వర్తమాన కాలంలో ప్రపంచ ప్రజల ఈతిబాధల పట్ల స్పందిస్తూ, వాటికి పరిష్కారాలను అన్వేషిస్తూ కవిత్వం రాసే బాధ్యత నిర్వహించే వాళ్లు తక్కువమంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒకరు ఎన్. వేణుగోపాల్. 2003లో ఇరాక్లో అమెరికా పాగా వేయడం మొదలుకుని 2020లో కరోనా మహమ్మారి భూమండలాన్ని అలుముకుని అల్లకల్లోలం చేసే వరకు వివిధ చారిత్రక, సామాజిక, రాజకీయ అంశాలకు స్పందనగా అక్షరీకరించిన 50కి పైగా కవితలతో వేణుగోపాల్ వెలువరించిన సంకలనం ‘రెప్పవాల్చని కాపలా’. ఇరాక్పై అమెరికా దాడి మొదలైన రోజున అప్పటి ఆ దేశ సమాచార మంత్రి మహమ్మద్ సయీద్ అల్ హసన్ ఉపన్యాసానికి స్పందనగా రాసిన ‘మనిషి మీద విశ్వాసం’తో ఈ సంకలనం మొదలవుతుంది.
ఎల్టీటీఈ అధినేత కె. ప్రభాకరన్ కాల్చివేత నేపథ్యంలో రాసిన ‘అస్తమించని ప్రభాకరన్ చూపు’ పాదాల్లో వచ్చే ‘రెప్పవాల్చని కాపలా’ పదాలను తన సంకలనానికి ఎంచుకోవడం గమనార్హం. రక్త ప్రవాహం సముద్ర ఘోషలా ఉంటుందనే పరిశోధన ఫలితాన్ని వివరించే ‘డాప్లర్ టెస్ట్’, ఆడపిల్లలపై అఘాయిత్యాలను ప్రశ్నించే ‘నిర్భయా, ఎవరిదీ భారతం?’, భారతదేశంలో బ్రిటిష్ వారి దమనకాండకు వందేండ్లయినా కన్నీళ్లు వస్తున్నాయని చరిత్రను గుర్తుచేసే ‘జలియన్ వాలా బాగ్’, మూతపడిన బషీర్బాగ్ ఎంబసీ కేఫ్తో ముడిపడిన తన అనుభవాలను పంచుకునే ‘మన జ్ఞాపకాల సమాధి’ ఇలా ఇందులోని ప్రతీ కవిత చదివేవారిని ఉద్వేగానికి గురిచేస్తుంది. మనిషి మనిషిలా బతకాలని గుర్తుచేస్తుంది. రచయిత అఫ్సర్ అన్నట్లు ‘వేణూ కవిత్వంలోకి అడుగుపెట్టడమంటే అనేక సామాజిక, చారిత్రక సందర్భాల్లోకి దూకడమే’.
రెప్పవాల్చని కాపలా
రచన: ఎన్. వేణుగోపాల్
పేజీలు: 150; వెల: రూ. 100/-
ప్రచురణ: స్వేచ్ఛా సాహితి
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
ఫోన్: 98485 77028
– హర్షవర్ధన్ చింతలపల్లి