పనిమనిషి సుబ్బులు గిన్నెలన్నీ తోమేసి, వంటింట్లోని అరల్లో చక్కగా సర్దేసింది. గ్యాస్ పొయ్యి పక్కనే తనకోసం అమ్మగారు ఉంచిన స్టీలు గిన్నెను చూసి..‘సుగాత్రి అమ్మగారు ఎంత మంచోరో!’ అని మురిసిపోయింది.ఇందాక రాగానే.. “ఈ మధ్యన ఏం తిన్నా సయించడం లేదమ్మా! నోరంతా అదోలా అయిపోయింది” అని చెప్తే, నవ్వింది అమ్మగారు.“నీళ్లోసుకున్నావు కదా సుబ్బులూ! ఈ
సమయంలో అలానే ఉంటుందిలే. నిన్ననే మా అమ్మ పాత మాగాయ, పాత నిమ్మకాయ పచ్చడి పంపించింది. నువ్వు గిన్నెలు తోమేసేలోగా నిమ్మకాయ పచ్చడి తీసి ఉంచుతాను. తీసుకెళ్దువుగాని. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే, నోటికి అరుచి పోతుందిలే” అన్నది.
అప్పుడే తనకోసం తీసి పెట్టడం కూడా అయిపోయిందన్నమాట.
‘ఎల్లొత్తాను. తలుపేసుకోండమ్మా!’ అని అమ్మగారికి చెప్పడానికి హాల్లోకి వెళ్లిన సుబ్బులు.. అరమోడ్పు కండ్లతో తన్మయంగా, ఆనందంగా కూతురికి పాలిస్తున్న సుగాత్రిని చూసి అలాగే విస్మయంగా చూస్తుండిపోయింది.
ఎవరో తననే తదేకంగా చూస్తున్నట్టు అనిపించింది సుగాత్రికి. కండ్లు తెరిచి సుబ్బులుని చూసి, నవ్వులు చిందిస్తూ..
“ఏంటలా చూస్తున్నావ్! ఓ నెల రోజులు కండ్లు మూసుకున్నావంటే, నీకూ ఇలాంటి భాగ్యం కలుగుతుందిలే!” అన్నది.
తన పొట్టకేసి ఆనందంగా చూసుకుంటూ, సిగ్గుపడుతూనే అడిగింది సుబ్బులు.
“బిడ్డకు పాలిస్తుంటే అంత ఆనందంగా ఉంటుందా అమ్మా! నేను ఇక్కడికి వచ్చి పది నిమిసాలయినా మీరు నన్ను సూడనే లేదు!”.
“అవును సుబ్బులూ! బిడ్డకు పాలివ్వడం మాతృమూర్తికి ఓ వరం అనుకో! అంతేనా, తల్లి ప్రేమనంతా రంగరించి ఇచ్చే అమ్మపాలు, బిడ్డకు అమృతంలాంటివి తెలుసా?”.
సుబ్బులు కంటే సుగాత్రి ఐదారేళ్లు చిన్నదే అయినా, చదువుకున్నది కావడంతో గర్భిణిగా ఉన్న సుబ్బులుకి అవకాశం దొరికినపుడల్లా ఏదో ఒక కొత్త విషయం చెబుతూనే ఉంటుంది. కుంటిసాకులతో పనికి నాగాలు పెట్టదు సుబ్బులు. పైగా బిడ్డతల్లి అయిన తను ఒక్కతే పనులు చేసుకోలేదని, తమకీ వాళ్లకీ కూడా కరోనా సోకకుండా తను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించే సుబ్బులంటే సుగాత్రికి ఎంతో అభిమానం.
పిల్లలంటే సుబ్బులుకి ఎంత ఇష్టమో! పెండ్లయిన ఏడేండ్లకు కడుపు పండబోతున్నది. అందుకే అపురూపంగా తన పొట్టని తాకుతూ అడిగింది.
“మీ దగ్గర దాపరికం ఎందుకుగాని నాకు మాత్రం ఎప్పుడెపుడు మీలా నా బిడ్డను ఒళ్లో పెట్టుకొని పాలిస్తానా అని ఆత్రంగా ఉందమ్మా!”.
సుబ్బులు ఆరాటం చూసి సుగాత్రి కండ్లు చెమర్చాయి. బిడ్డ కడుపున పడిన దగ్గరనుంచీ పుట్టబోయే వాడి గురించి తల్లికి ఎన్ని మధురమైన ఊహలు వస్తాయో ఆమెకు తెలియంది కాదు.
“ఊ.. ఊ.. కబుర్లు బాగానే నేర్చావుగాని త్వరగా ఇంటికెళ్లు. ఇవాళ మీ మావ డ్యూటీ దిగి వస్తాడన్నావుకదా! చిలకా, గోరింకల్లా పుట్టబోయే బాబు గురించి తెల్లవార్లూ కబుర్లు చెప్పుకోండి”.
“పోండమ్మా మీరు మరీను. ఆడికి ఈమద్దిన నాకంటె కూడా పుట్టబోయే బిడ్డమీదే పేమ ఎక్కువైపోయింది. ఎప్పుడూ బిడ్డ ఊసే! ఇదివరకైతే
‘సుబ్బులూ.. నీకోసం ఎర్రగాజులు తెచ్చానే’ అనో లేకపోతే ‘దారిలో తాటిముంజలు కొన్నానే!’ అనో చెప్పేవోడు” అంది సుబ్బులు.
ఎరుపెక్కిన సుబ్బులు చెక్కిళ్లు చూసి మనసారా నవ్వుకుంటూ..
“అన్నట్టు రేపు పొద్దుట ‘మదర్’ ఆసుపత్రిలో మళ్లీ పరీక్ష చేయించడానికి మీ మావ తీసుకెళ్తాడని అన్నావుకదా! పొద్దుటే రాకు. సాయంత్రం వచ్చి గిన్నెలు తోముదువుగానిలే” అన్నది సుగాత్రి.
“మీలాగే ఆ కోమలి డాట్టరమ్మ కూడా ఎంత మంచోరో! మాలాటి పేదోల్లకి పైసా తీసుకోరు సరికదా.. ఎల్లినపుడల్లా పండ్లు, పాలు, మందులు ఊరికే ఇత్తన్నారమ్మా!” అంటూ మూతికి కట్టుకున్న మాస్కుని సర్దుకుంటూ, ఊరగాయ గిన్నె తీసుకొని వెళ్లిపోయింది సుబ్బులు.
పొద్దుటే తయారై పెనిమిటి రాజయ్యతో కలిసి ఆసుపత్రికి వచ్చేసింది సుబ్బులు. గది బయట బెంచీ మీద కూర్చొని, డాక్టరు కోసం ఎదురు చూస్తున్నది.
“సుబ్బులూ! కూసోలేకపోతున్నవా? డాక్టరమ్మగారు రౌండ్లకెల్లారంట. పావుగంటలో వచ్చేస్తారని కాంపౌండరు చెప్పాడు” అన్నాడు రాజయ్య.. సుబ్బులు ఆపసోపాలు పడటం చూసి.
“అబ్బో! ఇదంతా నీ కొడుకు మీద పేమే!” అంటూ మోచేత్తో మొగుణ్ని పొడిచింది సుబ్బులు. ముసిముసిగా నవ్వుతూ.
“ఊరుకోయే! నీకు మాత్రం ఏం తక్కువ సేసాను?” అంటున్న రాజయ్యతో..
“ఏమో మావా! నీకు నాకంటే నాకడుపులోని నీ బిడ్డమీదే ఎక్కువ పేమ ఉన్నట్టు అనిపిత్తాంది”.. కొంటెతనం తొంగిచూసింది సుబ్బులు మాటల్లో.
“నిజం చెప్పే.. నీకు మాత్రం ఆడంటే పేమ లేదూ? రోజూ నిద్దర లేవగానే అద్దంకాడ నిలబడి ‘పొట్ట ఎంత పెరిగిందా?’ అని సూసుకుంటావు కదా! నేను గమనిత్తానే ఉన్నాలే!”.
“పో మావా! అయితే నిద్దర వంకతో నువ్వు దొంగసూపులు సూత్తన్నావన్నమాట. అయినాగానీ ఇదివరకు నేను ఎంత గోలెట్టినా ఇంటిపట్టున ఉండేవోడివా సెప్పు?”.
“నన్నేటి సెయ్యమంటావే. లారీ డ్రైవరు ఉద్యోగం. వారం రోజులు బయట తిరిగితే, రెండు రోజులు ఇంట్లో ఉంటాను. అది లేకపోతే మనకి బతుకు గడిచేదెట్టాగే సుబ్బులూ?”.
“నాకు తెలవదా ఏటి మావా? పెండ్లయిన ఏడేండ్లకు మనకీ నలుసు కడుపున పడ్డాడు. ఆడిని ఎప్పుడెప్పుడు సూద్దామా అని ఇద్దరికీ ఉంది”.
సూదిమందంటే మాచెడ్డ భయమేమో! అల్లంత దూరంనుంచి డాక్టరమ్మని గమనించగానే చేతుల్లో చెమటలు పట్టాయి సుబ్బులుకి.
డాక్టర్ కోమలి వాళ్లను చూసి మెత్తగా నవ్వింది.
“దండాలు డాట్టరమ్మా!” భయంభయంగా నమస్కారం పెట్టింది సుబ్బులు.
అప్పటికే గది లోపల ఒక ఆంగ్లో ఇండియన్ జంట డాక్టర్ కోసం వేచి చూస్తోంది.
సుబ్బులుని వాళ్లకు పరిచయం చేస్తున్నట్టు..
“షి ఈజ్ కంప్లీటింగ్ నైన్త్ మంత్!” అంటూ..
“ఏం సుబ్బులూ! చిక్కినట్టున్నావే! ప్రతినెలా పరీక్ష చేయించుకోవాలని చెప్పానా? ఈ రోజుల్లో చిన్న జ్వరాన్నీ అశ్రద్ధ చెయ్యెద్దు. రాజయ్యా.. కొన్ని పరీక్షలు రాస్తాను. చేయించి తీసుకురా. మందులు రాస్తాను. సుబ్బులూ! నీ కొడుకు పనసపండులా ఉండాలంటే, ఈ ఐరను మాత్రలు, క్యాల్షియం మాత్రలూ క్రమం తప్పకుండా వేసుకోవాలి. అర్థమయిందా?” అంటూ, ఓ చీటీని రాజయ్య చేతిలో పెట్టింది డాక్టర్ కోమలి.
“అలాగేనమ్మా!” అంటూ, భక్తిగా చీటీ పట్టుకొని వెళ్తున్న ఆ దంపతులకేసి జాలిగా చూసింది కోమలి. ఎందుకోగాని ఆమె మదిలో ఏదో అనుమానం రూపుదిద్దుకుంది. తర్వాత ఆ జంటను చూసి సంతృప్తిగా తలలూపుతున్న రాబర్టు దంపతులతో మాట్లాడి, వాళ్ల అనుమానాలు తీర్చింది.
“సుబ్బులూ! నువ్విక్కడే కూచో. నేను డాట్టరమ్మగారితో మాట్లాడి వత్తాను”.
“అదేటి మావా.. కడుపులో బిడ్డ ఉన్నది నాకయితే నువ్వూ పరీచ్చలు సేయించుకుంటున్నావ్. నాకు భయమేత్తంది”.
“నీకు పెతీదానికీ భయమేనే! మనబిడ్డ సల్లగా ఉండటం మనకు కావాలె. అంతేగాని ఊరికే దిగులు పడకు. డాట్టరమ్మ పిలిచాక వద్దువుగాని”.
“దండాలు డాట్టరమ్మా!” అంటూ, రాజయ్య తెచ్చిన రిపోర్టులను ఒకటికి రెండుసార్లు చూసింది డాక్టర్ కోమలి.
“రాజయ్యా! నీకీ మధ్య జ్వరం, దగ్గు వచ్చాయి కదూ?” రాజయ్యకేసి సూటిగా చూసింది కోమలి.
“అవును డ్యూటీమీద ఎల్లినపుడు జొరం వచ్చి తగ్గిపోయిందమ్మా! పదేనురోజులు పైనే అయింది” రాజయ్య కండ్లలో బెదురు.
“అందుకే అనుమానంతో పరీక్షలు రాశాను. మీ ఇద్దరికీ కరోనా సోకినట్టుగా రిపోర్టుల్లో ఉంది”.
ఆ మాటలు వినగానే.. రాజయ్య రెండు చేతుల్లో మొహం దాచుకొని ఏడ్చేశాడు చిన్నపిల్లాడిలా.
“అధైర్యపడకు రాజయ్యా! కరోనా వచ్చినంత మాత్రాన చచ్చిపోరు. వెంటనే ఇద్దరూ ఆసుపత్రిలో చేరి మందులు వాడితే తగ్గిపోతుంది”.
“మా దగ్గర అన్ని పైసల్లేవు తల్లీ!”.
“మదర్ ఆసుపత్రి ఇలాంటి వారికోసమే.. పైగా సుబ్బులంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. కరోనా అంటువ్యాధి అని నీకూ తెలుసుకదా!”.
“మరి మా బిడ్డకూ ఇది వచ్చేస్తుందా డాట్టరమ్మా!”.. రాజయ్య గొంతులో ఈసారి వణుకు.
“ప్రసవ సమయంలో తల్లినుంచి బిడ్డకు సోకే అవకాశముంది. పాలిచ్చే తల్లినుంచీ రావచ్చు”.
“డాట్టరమ్మా! బిడ్డకి పాలివ్వాలని మా పిచ్చి సుబ్బులు ఎన్ని కలలు కంటుందోనమ్మా! ఈ మాట వింటే సచ్చిపోతుందని భయమేత్తాందమ్మా”.. అంటూ బావురుమన్నాడు రాజయ్య.
“నీకా భయం అక్కర్లేదు. బిడ్డ ప్రాణంకోసం తల్లి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. కష్టమొచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. సరే! నువ్వు ఇంటికి వెళ్లి నెమ్మదిగా సుబ్బులుకి విషయం చెప్పి, నచ్చజెప్పి తీసుకురా. మీ పుట్టబోయే బిడ్డ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో నేను తనకు నెమ్మదిగా అర్థమయ్యేలా వివరిస్తాను”.
“దండాలు డాట్టరమ్మా!”.
“రా సుబ్బులూ!”.. ఆ పిలుపులోని ఆప్యాయతకు ఏడుపొచ్చేసింది సుబ్బులుకి.
“నా అదురుట్టం ఎలా తిరగబడిపోయిందో సూడండమ్మా! ఇన్నాల్లూ ‘లగ్గమై ఏడేండ్లు దాటినా బిడ్డలు పుట్టలేదే!’ అని పిల్లల కోసం ఎన్నో గుళ్లూ గోపురాలు తిరిగాం. నెల తప్పగానే.. నా అంత అదురుట్టవంతురాలు లేదనుకున్నా. కానీ, ఏజనమలో పాపమో.. మా ఇద్దరికీ ఈ మాయదారి జబ్బు పట్టుకుంటుందని అనుకోలేదు డాట్టరమ్మా!”.. అంటూ భోరుమన్నది.
“ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి”.
“నేను బాధపడేది నాకీ పాడు జబ్బు వచ్చిందని కాదమ్మా. నేను సచ్చిపోయినా పర్లేదు.. నా బిడ్డ మాత్రం సల్లగా ఉండాలె తల్లీ. నా బిడ్డకూ ఈ పాడు జబ్బు వత్తుందేమోనని మావకీ, నాకూ రేత్రి అంతా కునుకు లేదమ్మా!”.
“ఈ వ్యాధి నీ నుంచి నీ బిడ్డకు సోకకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసుపత్రిలోనే నీ ప్రసవమవ్వాలి సుమా! అలాగైతేనే నీ పురిటి సమయంలో మేమూ జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. నువ్వు నిశ్చింతగా ఉండు”.
“నువ్వే మా పాలిటి దేవతవమ్మా. ఎలాగైనా నాబిడ్డ బతికితే అంతేసాలు మాకు”.
“అన్నీ నేను చూసుకుంటాగా! మందులన్నీ జాగ్రత్తగా వాడితే ఈ జబ్బు నీ కొడుక్కి రాకుండా ఉంటుంది. కొన్ని సూదిమందులు కూడా”.
సుబ్బులు చేతులెత్తి మొక్కి.. “నా ఒల్లు తూట్లు పొడిచినా పరవాలేదు. నా బిడ్డని కాపాడండి”.
అంతకుముందు లేడిపిల్లలా హుషారుగా ఉండే సుబ్బులు.. సర్వం కోల్పోయినదానిలా ఉండటం చూసి గాఢంగా నిట్టూర్చింది డాక్టర్ కోమలి.
సుబ్బులు పైట.. పాలధారతో తడిసిపోతున్నది. వెంటనే తెలివొచ్చింది. కండ్లు తెరిచి కొడుకు కోసం పక్కను తడుముకుంది. బాబు కనిపించలేదు.
“సుబ్బులూ!”.. రాజయ్య గొంతులో విషాదానికి భయమేసింది సుబ్బులుకి.
“సుబ్బులూ.. ఇటు చూడు”.. డాక్టర్ కోమలి కంఠం, ఆమెను ఈ లోకంలో పడేసింది.
“ఇలాంటప్పుడే బాగా ధైర్యంగా ఉండాలి సుబ్బులూ! బాబుకి కూడా కరోనా సోకింది. ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాం!”.
ఆ మాట వింటూనే పిచ్చిపట్టినదానిలా ఒక్క ఉదుటున లేవబోయింది సుబ్బులు.
“లేవకు.. కుట్లు కదిలిపోతాయి. నీకింకా
బోలెడు వయసుంది. మళ్లీ నువ్వు తప్పకుండా తల్లివవుతావు”.. డాక్టర్ మాటలు సుబ్బులు చెవినబడటం లేదు. తన బాబు చచ్చిపోయాడా?
‘బాబూ!’ అంటూ ఆమె మాతృహృదయం తల్లడిల్లిపోయింది. రాజయ్య నోట్లో గుడ్డ కుక్కుకుని విలపిస్తున్నాడు. సుబ్బులు భుజం తట్టి వెనుదిరిగిన డాక్టర్ కోమలి.. సుగాత్రి చేతిలోని పసిబిడ్డను చూసి త్రాచుపామును చూసినట్టు చేష్టలుడిగిపోయింది.
“డాక్టర్ కోమలీ! ఈ పసివాడేనా చనిపోయాడని చెబుతున్నారు.. సుబ్బులుతో?”.
సుగాత్రి మాట విన్న సుబ్బులు.. నాగస్వరం విన్న నాగుపాములా మంచం దిగి, పరుగున సుగాత్రి చేతిలోని బిడ్డను అందుకొని గుండెలకు హత్తుకుంది. కొడుకును ముద్దులతో ముంచెత్తింది.
“సుబ్బులూ! నువ్వు ఎప్పటికప్పుడు ఈ డాక్టర్ చెప్పిన విషయాలన్నీ నాకు చెప్పడం ఎంతో మంచిదైంది. నీకు, రాజయ్యకూ కరోనా అని చెప్పగానే నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే, కరోనా పరీక్షలకు అనుమతించిన ఆసుపత్రులలో మదర్ ఆసుపత్రి లేదని నాకు తెలుసు. ఎక్కడో ఏదో గూడుపుఠాణీ జరుగుతోందని పోలీస్ ఆఫీసర్ అయిన మావారికి చెప్పాను. ఏడాది క్రితమే ఈ ఊళ్లో వెలసిన మదర్ ఆసుపత్రి మీద అప్పటికే అనుమానాలైతే వచ్చాయిగాని, ఇంతవరకూ ఆధారాలు దొరకలేదని చెప్పి.. నీద్వారా ప్రయోగం చేశారు పోలీసులు”.
సుగాత్రి వెనుకే ఆంగ్లో ఇండియన్ దంపతులను వెంట బెట్టుకొని పోలీసులు రావడంతో డాక్టర్ కోమలి కంగుతిన్నది.
“ఉచితం పేరుతో మీలాంటి అమాయకులు, నిరక్షరాస్యులైన పాతికమంది దంపతులను ఆకర్షించి, ఏదో సాకుతో ప్రసవం వేళకు మదర్ ఆసుపత్రిలో చేరుస్తున్నది కోమలి. తల్లిదండ్రులకు బిడ్డలు చనిపోయారని చెబుతూ, సంతానం కోసం అర్రులు చాచే దంపతుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేసి, మీ బిడ్డలను వాళ్లకు అమ్మేస్తున్నారు. ఇదంతా ఓ పెద్ద ముఠా.. ఇదిగో నీ బిడ్డను బేరం పెట్టింది వీళ్లకే”.
సుబ్బులు, రాజయ్య నోళ్లు తెరిచేశారు.
‘డాట్టరమ్మ ఎంత ప్రేమ కురిపించి తమని బుట్టలో పడేసింది?’ అనుకొన్నారు.
సుబ్బులు కండ్లు ఎర్రబడ్డాయి. రాజయ్య గుప్పిళ్లు బిగుసుకున్నాయి. కానీ, అప్పటికే ఆసుపత్రి రికార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు డాక్టర్ కోమలి చేతికి బేడీలు వేశారు.
బాబును గట్టిగా గుండెలకు హత్తుకున్న సుబ్బులు ఒంట్లోకి ధైర్యాన్ని ప్రవహింపజేసేలా ఆమె భుజం తట్టింది సుగాత్రి. బిడ్డ కడుపున పడ్డప్పటినుంచి.. తన గుండెల్లోని రక్తాన్ని పాలుగా మార్చి, ఆ అమృతధారను వా డి నోటికి ఎప్పుడెప్పుడు అందిద్దామా అని సుబ్బు లు ఎంతగా తపస్సు చేసిందో సుగాత్రికి తెలుసు.
“ఏ తల్లికైనా బిడ్డకు స్తన్యమిస్తేనే జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుందనే విషయం బిడ్డ తల్లిని నాకంటె ఎవరికి తెలుసు? ఎక్కువ చదువుకోకపోయినా తల్లి అనే మాటకే శాశ్వతమైన అర్థాన్నిచ్చావు సుబ్బులూ! నువ్వు ఇక ఏవిధమైన దిగులూ పెట్టుకోకుండా నీకొడుకును గుండెల్లో పెట్టుకుని..” అంటున్న సుగాత్రి మాటలకు అడ్డువస్తూ..
“కానీ నాకు కరోనా..?” అన్నది సుబ్బులు.
“నీకే కాదు, రాజయ్యకూ కరోనా లేదు. అదంతా మీరిద్దరూ తనపట్టులో ఉండేందుకు, మీ నుంచి బిడ్డను దూరం చేసేందుకు డాక్టర్ కోమలి కల్పించిన మాయరోగం”.
“పేణం పోసేవోల్లు డాట్టర్లుగానీ తీసేవోల్లు డాట్టరేంటమ్మా? మీ పున్నెమా అని మాబాబు మాకు దక్కాడు. ఆవిడది తల్లి మనసు అయితే మా బాధ ఆవిడకు తెలిసేది”.
సుబ్బులు మాటలకు భారంగా నిట్టూర్చింది సుగాత్రి. అవును నిజమే.
‘మాతృమూర్తి అంటే.. అనంతమైన ప్రేమ, బాధల బరువు, విషాదం, నిరాశ, నిస్పృహ, త్యాగం అన్నీ కలగలిసిన రూపం’. సుగాత్రికి సోదరి నివేదిత చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి.
‘నా అదురుట్టం ఎలా తిరగబడిపోయిందో సూడండమ్మా! ఇన్నాల్లూ ‘లగ్గమై ఏడేండ్లు దాటినా బిడ్డలు పుట్టలేదే!’ అని పిల్లల కోసం ఎన్నో గుళ్లూ గోపురాలు తిరిగాం. నెల తప్పగానే.. నా అంత అదురుట్టవంతురాలు లేదనుకున్నా. కానీ, ఏజనమలో పాపమో..
మా ఇద్దరికీ ఈ మాయదారి జబ్బు పట్టుకుంటుందని అనుకోలేదు
డాట్టరమ్మా!”..
పి.వి. శేషారత్నం స్వస్థలం రాజమండ్రి. తెలుగు సాహిత్యంలో ఎంఏ, జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశారు. 1971 నుంచి ఆకాశవాణి హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాల్లో వ్యాఖ్యాతగా పనిచేశారు. 1981 నుంచి కథా రచన చేస్తున్నారు. వందల సంఖ్యలో కథలు రాశారు. ఈమె రాసిన ఎన్నో నాటకాలు, రూపకాలు, ధారావాహికలు, కథలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. 350కిపైగా కథలు వివిధ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు 10 కథా సంకలనాలు, 13 నవలలు వెలువరించారు. ‘భర్తృహరి – ఏనుగు లక్ష్మణ కవి’ శ్రవ్య నాటకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారం దక్కించుకొన్నారు. ‘జీవని’, ‘గంగజాతర’ నాటకీకరణలకు న్యూఢిల్లీ – ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో నుంచి ప్రథమ బహుమతులు అందాయి. ‘మాయ సోకని పల్లె’ కథకు ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ నుంచి ప్రథమ బహుమతి, ‘పలకా బలపం’ నాటకానికి ‘న్యూఢిల్లీ ఎన్.సి.ఇ.ఆర్.టి.’ నుంచి ప్రథమ బహుమతి అందుకొన్నారు. వివిధ కథల పోటీల్లో 60కిపైగా బహుమతులు దక్కాయి.
–పి.వి. శేషారత్నం, 94929 25291