చారిత్రక కాల్పనిక నవలజరిగిన కథ
జాయపుని దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది నారాంబ. తండ్రి కూడా వచ్చి బావగారితో చర్చించి వెళ్లినట్లు చెప్పింది. దాంతో ఆలోచనలో పడ్డాడు జాయపుడు. తన భవిష్యత్తును నిర్ణయించుకోవాలని అనుకున్నాడు. కోట దాటి తన మిత్రులను కలుసుకున్నాడు. చిన్ననాటి ముచ్చట్లు పంచుకున్నాడు. ఆ తర్వాత సుబుద్ధిని కలిశాడు. జాయపుణ్ని హత్తుకుని.. సుబుద్ధి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరో రోజు నీలాంబ దగ్గరికి వెళ్లాడు. మరునాడు అయన్నవోలు గ్రామం దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు.ఊరి పొలిమేర దగ్గరే కనిపించింది కాకతి.
కాకతి గొంతులో చిరుకోపం. నిలదీస్తున్నట్లుంది ఆ గొంతు. చెప్పేవరకూ మరి మాట లేకుండా చూస్తున్నది.. అదేచూపు!
“అదే.. ఇదే.. ఇదే!”.. గ్రామ ప్రవేశంలోనే ఆమె ఎదురయ్యేసరికి తడబడ్డాడు జాయప.
“ఏంది.. ఇదే ఇదే..?!” వెక్కిరింతగా అన్నది.
హాస్యస్ఫూర్తి ఏమాత్రం లేదు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన పిల్లవాణ్ని అయ్యవారు ప్రశ్నించినట్లు.
“ఇప్పుడే వస్తున్నాను. పెద్దమ్మ, భైరవ కోసం. వాళ్లు ఎక్కడ?”.
“ఊరి బాయికాడ మీ పెద్దమ్మ, అన్న ఉంటరా?”.
గొంతులో ఎలాంటి మార్పు రావడంలేదు. అప్పటికే కొందరు పిల్లలు ఆమె పక్కకు వచ్చి.. గుర్రాన్ని, జాయపుణ్ని వింతగా చూస్తున్నారు. ఆమె మాటలకు వాళ్లంతా ఫక్కున నవ్వారు. అది విని బావివద్ద ఉన్న మహిళలు తలతిప్పి చూశారు.
ఓ పెద్దామె అన్నది..
“ఎవరో అధికారి లాగా ఉండాడు. ఎవరింటికో అడిగి బాట చెప్పు. వీధిలో నిలబెట్టి ఏందా ముచ్చట్లు!?”.
“మా బావ కోసం అచ్చిండంట పిన్నాం..” అన్నది గట్టిగా, ఆమెకు వినిపించేలా.
చూపుమాత్రం జాయపుని పైనే.
“బావ కోసం అయితే.. ఈన మనకూ బావేగా అక్కా..” అన్నదో బోసిమొల పిల్ల.
అప్పుడు కొంచెం నవ్వింది కాకతి.. చిన్నగా.
“మూడేళ్ల పదిమాసాల ఇరవై రోజులు.. నువ్వు చెప్పకుండా ఎల్లి, మళ్లీ ఇయ్యాల అచ్చినవ్! పో..” అన్నది
విసురుగా.. నాటకీయంగా.
గుర్రం కళ్లెం వదిలింది. వేగంగా వెనుదిరిగింది.
తడిసిన లంగా వోణి.. తడిపొడి సౌందర్యం.. శృంగార నైషధం!!
గుండెలో ఎక్కడో హాల చక్రవర్తి తారాడుతున్నాడు.
రుక్కమ ఇంటివద్ద ఆగాడు.
“నేనూ, అమ్మ, కాకతి.. ఎప్పుడూ నిన్ను తలచుకుంటూనే ఉన్నాం. ప్రతి నాట్య ప్రదర్శన రోజునా నువ్వు గుర్తొస్తావ్..” అన్నాడు భైరవ.
అక్కల వివాహానికి వీళ్లకు ఆహ్వానం పంపాడు. కానీ దూరాభారం వల్ల రాలేదు. రుక్కమ బుగ్గలు పుణికి ముద్దులు పెట్టుకుంది.
“నిజంగానే యువరాజువయ్యా నువ్వు..” అన్నది.
బట్టలు మార్చుకుని చెంగుచెంగున రుక్కమ ఇంటికి వచ్చింది కాకతి.
“చక్రవర్తితో నీ అక్కలకు మనువు చేశావంటే.. అమ్మయ్యో! నువ్వు చిన్నోనివి కాదు” అన్నది కాకతి.
మూడేళ్ల తర్వాత చూస్తున్న కాకతి.. పరిపూర్ణ యవ్వనవతిగా, మరింత నిండుగా కనిపిస్తున్నది.
ఆరోజు సంధ్యవేళ దేవాలయం వద్ద నాట్య ప్రదర్శన జరిగింది.
అది కాకతి నృత్య ప్రదర్శన. ఆమె లాస్య ప్రధానంగా అభినయించిన నృత్యం.
అది చూసి అవాక్కయ్యాడు జాయపుడు. అసలు ఆమెకు ఏకవ్యక్తి నృత్యం గురించి తెలుసని జాయపకు తెలియదు. ఆమె కేవలం కొండయ బృందంలో ఒక నటిగా.. పౌరాణిక అంశాల ఆధారంగా రూపొందించిన నాటకాలలో స్త్రీ పాత్రలను కొండయ చెప్పినట్లుగా నటిస్తుంది. కానీ, నాట్యం బాగా తెలిసిన, గురుముఖతః శిక్షణ పొందిన నాట్యాంగనలు మాత్రమే చేసే నృత్యధోరణిని ఆమె ప్రదర్శించడం చూసి.. జాయపుడు
విభ్రమకు లోనయ్యాడు.
రుక్కమ చెప్పింది..
“కాకతి అనుమకొండలో గురుకులంలో నేర్సింది జాయపా!” అని.
జాయపుడు కళ్లు విప్పార్చి చూడగా.. సిగ్గుగా అరనవ్వు నవ్వింది కాకతి.
అతనికి చటుక్కున వారు ఆఖరుసారి కలిసినప్పటి మాటలు గుర్తొచ్చాయి.
‘నువ్వు గురుకులంలో నాట్యం అభ్యసించు కాకతి..’ అన్నాడు అప్పుడు.
‘ఎందుకు?’ అంటే..
‘నాకు దగ్గరగా ఉంటావ్..’ అనడం గుర్తొచ్చింది.
ఆమె గురుకులంలో చేరిందన్నమాట. నాట్యం గురుముఖతః నేర్చుకున్నదన్నమాట.
తను మాటిచ్చినట్లు ఆమెకు దగ్గరగా ఉండలేదు.
“అనుమకొండలో తెలిసిన బంధువుల ఇంట్లో ఉండి నాట్యం నేర్చుకుంది..” వివరించింది రుక్కమ.
ఆమె తనపై మానసికంగా గెలిచింది. తను ఆమె ముందు వామనుడయ్యాడు. చిన్న ఓటమి భావనతో ముడుచుకుపోయాడు జాయపుడు.
నిద్రాహారాలు లేక రేయింబవళ్లూ ఎవరితోనో పోరాడుతున్నట్లు.. వివరించలేని.. తనకే అర్థంకాని యుద్ధ
భావనలతో పెనుగులాడుతున్నట్లుండే కాలాన.. కాకతిని కలిశాక ప్రపంచమంతా ఆహ్లాదంగా ఉన్నట్లుండేది జాయపునికి ఇంతవరకు. ఇప్పుడు కూడా ఆ అత్మీయ వసంతమేదో మళ్లీ వచ్చినట్లు.. చెట్టూ – చేమా, కొమ్మా – రెమ్మా, కుందేలూ – పాలపిట్ట.. అన్నీ అంతా తన ఆహ్లాదంకోసమే సృష్టించినట్లుంది.
ఎందుకు ఈ ప్రపంచం తనకు ఇంత ఆత్మీయమై పోయింది హఠాత్తుగా..?
అదేదో ఇక్కడే ఉండి తేల్చుకోవాలి.
ఇక్కడ ప్రత్యేకంగా పనేమీ లేదు. ఊరకనే ఇక్కడ ఉండలేడు. ఉంటే ఆమె కోసమేనని భైరవ, రుక్కమ అనుమానించే అవకాశం ఉంది. అలా అని వెళ్లలేడు.
ఆమె తన మాటలకు విలువనిచ్చి, చెప్పింది నిర్వహించి తనపై పైచేయి సాధించింది. ఇక్కడే.. మరి కొంతకాలం ఆమె సాన్నిహిత్యంలో ఉండాలి. ఎలా?
అనుకోకుండా ఓ సంఘటన జాయపునికి కలిసి వచ్చింది. గ్రామంలో దేవాలయ దానాల అంశంలో ఓ సమస్య వచ్చింది. దాని పరిష్కారం కోసం రాజధాని నుంచి వచ్చిన రాజాధికారి శ్రీ వాకిలి మలప నాయకుడు గ్రామంలో పల్లకీలో పోతూ.. జాయపుణ్ని గుర్తించి ఆగాడు.
“జాయప సేనానీ.. మీరు ఇక్కడ ఉన్నారేమిటి?” అని అడిగాడు.
“శ్రీ వాకిలి న్యాయాధీశులకు నమస్సులు. నేను నాట్య ప్రదర్శనల నిమిత్తం ఇక్కడికి వచ్చాను. తమరు వచ్చిన అధికారిక అంశం ఏవిటో తెలుసుకోవచ్చునా?” అన్నాడు గౌరవంగా.
“ఈ గ్రామంలో వర్తకులు తమ సుంకంలో కొంతభాగం దేవాలయానికి చెల్లించడానికి మొక్కుకున్నారు. అమ్మకాల వద్ద ఆ సుంక భాగాన్ని వసూలుచేసి వేరుగా ఉంచారు. అది దేవాలయ ఖర్చులకోసం మండలీ శ్వరుని బొక్కసానికి చెల్లిస్తామని వారి వర్తక సమయం వారు అంటున్నారు. కాదు.. ఊరి సమయానికి చెల్లించాలని గ్రామ సమయశెట్టి అంటున్నారు. ఇది మా
దృష్టికి తెచ్చారు మహాజనులు. దీనిని పరిష్కరించాల్సిన భారం నాపైపడింది” అని వివరించాడు.
‘అలాగా!?..’ అన్నట్లు తల పంకించాడు
జాయపుడు.
“తమరు ఇక్కడ మరికొంతకాలం ఉంటారా? ఉంటే దయచేసి ఈ సమస్యకు పరిష్కారం కొరకు కొంత కృషి చేస్తే మాకు కొంత వెసులుబాటు అవుతుంది కదా.. ఏమంటారు?” అన్నాడాయన.
ఎగిరి గంతేశాడు జాయపుడు.
“అలాగా! అలాగలాగే! నేను నాట్య ప్రదర్శనల నిమిత్తం మరొక పక్షంరోజులు ఇక్కడ ఉండక తప్పదు. ఈకాలంలో మీకు సహాయపడగలిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది. తప్పకుండా!”.
గ్రామరట్ట, మహాజనుల సభ్యులు, సమయ శెట్టి, ఇతర వృత్తిసమయ నాయకులు తదితరులను గ్రామ
చావిడి వద్దకు పిలిపించి, అందరికీ జాయపుణ్ని సేనానిగా పరిచయం చేశాడు మలపనాయకుడు.
“మీఊరి సమస్యను వెలనాడు రాజ్య సామంత ప్రభువు శ్రీశ్రీశ్రీ పినచోడ మహారాజుగారి ప్రియ
పుత్రులు, మన చక్రవర్తుల బావమరిదిగారు అయిన
శ్రీ జాయప సేనానివారి సమక్షంలో సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా గ్రామజనులకు నా విజ్ఞప్తి”..
ఆయన విజ్ఞప్తిని అందరూ అంగీకరించారు. ఆయనకు రుక్కమ ఇంటివద్ద పూర్తి భోజన అతిథిమర్యాదలు చేసి.. వచ్చినదారినే సాగనంపాడు జాయపుడు.
వీరగల్లు పూజల్లో రుక్కమ, చుట్టుపక్కల గ్రామాలలో శైవభజనల్లో భైరవ నిమగ్నులు కాగా.. ఊరి
సమస్యపై మూడవజాములో చర్చిస్తూ సూర్యుడు ఉదయించే వేళ, చల్లబడేవేళ కాకతి కనుసన్నలలో తిరగ
సాగాడు జాయపుడు.
జాయపుడు యువరాజు అని, సేనాని హోదా కలిగిన గొప్ప యోధుడని అనుమకొండలో ఇప్పుడిప్పుడే సాధారణ జనులు గుర్తించి అభిమానిస్తున్నారు. అయ్యనవోలులాంటి గ్రామంలో ఎవరికీ పెద్దగా తెలియదు. భైరవతోపాటు కొండయ బృందంలో నాట్యం
చేస్తాడట.. అందుకు ఇక్కడికి వచ్చాడట.
“ఎంత చక్కగా ఉన్నాడు?!!”.. అది ఆ గ్రామీణుల అభిప్రాయం జాయపునిపై.
కాకతి తండ్రి వెన్నియకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురికి పెళ్లిళ్లు చేశాడు. తండ్రికి పనిపాటల్లో సహాయపడేది కాకతి ఒక్కతే. అందుకే ఇష్టం లేకపోయినా ఆమె అభీష్టం మేరకు నాట్య ప్రదర్శనలకు వెళ్లనిస్తాడు.
ఉదయాన్నే తండ్రితో పొలం వెళ్లిన కాకతి.. చెరుకు
పొలంలో పాయలు తీసి నీళ్లు పెడుతున్నది. ఆవలగా గట్టుపై జాయపుడు..
మధ్యాహ్నం రాట్నం పట్టి నీళ్లు తోడుతున్నది. ఎక్కడో జొన్నచేను గట్టుపై నుంచి ఆమెకు కనిపించేటంత దూరంగా జాయపుడు..
పగలల్లా ఒకరుకొకరు కనిపించేలా తిరుగుతారు. నిలబడతారు. కూర్చుంటారు. దూర దూరంగా..
పలకరించుకోకుండా.
ఇంటికి వెళుతున్నప్పుడు ఒకరు ముందు..
తగినంత దగ్గరలో మరొకరు!
ఒకరి చూపు మరొకరికి ఆహారం. ఒకరి నవ్వు
మరొకరికి ఆయుష్షు. ఒకరి నడక మరొకరికి హాస్యం.
ఆ ఒండొరుల సన్నిహిత హేల ఇద్దరికీ
మధురాతిమధురం!
సంధ్యవేళ ఇద్దరూ కలిసేది, మాట్లాడుకునేది, కబుర్లు కలబోసుకునేది దేవాలయ ప్రాంగణంలో.. భక్తుల సందోహాల మధ్య.
వారిద్దరిదీ ఓ సంబంధం.. దేవుడు – భక్తుడు. ఆకాశం – మేఘం. తీగ – వృక్షంలా.
ఒకరు నవ్వేది మరొకరికి తెలుసు. ఒకరి చూపులోని భాష మరొకరికి అక్షరమక్షరం అవగతం!
ఆమె ఎర్రపూల పట్టుపరికిణి కట్టింది. అతను ముఖం రోతగా పెట్టాడు. ఆమె మార్చుకుని బంతిపూల పసుపురంగు పరికిణితో వచ్చింది. అతని ముఖం విప్పారింది. ఆమె ఆవుదూడలా గంతులేసింది. అతను నటరాజులా నాట్యం చేశాడు.
అతను దేవాలయ కక్ష్యాసనంపై కూర్చున్నాడు. ఆమె దేవుని ముందు గంట కొట్టింది. ఇద్దరూ ప్రదక్షిణ
పథంలో నడుస్తున్నారు.
“తలలో బంతిపువ్వు బాలేదు.. ఎంచక్కా చిన్న ముద్దమందారం ముడువవచ్చు కదా..” అన్నాడు.
“నా తల.. నా జుట్టు.. నా ఇష్టం! మధ్యలో నువ్వెవ్వడివి..” అన్నదామె అల్లరిగా.
“చూసేది నేనే కదా..” అన్నాడు కొంటెగా
తగ్గుస్వరంతో. ఆమె గలగలా పువ్వులు జడుసుకునేటట్లు నవ్వి.. సిగ్గుగా వెనుదిరిగి పరుగుపెట్టింది. అతను అంతే వేగంగా ముందుకు పరుగుపెట్టాడు. ప్రదక్షిణ పథం కావడంతో దేవాలయం వెనుక భాగాన మళ్లా తటస్థపడ్డారు. మళ్లా జోరున నవ్వులు.
“అసలు ఆడపిల్లలా నువ్వు అంత అందంగా ఎలా పుట్టావ్?” అన్నది ఆమె సందేహం.
దిగులుగా ముఖం పెట్టాడు జాయప. అతని జవాబు కోసం ఆమె అతని కళ్లలోకి చూస్తున్నది.
(సశేషం)
ఒకరు నవ్వేది మరొకరికి తెలుసు.
ఒకరి చూపులోని భాష మరొకరికి అక్షరమక్షరం అవగతం!
ఆమె ఎర్రపూల పట్టుపరికిణి కట్టింది. అతను ముఖం రోతగా పెట్టాడు.
ఆమె మార్చుకుని బంతిపూల పసుపురంగు పరికిణితో వచ్చింది.
అతని ముఖం విప్పారింది. ఆమె ఆవుదూడలా గంతులేసింది. అతను నటరాజులా నాట్యం చేశాడు.