ఎంతటి కష్టాన్ని అయినా ఒక్కమాటలో వర్ణించడం జానపదులకే చెల్లింది. అలాంటివాటిలో.. నేటికీ గ్రామీణుల నోళ్లలో నానే పదబంధం.. ‘ముండ్ల మీదున్నట్లుంది!’. అయిష్టమైన పనిని బలవంతంగా భుజాన వేసుకొని పూర్తి చెయ్యాల్సి వచ్చినప్పుడు, నచ్చని పనిని ఎలా ముగించాలో తెలియని సందర్భంలో ‘ముండ్ల మీదున్నట్లుంది’ అనే పదబంధాన్ని ఉపయోగిస్తుంటారు. అంటే అంపశయ్యపై ఉండటం. చెప్పులు లేకుండా ముండ్లపై నడవడం ఎంత కష్టమో, అనుభవించిన వారికే తెలుస్తుంది. ఒక్క ముల్లు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతుంటారు.
అలాంటిది ముండ్లమీద ప్రయాణమంటే.. ఎంతో ఓపిక ఉండాలి. పైగా తుది వరకూ కొనసాగించాలంటే మాటలు కాదు. అలాంటి అయిష్టమైన, కష్టంగా ఉన్న పనిని చేస్తున్నప్పుడు ‘ఎట్లుంది నీ యవ్వారం’ అంటే.. ‘ముండ్ల మీదున్నట్లు ఉంది. ఏమి చెప్పమంటవ్?’ అని మనసులో బాధను వెళ్లగక్కుతుంటారు. మనసుకు బాధ కలిగించే పనులు చెయ్యాల్సి వచ్చినప్పుడు కూడా ఇదే పదబంధాన్ని ప్రయోగిస్తారు.