‘ఏ మాయ చేశావే’తో సినీ ప్రేమికుల మనసులు కొల్లగొట్టిన మలబారు బ్యూటీ సమంత.. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సినిమాలతోపాటు వెబ్సిరీస్లతోనూ నట విశ్వరూపాన్ని ప్రదర్శించి పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంది. ఇటీవల రెండో ఇన్నింగ్ను ప్రారంభించిన సామ్.. ‘మా ఇంటి బంగారం’ అంటూ సందడి చేస్తుంది. ఈ సందర్భంగా నటిగా, నిర్మాతగా రాణిస్తున్న సామ్ పంచుకున్న కార్వాన్ కబుర్లు…
కష్టపడి పనిచేసినవారికి విలువనిచ్చే కుటుంబం మాది. నేను సినిమాల్లోకి రాకముందు చదువుకుంటూనే పార్ట్టైమ్గా మాడలింగ్ చేసేదాన్ని. అదృష్టం కంటే కష్టాన్నే ఎక్కువగా నమ్ముతాను. ఆ నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కెరీర్ ఆరంభంలో గౌతమ్ మేనన్ను చూద్దామని సినిమా ఆడిషన్కు వెళ్లిన నేను అలా ‘ఏం మాయ చేశావే’ సినిమాలో అవకాశం కొట్టేశాను.
ప్రశంసలు నన్ను కదిలించలేవు. అలాగే విమర్శలు సైతం పెద్దగా ప్రభావితం చేయవు. కానీ నా ఇంటివరకు నెగెటివిటీ తీసుకొస్తే మాత్రం బ్లాక్ చేస్తాను. నా స్పేస్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ఇష్టం. ఎక్కువ బాధ లేదా ఒత్తిడికి గురైనప్పుడు ధ్యానం చేస్తాను.
విడాకుల తర్వాత కొన్ని నెలలకు మయోసైటిస్ రావడం వల్ల చాలా బాధపడ్డాను. దానినుంచి కోలుకోగానే మా నాన్న
మరణించారు. నా జీవితంలో కోలుకోలేని దెబ్బ అది.
మహిళలుగా మనం ఇతరుల కోసం మన షెడ్యూళ్లను, అభిప్రాయాలను మార్చుకోవడమే కాకుండా, మన లక్ష్యాలను కూడా త్యాగం చేస్తున్నాం. విచారకరమైన విషయం ఏమిటంటే ఇదొక త్యాగం అని కూడా గుర్తించలేనంతగా దీనికి అలవాటు
పడిపోయాం. పురుషులకంటే పదిరెట్లు ఎక్కువగా క్షమాపణలు మనమే చెబుతాం. సారీ చెప్పే ధోరణి వీడాలి.
మొదట్లో గ్లామరస్ పాత్రలు వేశాను. అయితే, ఆ పాత్రల్లో సౌకర్యంగా ఫీలవ్వలేదు. ఇతర హీరోయిన్లలా కనిపించడానికి వాళ్లలా డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో నన్ను ఎవరూ గైడ్ చేయలేదు. ప్రతి తప్పూ నాకో కొత్త పాఠం నేర్పింది. కాలం ఎలా గడిచిందో తెలియదు కానీ, వాటిలో మధుర జ్ఞాపకాలు, సవాళ్లు ఉన్నాయి.
‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ వెబ్సిరీస్లలో నటిస్తున్న సమయంలోనే రాజ్ నిడిమోర్తో పరిచయం ఏర్పడింది. తను అర్థం చేసుకునే స్వభావం కలవాడు. అందుకే ఇద్దరం వివాహ బంధంలోకి అడుగుపెట్టాం. ఆలోచనలు, భావోద్వేగాలకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్ఠమైన ప్రక్రియ ‘భూత శుద్ధి వివాహం’. ఈ పద్ధతిలోనే మా పెళ్లి వేడుక జరిగింది.