కన్నప్రేమను అమ్మంత అందంగా చూపించగలిగేది చిత్తరువే!ప్రకృతి సోయగాలను పరవశంగా పరవళ్లు తొక్కించేదీ చిత్రమే!పాలబుగ్గల చిన్నారి మోములో
అమాయకత్వమైనా, కులుకులొలికే కలికి సమ్మోహన రూపమైనా ప్రసన్నకాన్వాస్పైకి చేరితే కొత్తహంగులు సంతరించుకుంటాయి.
నయన మనోహరమైన దృశ్యాలకు తన కుంచెతో ప్రాణం పోస్తున్నది చిత్రకారిణి కోట ప్రసన్న జ్యోతి. రాధామాధవ గాథలను రంగుల్లో రంజింపజేసినా, ఏకదంతుడిని ప్రసన్నంగా ప్రత్యక్షం చేసినా ప్రసన్న కుంచెకే చెల్లింది. హైదరాబాద్కు చెందిన ప్రసన్నకు చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీసే అలవాటు ఉంది. తల్లి సుమలత ప్రోత్సాహంతో కళకు మెరుగులు దిద్దుకుంది. జవహర్ బాలభవన్ చిత్రకారుడు కిషన్ శిక్షణతో ఆమె సృజన జనమంతా మెచ్చుకునే స్థాయికి చేరుకుంది. చిత్రకళలో ఫైన్ ఆర్ట్స్ పట్టా అందుకుంది ప్రసన్న. లైన్ డ్రాయింగ్తో మొదలైన ఆ కళ ఆయిల్, ఆక్రిలిక్, వాటర్, పోస్టర్ రంగులతో వేవేల వర్ణాలు పూయించింది. ప్రకృతి, మానవ సంబంధాలు, ఆధ్యాత్మికత ఇలా అంశమేదైనా తనదైన శైలిలో కాన్వాస్పై చెరగని సంతకం చేస్తున్నది ప్రసన్న. కొన్నాళ్లు చిత్రకళా ఉపాధ్యాయినిగానూ పనిచేసింది. మహా నగరాల్లో గ్రూప్, సోలో ప్రదర్శనలు ఏర్పాటుచేసి తన నైపుణ్యాన్ని చాటుకుంది. జాతీయస్థాయి పోటీల్లోనూ మన్ననలు అందుకుంది.