భజగోవిందం
రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి
పేజీలు: 181; వెల: రూ. 250/-
ప్రచురణ: ప్రిజం బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
భారతీయ ధార్మిక వాఙ్మయంలో అత్యంత సులువుగా మనిషిలో పాతుకుపోయిన మోహాన్ని పోగొట్టే మంత్రం ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు చెప్పిన ‘మోహముద్గరం’. ఈ పేరుకంటే మొదటి శ్లోకంలోని ‘భజగోవిందం భజగోవిందం’ పాదంతో ఇది ‘భజగోవిందం’గా ప్రసిద్ధిచెందింది. ఇందులోని శ్లోకాల సారాన్ని మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్యాఖ్యాన రూపంలో సుబోధకమైన పుస్తకం వెలువరించారు. దక్షిణ ఆసియాలో కోతులను పట్టుకునేందుకు ఒక పద్ధతి వాడుకలో ఉంది. అది.. సన్నటి ద్వారం కలిగిన కుండలో పుట్నాలను ఉంచడం. పుట్నాల ఆశకు కోతి కుండలో చేయి పెడుతుంది. గుప్పిట బిగుసుకోవడంతో చేయి బయటికి రాదు. దీంతో కోతి ఎరలో చిక్కుకుని పట్టుబడుతుంది. పుట్నాలను వద్దనుకుంటే తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ, అది వదిలిపెట్టదు. మనుషుల మనస్తత్వమూ ఇలానే ఉంటుంది. శాశ్వత ఆనందాన్ని ఇచ్చే భగవంతుడి నామస్మరణను వదిలిపెట్టి, భౌతిక ప్రపంచం అది సమకూర్చే వస్తువుల అశాశ్వత ఆనందం కోసం వెంపర్లాడుతూ ఉంటుంది. 1200 ఏండ్ల కింద అద్వైత వేదాంతి ఆదిశంకరులు, ఆయన నలుగురు శిష్యులకు కాశీలో ఎదురైన వృద్ధ పండితుడి పరిస్థితీ సరిగ్గా ఇదే. కాటికి కాళ్లు చాపుకొన్న వయసులోనూ నిత్యుడైన గోవిందుడి
(విష్ణువు) భజన చేయకుండా, ఇంకా వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తున్న మూఢమతి అయిన ఆ వృద్ధుణ్ని చూసి శంకరులకు జాలి కలిగింది. అలా ఆచార్యుల నోటినుంచి ఆశువుగా పుట్టుకొచ్చిందే ‘మోహముద్గరం’. శంకరుల శ్లోకాలకు మల్లాది సరళ వ్యాఖ్యానం చదివితే ‘భజగోవిందం’ ప్రాధాన్యం తేటతెల్లం అవుతుంది.
ఇట్లు.. ప్రేమతో!
ప్రియమైన నీకు..
(175 మంది రచయిత్రుల లేఖావళి)
సంపాదకులు: జ్యోతి వలబోజు
పేజీలు: 480; వెల రూ: 300
ప్రతులకు: 8096310140
దూరాలను కలిపే దారాలు ఉత్తరాలు. ఆ దూరం భౌతికమైంది కావచ్చు. మానసికమైంది కూడా కావచ్చు. అనుకోని అపోహలు రెండు మనసుల మధ్య అగాథాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఆ ఇద్దరూ స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు, సహ విద్యార్థులు.. ఎవరైనా కావచ్చు. ఎవరికి రాయాలో తెలియనప్పుడు మనకు మనమే ఓ ఉత్తరం రాసుకుని గుండె బరువు దించుకోవచ్చని కూడా చెబుతుంటారు మానసిక నిపుణులు. జ్యోతి వలబోజు సంపాదకత్వంలో వెలువడిన ‘ప్రియమైన నీకు’ ఓ వినూత్న ప్రయత్నం. నూట డబ్భు అయిదుమంది రచయిత్రుల లేఖల కదంబం. ప్రతి ఉత్తరం ఓ మహిళ హృదయావిష్కరణే. జ్యోతి వలబోజు వదిన హోదాలో ఇందిరకు రాసిన లేఖ.. చీరల చుట్టూనే సాగుతుంది. ప్రతి చీర వెనుకా ఒక కథ. ప్రతి కథలో ఓ జ్ఞాపకం. ప్రతి జ్ఞాపకం ఆ చీరంత అమూల్యమైందే. అభినేత్రి వంగల తన ఉత్తరంలో కొత్తకోడలికి అత్తింటి నుంచి అందాల్సిన ప్రేమను ప్రస్తావించారు. అను కార్తి రాసిన ఉత్తరం కనిపించని నాన్నకు కన్నీటి విన్నపం. అనుపమ లేఖ నిండా ధర్మాగ్రహన. బాధ్యత తెలియని మనిషికి కర్తవ్యబోధన అది. ‘గూడు తెంచుకుని బయటికి వస్తేనే అది సీతాకోకచిలుక అవుతుంది. లేకపోతే అదే గూటిలో గొంగళి పురుగుగా శిథిలమైపోతుంది’ అంటూ తన ఉత్తరానికి అత్యుత్తమమైన ముగింపు ఇచ్చారు అపర్ణ క్రోవి. డి. కామేశ్వరి లేఖను చదువుతున్నప్పుడు పాఠకులు కాలయంత్రం ఎక్కి గతంలోకి ప్రయాణిస్తారు. చివరి ఉత్తరం పూర్తిచేసి పుస్తకం మూసేస్తున్న సమయానికి నూట డబ్భు అయిదుమంది మహిళల మనసులను చదివిన భావన కలుగుతుంది.
బుక్ షెల్ఫ్
గౌతమీతీరం (కథలు)
రచన: రత్నాకర్ పెనుమాక
పేజీలు: 136, వెల: రూ. 195
ప్రచురణ: రత్నాకర్
ప్రచురణలు
ప్రతులకు: 96402 68333
పార్వతీశ్వరా (శతకము)
రచన: రుద్రాక్షలమఠం
ప్రభులింగ శాస్త్రి
పేజీలు: 48 వెల: రూ. 250
ప్రతులకు: 63058 90867
నువ్వేచెప్పు (కవిత్వం)
రచన: కె.వి.యస్.వర్మ
పేజీలు: 55, వెల: రూ. 50
ప్రచురణ: ఆలోచన
ప్రతులకు: 92462 77375
కరోనా నానీలు
రచన: చలపాక ప్రకాష్
పేజీలు: 60 వెల: రూ. 40
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్,
ఫోన్: 92474 75975
అన్వేషణ (నవల)
రచన: సలీం
పేజీలు: 182, వెల: రూ. 150
ప్రతులకు:
ఫోన్: 75886 30243
– చింతలపల్లి హర్షవర్ధన్