sadhguru jaggi vasudev | చాలా సమాజాలలో మరణం ఓ నిషిద్ధ వాక్యం. మాట్లాడుకోరు. చర్చించుకోలేరు. ఏకాభిప్రాయానికి రాలేరు. దీంతో జీవితంలోని ఏదో ఒక దశలో హుందాగా, నిశ్శబ్దంగా ముగిసిపోవాల్సిన ఓ ఘట్టం- ఏడుపులూ పెడబొబ్బలతో, శాపనార్థాలతో, సానుభూతి వాక్యాలతో బరువుగా పూర్తవుతుంది. ఆ భయాలను తొలగిస్తూ, ఆ భ్రమలను బద్దలుకొడుతూ సద్గురు జగ్గీ వాసుదేవ్ మనకు అందిస్తున్న పుస్తకం ‘మరణం- మరణ మర్మాన్ని ఛేదించండి’. చావును ప్రేమించేవారు, ద్వేషించేవారు- చావును తప్పించుకోలేని వారంతా చదవాల్సిన రచన ఇది. ఆ పుస్తకంలోని ముఖ్యాంశాలు..
మరణం నీడలాంటిది. మనల్ని వెన్నంటే ఉంటుంది. మనం మాత్రం జరామరణాలకు అతీతులమైనట్టు భావిస్తాం. దీనికి సంబంధించి మహాభారతంలో ఓ కథ ఉంది. పాండు కుమారులు ఐదుగురూ ఓసారి అడవి మార్గంలో వెళ్తారు. కారడవిలో తప్పిపోయారు. నీటి కోసం, ఆహారం కోసం కొండలూగుట్టలూ గాలించారు. అంతలో ఒక సరస్సు కనబడింది. అందులో నీళ్లు తాగబోతుండగా ఒక యక్షుడు కొంగ రూపంలో ముందుకొచ్చాడు. ముందు తను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలనీ, ఆ తరువాతే నీళ్లు తాగాలనీ షరతు పెట్టాడు. ‘మహావీరులమైన మేం ఓ పక్షికి భయపడటమా?’ అన్న అహంకారంతో కొంగ మాటలను పట్టించుకోకుండా.. కుంతీపుత్రులు ఒకరి తరవాత ఒకరు సరస్సులో నీళ్లు తాగబోయి ప్రాణాలు కోల్పోయారు. చివరికి యుధిష్ఠిరుడు మాత్రమే మిగులుతాడు. ఆయన వినయపరుడు, ధర్మచిత్తుడు. కాబట్టే దప్పిక అణచుకొని యక్షుడితో సంవాదం ప్రారంభిస్తాడు. యక్షుడు ప్రశ్నల పరంపర కురిపిస్తాడు. వాటిలో ఒక ప్రశ్న.. ‘జీవితంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి?’. క్షణం కూడా తడుముకోకుండా ‘ప్రతిక్షణమూ వందలూ వేలసంఖ్యలో ప్రాణులు మరణిస్తూ ఉంటాయి. కానీ, మూర్ఖుడైన మనిషి మాత్రం తనకు చావు లేదనుకుంటాడు. రాబోయే మరణానికి సన్నాహాలు చేసుకోడు. ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఇదే!’ అని జవాబిస్తాడు ధర్మజుడు. ఆ సమాధానానికి యక్షుడు సంతృప్తి చెందుతాడు. సరస్సులో నీళ్లు తాగేందుకు అనుమతి ఇవ్వడమేకాదు, చనిపోయిన ఆయన తమ్ముళ్లనూ బతికిస్తాడు. ఈ కథ అయిదువేల సంవత్సరాల నాటిది. నేటికి కూడా మరణంపట్ల మనిషి వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. మరణం అనేది చాలా మౌలికమైన విషయం. మృత్యువు మనకు అత్యంత సన్నిహితమైనది. ప్రతి క్షణం, మనలో వేలకొద్దీ జీవకణాలు మరణిస్తూనే ఉంటాయి. అందుకే శరీరాన్ని పరీక్షించగానే వైద్యుడు రోగి వయసు చెప్పేస్తాడు. అంటే, మరణానికి ఎంత దగ్గరగా ఉన్నదీ గుర్తుచేస్తాడు.
* * *
మీకు పెండ్లి జరుగుతుందా, లేదా? – చెప్పలేం.
మీకు ఉద్యోగం వస్తుందా రాదా? – చెప్పలేం.
కానీ, ఏదో ఒకరోజు మీరు మరణిస్తారని మాత్రం చెప్పగలం. మీ చివరి మజిలీ శ్మశానమే అని తేల్చేయగలం. ఇంతటి స్పష్టత మరే విషయంలోనూ కనిపించదు. మనిషి తత్వమే అంత. మరణం విషయానికి వచ్చేసరికి ఓ రకమైన తటస్థ ధోరణిని అవలంబిస్తాడు. ఎదురింటి వ్యక్తి మరణిస్తాడు, పక్కింటి వ్యక్తి మరణిస్తాడు. మనింట్లోనూ ఎవరో ఒకరు మరణిస్తారు. మనం మాత్రం ఆచంద్రార్కం బతికే ఉంటామన్న భ్రమలో బతికేస్తాం. ఈ ప్రపంచంలో నిన్నటి దాకా సజీవంగా ఉన్నవాళ్లలో దాదాపు లక్షా అరవై వేలమంది ఈ రోజు లేరు! ఈ భూమి మీద ప్రతి సెకను కాలానికి ఇద్దరు మరణిస్తుంటారు. మీకూ నాకూ కూడా అదే జరుగుతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి పెద్దపెద్ద పరిశోధనలు అక్కరలేదు. అపారమైన తెలివితేటలతోనూ పన్లేదు.
* * *
శ్వాసక్రియను కొంత ధ్యాస పెట్టి జరుపగలిగితే చాలు. ప్రతి ఉచ్ఛ్వాసంలోను జీవం ఉన్నదనీ, ప్రతి నిశ్వాసంలోనూ మరణం ఉన్నదనీ అర్థమైపోతుంది. పుట్టగానే శిశువు చేసే పని ఉచ్ఛాసం- శ్వాస తీసుకోవడం. జీవితంలో మీరు చేసే చిట్టచివరి పని నిశ్వాసం- ఊపిరి వదిలేయడం. మీరిప్పుడు ఊపిరి వదులుతారు. ఆ వెంటనే శ్వాస తీసుకొని గాలి పీల్చకపోతే, మీరు మరణించినట్టే. ఇంకా అర్థం కాలేదా? అయితే, ఒక్కసారి నిశ్వసించి గాలి వదిలేయండి. తరవాత ముక్కు గట్టిగా మూసి, గాలి పీల్చుకోవడం మానేయండి. కొద్ది క్షణాలలో మీ శరీరంలోని ప్రతి కణమూ ‘నన్ను బతికించు. నన్ను బతికించు’ అని ఆర్తనాదాలు చేస్తుంది. బతుకు, చావు అనేవి నిరంతరం సాగుతూనే ఉంటాయి. ఒకే శ్వాసలో చావు బతుకులు రెండూ అవిభాజ్యంగా ఉంటాయి. అయితే, ప్రాణశక్తి మీద నియంత్రణ సాధించగలిగితే, మనిషి శ్వాసించకుండా కూడా కొంత సమయం జీవించి ఉండగలడు. అదీ తాత్కాలికమే. అసలు మరణం అనేది మనలో, మనం పుట్టడానికి ముందునుంచే సంభవిస్తూ వస్తుంది. సుదీర్ఘమైన జీవితంలో చిట్టచివరి ఘటన.. మరణం. దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి వైద్యశాస్త్ర పరిశోధనల కారణంగా ఆయుః ప్రమాణాలు మెరుగవుతూ వస్తున్నాయి. మరణ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నాలూ, వీలైతే అధిగమించే మార్గాలూ అన్వేషిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆ దిశగా ఏ మేరకు విజయం సాధిస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది.
* * *
చాలా మంది మరణం ఒక బాధాకరమైన అనుభవమని అనుకుంటారు. అది సరికాదు. జీవితాన్ని అసలు అనుభవించకుండానే జీవితమంతా గడిపేయడాన్ని మించిన దుఃఖం లేదు. కాబట్టి, చావబోతున్నందుకు కన్నీళ్లు పెట్టుకోకండి. ఇన్నాళ్లూ మీదైన జీవితాన్ని జీవించనందుకు బాధపడండి. మరణంలో విషాదం లేదు, పరిష్కారం ఉంది. మీరు జీవితకాలంలో ఎదుర్కొన్న రకరకాల సమస్యలకు అదో తిరుగులేని ముగింపు. కానీ మీరు సజీవంగానే ఉండి కూడా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నారంటే.. అది నిజంగా విషాదకరమే. ష‘జననం సుఖదం; మరణం కరుణమ్!’ అని సంస్కృత సూక్తి. జననం అంటే జన్మ.. జీవితం. అది సుఖప్రదమైన అనుభవం. ఇది వాస్తవం. శరీరాన్నీ, బుద్ధినీ ఎలా వినియోగించుకోవాలో తెలుసుకొంటే మీ జీవితానుభవం సుఖమయంగా, సౌఖ్యప్రదంగా ఉంటుంది. కానీ, మరణం మాత్రం ‘కరుణం’, అంటే దయను చూపేది. మరణం మీకు ఊరటనిస్తుంది కాబట్టే అది ‘కరుణం’. మనం కనుక మృత్యుంజయులం అయిపోతే.. ఆ అనుభవం చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత గొప్ప బతుకైనా సమయానికి మరణం ప్రాప్తిస్తేనే మీరు అదృష్టవంతులు. మృత్యువు తలుపు తట్టడంలో ఆలస్యమైతే అంతకుమించిన నరకం ఉండదు.
* * *
ఎవరో భయపెడుతున్నందుకు, ఇంకెవరో బాధపెడుతున్నందుకు ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ఉత్తరం రాసిపెట్టి ప్రాణాలు తీసుకుంటారు. కానీ, జరిగేది వేరు. తమ ఆలోచనలతో, తమ ఉద్వేగాలతో తమను తామే హింసించుకుంటారు మరణ కాంక్షాపరులు. మనుగడ తాలూకు మౌలిక స్వరూపం గురించి కానీ, జీవన తత్వం గురించి కానీ తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా చావుకు సిద్ధపడటం దురదృష్టకరం. ‘అసతోమా సద్గమయ’ అన్న భావనే ఉండదు కొందరికి (అసత్యం నుంచి సత్యానికి నడుద్దాం.. అనే ఉపనిషద్బోధ). ఎంతసేపూ ‘అసత్లోనే’… తమస్సులోనే.. చీకటిలోనే.. ఉండాలనుకుంటారు. మనం సూర్య మండలాన్ని ఇచ్చినా సరే, వాళ్లు దాన్ని చీకటిగా మార్చేస్తారు. ఏదైనా ఆధ్యాత్మిక సాధన నేర్పి చూడండి. దాన్ని కూడా సమస్యగానే మార్చుకుంటారు. లక్షణంగా పెండ్లి కుదర్చండి. దాన్నీ సమస్యగా చేసుకుంటారు. పోనీ విడాకులు ఇప్పించండి. అదీ వాళ్లకు సమస్యే. చదువు నేర్పినా సమస్యే, నిరక్షరాస్యులుగా ఉంచినా సమస్యే. అజ్ఞానమే దీనికి కారణం.
* * *
మరణించిన వారిని బతికించడం అనేది ఓ అద్భుతమైన విషయంలా అనిపిస్తుంది కొందరికి. నిజానికి, ఇప్పుడు బతికున్న వాళ్లలో చాలామంది చచ్చినవారితో సమానం. వాళ్లకు తమ లోలోపలి ప్రపంచం గురించి ఎరుకే ఉండదు. అలాంటి జీవితం మరణంతో సమానమని నా అభిప్రాయం. నేను మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు ఓ సభలో ప్రసంగించాను. ఓ కరుడుగట్టిన ఆస్తికుడు లేచి నిలబడి ‘మీరు మరణించిన వారిని బతికించగలరా?’ అని అడిగాడు. ‘అలాంటి బుద్ధిలేని పని నేనెందుకు చేస్తాను?’ అని ఘాటుగానే జవాబిచ్చాను. నిజంగా అది బుద్ధిలేని పనే. మరణించిన వాళ్లు మరణించే ఉండాలి. మరణించిన వాళ్లంతా మళ్లీ బతికొస్తే, మనం భూమి మీద ఉండగలమా? జాగ సరిపోతుందా? పోయినవాళ్లు పోయినందుకు మనకు మంచే జరిగింది. నేను చెబుతున్నది.. ఏ ఒక్కరి గురించో కాదు. ఈ ప్రపంచంలో ఇంతవరకూ మరణించిన వందల వేల కోట్లమంది గురించి, డైనోసార్ల వంటి జీవుల గురించి కూడా! ఆ లక్షలకొద్దీ మరణాల వల్లనే మన మనుగడ సాధ్యమైంది. అలాంటప్పుడు, మరణించిన వాళ్లందరినీ బతికించాలని ఏ మూర్ఖుడు కోరుకుంటాడు చెప్పండి? జీవితం అంటే ఏమిటో తెలియని వాడూ, జీవన చక్రం పట్ల అవగాహన లేనివాడు మాత్రమే అలాంటి ప్రశ్నలు వేస్తుంటాడు.
* * *
చాలామంది సమాధికి, మరణానికి అవినాభావ సంబంధం ఉందనుకుంటారు. సమాధి అంటే మరణం లాంటి స్థితే అని భ్రమిస్తారు. అది తప్పు. ‘సమాధి’ అనే మాట ఎన్నో అపార్థాలకు గురైంది. సమాధి – ‘సమ’.. ‘ధీ’ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. ‘సమ’ అంటే దృష్టి. ‘ధీ’ అంటే బుద్ధి. మీరు ‘సర్వసమత్వ బుద్ధి’ స్థితిని చేరితే దాన్నే ‘సమాధి’ అంటారు. బుద్ధికి ఉన్న ఓ లక్షణం.. విచక్షణ. జీవించడానికి విచక్షణ అవసరం. మీరు మనిషినీ, చెట్టునూ వేరువేరుగా చూడగలుగుతున్నారంటే, అది మీ విచక్షణే! మీరు ఒక రాతిని బద్దలు కొట్టాలంటే.. ఆ రాతికి, మీ వేలికి మధ్య భేదాన్ని మీరు గుర్తించగలగాలి. లేకపోతే వేలు చితికిపోతుంది. విచక్షణ అనేది మీ శరీరంలో ప్రతి కణంలోనూ ఉంటుంది. బతికి బట్టకట్టాలన్న తపనను సాకారం చేసుకోవడానికి ఈ విచక్షణే తోడ్పడుతుంది. విచక్షణ శక్తి ప్రభావాన్ని అధిగమిస్తే, మీకు సర్వసమత్వం అబ్బుతుంది. అంటే, మీకు విచక్షణ శక్తి లేకుండా పోతుందని కాదు. అలా విచక్షణే కోల్పోతే, మీరు ఉన్మాదంలోకి వెళ్లిపోతారు. సమాధి స్థితిలో.. మీలోని విచక్షణ శక్తి నిక్షేపంలా ఉంటుంది. కానీ మీరు మాత్రం దానికి అతీతులవుతారు. విపక్ష, స్వపక్ష భావనలు ఉండవు. అంతా ఒకే ఒక్క అద్వితీయ స్వరూపంగా, ఒకే ‘సత్’గా కనిపిస్తుంది. అంతా ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే.. అన్న అనుభూతి మీకు సమాధి స్థితిలోనే కలుగుతుంది. ఈ స్థితిలో దేశమూ, కాలమూ ఉండవు. దేశకాలాలు అనేవి మీ బుద్ధి సృష్టించే కల్పనలు మాత్రమే. మీరు ఆ పరిమితులకు అతీతులైపోతే, దేశ కాలాలు అనేవి ఉండవు. ఎక్కడో ఉన్నదే, ఇక్కడా ఉంటుంది. అప్పుడు ఉన్నదే, ఇప్పుడూ ఉంటుంది. మీకు భూతకాలం ఉండదు, భవిష్యత్తు ఉండదు. అంతా వర్తమానమే. ఈ క్షణమే, ఇక్కడే!
* * *
మన దేశంలో పార్థివ దేహాలను పరిరక్షించేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయరు. మనిషి మరణించిన నాలుగు నుంచి ఆరు గంటల్లో మృతదేహాన్ని దహనం చేయాల్సిందే. సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో ఏది ముందు వస్తే, ఆ లోగా శవాన్ని దహనం చేయడం మంచి సంప్రదాయమని అంటారు. సువిశాల దృక్పథంతో ఆలోచిస్తే.. సృష్టిలో ఎవరూ పుట్టరు, ఎవరూ గిట్టరు. అతిథిగా ఈ భూమి మీద కొంతకాలం నడయాడి వెళ్లిపోతారంతే!
‘మీరు మరణించిన వారిని బతికించగలరా?’ అని అడిగారు ఎవరో. ‘అలాంటి బుద్ధిలేని పని నేనెందుకు చేస్తాను?’ అని ఘాటుగానే జవాబిచ్చాను. నిజంగా అది బుద్ధిలేని పనే. మరణించిన వాళ్లు మరణించే ఉండాలి. మరణించిన వాళ్లంతా మళ్లీ బతికొస్తే, మనం భూమి మీద ఉండగలమా? జాగ సరిపోతుందా? పోయినవాళ్లు పోయినందుకు మనకు మంచే జరిగింది.
– మరణం – మరణ మర్మాన్ని ఛేదించండి
రచన: సద్గురు, పేజీలు: 477; వెల: .300
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, 9000413413