తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత జరిగిన పాలనపరమైన మార్పుల్లో ప్రధానమైంది జిల్లాల పునర్విభజన. పది జిల్లాలుగా ఉన్న రాష్ట్ర భౌగోళిక స్వరూపం ఇప్పుడు 33 జిల్లాలుగా మారిపోయింది. తెలుగు భాషా వ్యవహార ప్రాంతమే అయినప్పటికీ తెలంగాణ చరిత్ర, యాస, భౌగోళికత ప్రత్యేకం. అందులో ఒక్కొక్క జిల్లాది ఒక్కొక్క విశిష్టత. ఆ విశిష్టతను ‘జిల్లా సమగ్ర స్వరూపం’ శీర్షిక కింద ‘తెలంగాణ సారస్వత పరిషత్తు’ పుస్తకాలుగా తీసుకువచ్చింది. శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన జిల్లా నాగర్ కర్నూల్. 1883లో మహబూబ్నగర్ జిల్లా ఏర్పడకముందు జిల్లా కేంద్రం.. నాగర్కర్నూల్. దక్షిణ సరిహద్దులోని నల్లమల అడవులు, కృష్ణానది, శ్రీశైల ఉత్తరద్వారం ఉమామహేశ్వరం, ఆ క్షేత్రానికి దిగువనే ఉన్న రంగాపూర్ నిరంజన్ షా వలీ దర్గా తదితర ధార్మిక స్థలాలతో అలరారుతున్న జిల్లా నాగర్ కర్నూల్. డాక్టర్ మొకురాల రామారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గంగాపురం హనుమచ్ఛర్మ తదితర సాహితీమూర్తుల పరిచయం, ఆ జిల్లాకు సంబంధించిన ప్రసిద్ధ అంశాలను
‘నాగర్కర్నూల్ జిల్లా సమగ్ర స్వరూపం’లో సవివరంగా అందించారు.
ఇక వేములవాడ రాజన్న క్షేత్రం, వేములవాడ చాళుక్యులు, జ్ఞానపీఠ గ్రహీత ఆచార్య సి.నారాయణ రెడ్డి, గొల్లభామ చీరల లాంటి ప్రత్యేకతల సమాహారం సిరిసిల్ల.
ఈ జిల్లా ప్రసిద్ధిని కండ్లకు కట్టే పుస్తకం ‘రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర స్వరూపం’. పునర్విభజనకు ముందు తెలంగాణలో అతిపెద్ద జిల్లా మహబూబ్నగర్. పాలమూరుగా ప్రసిద్ధి చెందిన ఈ జిల్లా పేరు చెప్పగానే పిల్లలమర్రి, కష్టించి పనిచేసే మనుషులు జ్ఞాపకం వస్తారు. తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక, తొలి తెలుగు అంధ అవధాని కోట్ల బాలబ్రహ్మచారి, ఈ జిల్లాలో ఉన్న కోటలు, స్వాతంత్య్రోద్యమంలో జిల్లా పాత్ర… ఇలా ఆదిమ మానవులు మొదలుకొని కొత్త జిల్లా ఆవిర్భావం వరకు ఎన్నో వివరాల సంకలనంగా రూపుదిద్దుకున్నదే ‘మహబూబ్నగర్ జిల్లా సమగ్ర స్వరూపం’.
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికే అస్మక జనపదంగా చరిత్ర ప్రసిద్ధికెక్కిన ప్రాంతం నిజామాబాద్ జిల్లా. కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదిమీద నిర్మించిన శ్రీరాంసాగర్ జలాలతో సస్యశ్యామలమైన నిజామాబాద్ జిల్లా ‘సింహాసన ద్వాత్రింశిక’ కర్త కొరవి గోపరాజు, డిచ్పల్లి రామాలయం, బోధన్ చక్కెర కర్మాగారాలకు ప్రసిద్ధి చెందింది. అశ్మక జనపదం నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు వివిధ రంగాల్లో జిల్లా ఎలా పరిణమించిందో ‘నిజామాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం’ వివరిస్తుంది. 80 ఏండ్ల చరిత్ర కలిగిన తెలంగాణ సారస్వత పరిషత్తు ఎంతో శ్రమకోర్చి వీటిని ముద్రించడం ముదావహం. ఈ జిల్లాల సమగ్ర స్వరూపాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగ్గవే.
ప్రధాన సంపాదకులు: ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
ప్రచురణ: తెలంగాణ సారస్వత పరిషత్తు
ప్రతులకు: తెలంగాణ సారస్వత పరిషత్తు
ఫోన్: 040 24753754
-చింతలపల్లి హర్షవర్ధన్