిష్ఠులైన సాహితీవేత్తల రచనలు 400కుపైగా పుస్తకాలుగా ప్రచురించారు. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ సాగిన ఈయన రచనలు.. దాదాపు అన్ని ప్రముఖ దిన – వార – పక్ష – మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. రేడియో – దూరదర్శన్లలోనూ ప్రసారమయ్యాయి. ఎన్నో రచనలకు బహుమతులు, సన్మానాలు దక్కాయి. సాహిత్యం – రచనావ్యాసంగాలనే వృత్తి, ప్రవృత్తిగా మలుచుకొని జీవనయానం సాగిస్తున్నారు ఎస్వీ కృష్ణ.