‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
ఓచేతిలో సుత్తి, మరో చేతిలో శానం పట్టుకుని.. గొయ్యిలోకి దిగడానికి తయారుగా నిలబడి ఉన్న పదేళ్ల తన కొడుకు శీను వైపు దిగులుగా చూస్తూ..
“జాగర్త బాబూ!” అన్నది అచ్చమ్మ. వాడు మెత్తగా నవ్వుతూ..
“రోజూ ఇదే మాట.. ఎందుకమ్మా బయపడ్తావు? నేను జాగర్తగానే ఉంటాలే!” అన్నాడు. మొహం మీద పడుతున్న ఎండకు వాడి మొహం మెరుస్తున్న బూడిద రంగు అబ్రకపు పలకలా కనిపించింది.
వాడి పక్కనే నిలబడి ఉన్న పన్నెండేళ్ల ఎంకడి చేతిలో కూడా అవే పనిముట్లు ఉన్నాయి. వాటితోపాటు ప్లాస్టిక్ బుట్ట కూడా ఉంది.
“మా అమ్మ కూడా ఇంతేరా. ఇంటినుంచి బయల్దేరేముందే వంద జాగర్తలు చెప్తుంది తెలుసా!” అన్నాడు.
“పిల్లల మీద తల్లికుండే కడుపు తీపి మీకర్థం కాదులే! ఆ మాయదారి అబ్రకం కోసం నువ్వూ, శీనుగాడు గొయ్యిలోకి దిగిన ఛణం నుంచి బైటి
కొచ్చేవరకు గుండె దడదడలాడ్తూనే ఉంటుంది తెలుసా?” అన్నది వాడి అమ్మ మంగమ్మ.
“మాకేం కాదులేమ్మా!” అంటూ ఎంకడు గొయ్యిలోకి మెల్లగా దిగి, శీనుకు చేయందించి దింపుకొన్నాడు. ఇద్దరూ జాగ్రత్తగా లోపలికి దిగసాగారు. గొయ్యిలోకి కిందికి దిగేకొద్దీ చీకటి నీటి ఊటలా ఊరసాగింది.
“లోతుకు తవ్వింది చాలు. ఇక పక్కలనుంచి తవ్వుదాం!” అన్నాడు ఎంకడు.
ఇద్దరూ తమ చేతుల్లో ఉన్న పనిముట్లతో అబ్రకం కలిసిన రాళ్లను పెకిలించి, ప్లాస్టిక్ బుట్టలో వేయసాగారు. బుట్ట నిండగానే..
“నేను పైకెళ్లి వీటిని ఇచ్చొస్తాను” అన్నాడు ఎంకడు. రాళ్లతో నిండి ఉన్న బుట్టను నెత్తిమీద మోసుకుంటూ పైకితెచ్చి వేశాడు. మళ్లీ వెంటనే కలుగులోకి ఎలుక దూరినట్టు.. ఆ బిలంలోకి దూరి మాయమైపోయాడు.
అచ్చమ్మ, మంగమ్మ ఆ రాళ్లలోంచి అబ్రకపు ముక్కల్ని వేరు చేసి తమ పక్కన పెట్టుకున్న ప్లాస్టిక్ బుట్టలో వేయసాగారు.
మధ్యాహ్నం దాటింది. ఎండ తెల్లటి అబ్రకపు పొరలా నేలంతా పరుచుకుని, ఎర్రటి నిప్పులా కాలుస్తున్నది. భూమి తన కుహరంలో దాచుకున్న ఖనిజాల్ని తవ్వి తీసే గని కార్మికుల్లా పనిచేస్తున్న శీను, ఎంకడు అప్పటికే స్వేద నదుల్లా మారిపోయారు.
“ఆకలేస్తంది. బువ్వ తిని కొద్దిసేపు కూసుంటే గానీ పనిచేసే ఓపిక రాదు” అన్నాడు ఎంకడు.
రెండు మట్టి రంగు కుందేళ్లు బొరియలోంచి బైటికొస్తున్నట్టు ఇద్దరూ బైటికొచ్చి చేతులు కడుక్కుని అన్నాల కోసం కూర్చున్నారు. అచ్చమ్మ శీను కంచంలో అన్నం, గోంగూర పచ్చడి వడ్డించాక.. వాడు తింటున్నప్పుడు గోరింటాకు పూసినట్టు ఎర్రగా కందిన వాడి అరచేతుల వైపు చూసి పక్కకు తిరిగి కళ్లొత్తుకుంది. దుఃఖం ఉండలా మారి అడ్డుపడటంతో ఆమెకు ముద్ద గొంతులోకి దిగలేదు.
పిల్లలు తినేసి, మళ్లా గొయ్యి లోపలికి దిగాక అచ్చమ్మను ఊరడిస్తూ..
“ఎన్ని కన్నీళ్లు కార్సినా మన బతుకులు మారవు వదినా. నా మొగుడు సచ్చిపోయే నాటికి ఎంకడికి ఆరేండ్లు. ఇల్లు గడవడం కోసం ఆ పసోణ్ని కూడా పన్లో పెట్టక తప్పలేదు. బొబ్బ
లెక్కిన వాడి లేత సేతులు సూసి.. ఎన్ని రాత్రుళ్లు ఏడ్సానో నాకే తెలుసు. ఇప్పుడు ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదొదినా. ఎప్పుడో ఇంకిపోయినయి” అన్నది మంగమ్మ.
మంగమ్మ జీవితంలో జరిగిన విషాదాలన్నీ అచ్చమ్మకు తెలుసు. వాళ్లవి పక్క పక్క గుడిసెలే.
‘నా బతుకు నీ బతుక్కన్నా మెరుగేం కాదులే మంగమ్మా!’ అని మనసులోనే అనుకుంది అచ్చమ్మ. తనూ తన మొగుడు పన్లోకెళ్తున్న రోజుల్లో ఇల్లు గడవడం కష్టమయ్యేది కాదు. ఓ కొడుకు పుట్టిన ఏడాదిన్నరకు కూతురు పుడ్తే ఎంత సంతోషపడ్డారో! పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకోవాలనీ, బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలనీ ఎన్ని కలలు కన్నారో..
ఓ రోజు రాత్రి గొంతుదాకా తాగున్న ఎదవెవడో బైకును రోడ్డుమీద కాకుండా తన మొగుడి వీపు మీదనుంచి పోనివ్వడంతో అతని వెన్నెముక దెబ్బతిన్నది. అప్పటినుంచి మంచానికే పరిమితమై పోయాడు. నాలుగు పొట్టలు నిండాలంటే.. ఎనిమిదేళ్ల శీనును పనిలో పెట్టక తప్పలేదు.
ఆ రోజు తన మొగుడు వెక్కి వెక్కి ఎలా ఏడ్చాడో తనకింకా గుర్తుంది. శీనును చదువు మానిపించి, నోరు తెరుచుకుని ఉన్న కొండచిలువల్లాంటి అబ్రకపు గోతుల్లోకి పంపడం అతనికి సుతరామూ ఇష్టం లేదు. తనకూ ఇష్టం లేదు. కానీ, తప్పని పరిస్థితి.
‘కనీసం మన బిడ్డనైనా సదివిద్దాం’ అన్నాడు కండ్లనిండా నీళ్లు నింపుకొని.
‘నువ్వు ఏడ్వబాకయ్యా! ఎంత కట్టమైనా పర్లేదు. మన బిడ్డను సదివిద్దాం’.. అతనికి భరోసా ఇస్తూ అన్నది తను.
ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి తమ దిక్కే రావడం చూసి.. ఆలోచనల్లోంచి బైటపడి మంగమ్మ వైపు చూస్తూ..
“ఎవరై ఉంటారు?” అన్నది.
మంగమ్మ కూడా వాళ్లవైపు ఆశ్చర్యంగా చూసింది. వస్తున్నామెకు పాతికేళ్లకు మించి వయసుండదు. బ్లూ జీన్స్ ప్యాంట్లో చెక్స్ షర్ట్ను టక్ చేసి ఉంది. భుజానికి హ్యాండ్బ్యాగ్ వేలాడుతున్నది. ఆమె పక్కన ఉన్న వ్యక్తికి ముప్పై ఏళ్లు ఉంటాయి. బాగా చదువుకున్న వాడిలా ఉన్నాడు.
ఆమె నేరుగా వాళ్ల ముందుకొచ్చి నిలబడి.. స్నేహపూర్వకంగా నవ్వింది.
“నా పేరు ఆద్య. తను మోహన్. ఇద్దరం ఓ
ఎన్జీవోలో పనిచేస్తున్నాం. ఇక్కడ కూచోవచ్చా” అంటూనే.. వాళ్లేదో అనేలోపల గొంతుక్కూర్చుంటూ.. “ఈ పని ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారు?” అని అడిగింది.
అదే సమయంలో రాళ్లను మోసు
కొచ్చిన ఎంకణ్ని చూస్తూ..
“లోపల ఇంకా ఎంతమంది పిల్లలు పనిచేస్తున్నారు?” అని ప్రశ్నించింది.
అచ్చమ్మ చెప్పిన సమాధానం విన్నాక..
“పద్దెనిమిదేళ్లు నిండని పిల్లల చేత పని చేయించడం నేరమని మీకు తెలుసా? ప్రభుత్వ అనుమతి లేకుండా మైకాను తవ్వి తీయడం చట్ట వ్యతిరేకమని తెలుసా? రెండు వేల ఒకటి తర్వాత ఇక్కడి మైకా గనుల లీజులను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలుసా?” అని అడిగింది.
వాళ్లనుంచి సమాధానం రాకపోవడంతో..
“పిల్లల చేత మీరు చేయిస్తున్న పనివల్ల వాళ్లకెంత ప్రమాదమో ఆలోచించారా? కాళ్లకూ, చేతులకూ గాయాలు కావొచ్చు. చర్మ వ్యాధులు, ఉబ్బసంలాంటి రోగాలు రావొచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోవచ్చు” అన్నది.
“ఈ పని సేయకపోతే మా కడుపులెలా నిండుతాయమ్మా? అప్పుడు ఆకలితో పేనాలు పోతాయి కదమ్మా!” అన్నది అచ్చమ్మ.
“మీరు రోజుకు ఎంత సంపాదిస్తారు?” అని అడిగాడు మోహన్.
“పది కేజీల వరకు తవ్వి తీస్తే గుడివాడ నుంచి ఓ ఆసామి వచ్చి నాలుగు వందలిచ్చి తీసుకెళ్తాడయ్యా. చెరో రెండొందలు తీసుకుంటాం..” ఈసారి మంగమ్మ సమాధానమిచ్చింది.
“ఎవరా ఆసామి? అతని పేరేంటి? మీరెంత మోసపోతున్నారో తెలుసా? మార్కెట్లో కేజీ అబ్రకం ధర ఎన్ని వేలు పలుకుతుందో తెలుసా?”అన్నాడు మోహన్.
అచ్చమ్మ ఏదో చెప్పబోయే లోపల రెండు స్కూటర్లమీద నలుగురు మనుషులు వచ్చారు. వాళ్లలో మైకా స్క్రాప్ కొనే సుబ్బయ్య కూడా ఉన్నాడు.
వాళ్లు రావడంతోటే..
“మీరీ చుట్టుపక్కల కనిపించారో మర్యాద దక్కదు. వెంటనే వెళ్లిపొండి..” అంటూ ఆద్యనూ, మోహన్నూ తరిమేశారు.
అచ్చమ్మ, మంగమ్మల వైపు కోపంగా చూస్తూ..
“ఎవరేం అడిగినా చెప్పేయడమేనా? వాళ్లెవరో.. ఏమిటో.. తెలుసుకోవద్దా? వాళ్లతో మీరేం చెప్పారు? నా పేరు చెప్పారా?” అంటూ హూంకరించాడు సుబ్బయ్య.
వాళ్లిద్దరూ వణికిపోతూ..
“మేమేమీ సెప్పలేదయ్యా! మీ పేరు అసలు సెప్పనే లేదయ్యా!” అన్నారు.
“జాగర్తగా ఉండండి. ఎవరేం అడిగినా తెలియదని చెప్పండి. తెలిసిందా?” అంటూ మరోసారి గద్దించి, మిగతావాళ్లను తీసుకుని వెళ్లిపోయాడు సుబ్బయ్య.
* * *
మట్టితో చివరి స్నానం చేయించినట్టు ఉంది.. గుడిసె ముందు పెట్టి ఉన్న శీను శరీరం. కోసుగా ఉన్న రాళ్లు చీరుకుపోవడం వల్ల కారిన రక్తం గడ్డకట్టి, శరీరంమీద అక్కడక్కడా కుంకుమ చల్లినట్టుంది.
శీను శరీరాన్ని ఇంటికి మోసుకొచ్చి అప్పటికి అరగంట కావస్తున్నది. అచ్చమ్మ కన్నీటి వరదలా ఉంది. ఎనిమిది నెలలనుంచి గొయ్యిలోపల అడ్డంగా తవ్వడంవల్ల ఏర్పడిన సొరంగం పైకప్పు.. ‘ధడేల్’ మంటూ కూలిపోయిన శబ్దంతోపాటు.. శీను ‘అమ్మా’ అంటూ అరిచిన హృదయ విదారకమైన అరుపు ఆమె చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉంది.
జరగాల్సిన ఘోరమంతా క్షణాల్లో జరిగిపోయింది. ఎప్పటి మాదిరే తనూ, మంగమ్మ కబుర్లు చెప్పుకొంటూ.. రాళ్ల నుంచి అబ్రకపు ముక్కల్ని వేరుచేసే పనిలో ఉన్నారు. గంటక్రితమే ఎంకడు బుట్టనిండా రాళ్లను తెచ్చి, వాళ్లముందు వేసి వెళ్లాడు. మరి కొద్దిసేపట్లో ఎంకడు పైకొస్తాడని ఎదురు చూస్తున్నంతలో.. భూమి కంపించినట్టు శబ్దం వచ్చింది. దాంతోపాటు శీను పెట్టిన కేక.. ఆమె గుండె ఆ క్షణమే డైనమైట్ పెట్టి పేల్చినట్టు వేయి ముక్కలుగా బద్దలైంది. అదే సమయంలో ఎంకడు పెద్దగా ఏడుస్తున్న శబ్దం కూడా వినొచ్చింది.
తనతోపాటు మంగమ్మ కూడా లేచి, గొయ్యి దిక్కు పరుగెత్తింది. ఆరడుగుల లోతు వరకు వెళ్లాక.. దారి చాలా సన్నగా ఉండటంతో ఇద్దరూ లోపలికి వెళ్లలేక పెద్దగా కేకలు పెడుతూ.. గుండెల్ని బాదుకుంటూ ఏడవసాగారు. పోగైన వాళ్లలో పద్నాలుగేళ్ల పిల్లలిద్దరు గొయ్యిలోకి దిగి, ఎంకణ్ని పైకి మోసుకొచ్చారు.
“సొరంగం మొత్తం రాళ్లు, మట్టితో కూరుకుపోయింది. ఎంకడి కాళ్లు, వీపు మీద బాగా దెబ్బలు తాకినయి. శీను కనిపించలేదు. రాళ్ల కింద ఇరుక్కున్నడు కావచ్చు. మొత్తం రాళ్లూ, మట్టినీ తీస్తే కానీ.. శీనును బయటికి తీయలేం!” అన్నారు.
‘ఎంకడికి దెబ్బలు తగిలాయి సరే! మరి నా బిడ్డో! వాడికేమైంది? పదేళ్లు కూడా పూర్తిగా నిండని పసివాడు.. నా పాణం! వాడేమై
పోయిండు? అసలు కనిపించనేలేదా? మూలుగుతున్న శబ్దం కూడా ఇనిపించలేదా?’..
ఆ మాటే వాళ్లతో అంటే.. “ఇనిపించనే లేదు!” అని చెప్పారు వాళ్లు.
‘అంటే వాడి శరీరం పూర్తిగా రాళ్లు, మట్టిలో కూరుకుపోయిందా? అయ్యో.. నా తండ్రికి ఊపిరెలా ఆడుతుంది? ఆ రాళ్లు ఎంత బరువున్నయో? అసలే బక్క పాణం! ఎంత బరువని మోస్తయి? భూమంత బరువు!’..
ఎవరో సుబ్బయ్యకు ఫోన్ చేశారు. అరగంట లోపలే సుబ్బయ్య ముగ్గురు పనివాళ్లను వెంట
బెట్టుకుని వచ్చాడు. వెంటనే ఎంకణ్ని ప్రభుత్వాసుపత్రికి పంపించే ఏర్పాటుచేశాడు. మంగమ్మ శోకాలు పెట్టి ఏడుస్తూ వాడితోపాటు వెళ్లింది.
ఆరు గంటలు శ్రమిస్తేనే కానీ.. శీను శరీరం బైటికి రాలేదు. పైకప్పు కూలి మీదపడిన కొన్ని నిమిషాలకే పిల్లాడు చచ్చిపోయి ఉంటాడని
తీర్మానించారు.
ప్రాణంలేని శీను శరీరంతోపాటు, ప్రాణమున్న శవంలా మారిన తన శరీరాన్ని కూడా గుడిసెకు చేర్చారు. తన మొగుడు ఏడుస్తున్నాడు. ఎని
మిదేళ్ల కూతురు కూడా ఏడుస్తున్నది. ఇంక
జీవితంలో ఏడుపు తప్ప ఏం మిగిలిందని?
ఏడ్చి ఏడ్చి అచ్చమ్మ సొమ్మసిల్లినట్టు పడి
పోయింది.
“మొదట జరగాల్సిన కార్యక్రమం చూడండి. బాబుకు చివరి స్నానం చేయించండి” అన్నాడు సుబ్బయ్య.
‘నా కొడుక్కు చివరి స్నానం చేయిస్తారా?
చనిపోయినవాళ్ల శరీరాన్ని మొదట నీళ్లతో కడిగాక.. మట్టిలో పడుకోబెడ్తారు. నా కొడుకు మొదట మట్టిలో కొన్ని గంటలు పడుకున్నాక.. ఇప్పుడు నీళ్లతో ఒంటిని కడుగుతామంటున్నారు. వాడికి ఆ మట్టిస్నానం చాలు కదా! ఇక ముందంతా వాడికి మట్టి స్నానమేగా!’..
అచ్చమ్మ హృదయంలో వాడి గురించి తను కన్న వేల కలల సమాధులు మొలిచాయి.
* * *
శీను చనిపోయి పద్నాలుగు రోజులు. అచ్చమ్మకు దిగులుగా ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఉండటం కోసం ఆమె చేతిలో సుబ్బయ్య పెట్టిన డబ్బులు రెండ్రోజుల క్రితమే అయిపోయాయి. కొద్దికొద్దిగా కడుపుని నమిలి తినేస్తున్న ఆకలిని తనూ తన మొగుడు ఎలాగో ఓర్చుకుంటున్నారు. కానీ, కూతురు ఆకలని ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది.
ఏం పని చేసి తన కుటుంబాన్ని పోషించుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు. శీను చనిపోయిన రోజే నిర్ణయించుకుంది.. ప్రాణం పోయినా సరే మొసలి నోళ్లలా తెరుచుకుని ఉండే అబ్రకపు గోతుల దరిదాపులకు కూడా పోకూడదని. కానీ, చేయడానికి ఆ ఊళ్లో మరేమీ పని లేదు. ఊరంటే ఊరు కూడా కాదు. గూడూరుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో అబ్రకం దొరుకుతుందని తెలియడంతో ఎక్కడెక్కడినుంచో దాదాపు యాభై కుటుంబాల వాళ్లు వచ్చి గుడిసెలు ఏసుకున్నారు అంతే! ఈ యాభై కుటుంబాలకు జీవనాధారం.. నేలను తవ్వి తీసే అబ్రకపు ముక్కలే!
పోనీ తన మొగుడికి ఆరోగ్యం బాగుంటే గూడూరు వెళ్లి ఏదో ఓ పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించుకుని వచ్చేవాడు. తనకా అదృష్టం కూడా లేదు. తన కూతురితోపాటు మొగుణ్ని కూడా తనే సాకాలి.
శీను చనిపోయాక ఎన్ని పీడకలలో! ఓ కలలో అబ్రకం కోసం తవ్విన గొయ్యి అగాధంలా మారి చుట్టుపక్కల ఉన్న మనుషులందర్నీ తనలోకి లాక్కుంటున్నట్టు! మరో కలలో అది రెండు బారల నాగుపాములా మారి ఊళ్లో అందర్నీ కాటేస్తున్నట్టు! ఎన్నిసార్లు నిద్రలోంచి పెద్దగా అరుస్తూ లేచి కూర్చుందో!
ఎలాగో మరో రోజు గడిచింది. ఆకలికి తాళలేక తన మొగుడు, కూతురు శోషొచ్చినట్టు పడిపోయారు. తన పరిస్థితి కూడా అంతే! ఇలానే మరో రెండ్రోజులు పస్తులుంటే.. చచ్చిపోతారేమో అని భయమేస్తున్నది. పాము పడగ నీడలో బతికే తమలాంటి వాళ్లు.. పాము నుంచి ఎక్కడికని పారిపోగలరు?
మంగమ్మ పరిస్థితి కూడా అలానే ఉంది. ఎంకడికైన గాయాలు ఇప్పుడిప్పుడే మాను పడ్తున్నాయి. వాడు గాయపడిన రోజే ఒట్టేసుకుంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కొడుకుని ప్రమాదాల అంచుల్లోకి పంపనని. తనకు భర్త ఎలాగూ లేడు. మిగిలింది వాడొక్కడే! ఆ రోజు అదృష్టం కొద్దీ గాయాలతో బైటపడ్డాడు గానీ.. ఏ కాలో, చెయ్యో విరిగుంటే ఏమయ్యేది? ప్రాణాలే పోయుంటే! ఆ ఆలోచనకే ఆమె ఒళ్లు భయంతో జలదరించింది.
కానీ, రోజులు గడిచేకొద్దీ ఆమె మెత్తబడసాగింది. పనిలోకి వెళ్లకపోతే ఆకలి క్షమించేలా లేదు. ఎంకడు నడవడానికి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు. అయినా.. ‘మూడు పొట్టలు నిండాలంటే రేపటినుంచి పనిలోకి వెళ్లక తప్పదు!’ అనుకుంది.
* * *
అచ్చమ్మ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. ‘ఎంకడు గొయ్యిలోకి దిగి రాళ్లను పగలకొడ్తే.. వాటిని పైకెవరు మోసుకొస్తారు? ఆ పని కూడా ఎంకడు చేస్తే వచ్చే నాలుగొందల్లో మూడొందలు మంగమ్మకే ఇవ్వాల్సి వస్తుంది. నా వాటాకొచ్చే వంద రూపాయల్తో ఇల్లెలా గడుస్తుంది?’.. ఆమె తన పక్కన పడుకుని నిద్రపోతున్న కూతురి అమాయకమైన మొహం వైపు చూసింది. అనాయాసంగానే ఆమెకు కన్నీళ్లు పొంగుకొచ్చాయి. ‘ఎంత కట్టమైనా సరే.. నిన్ను సదివిత్తనని మీ అయ్యకు మాటిచ్చిన. అన్ని కట్టాలకన్నా ఆకలిని తట్టుకోడం శానా కట్టం తెలుసా తల్లీ! కట్టాలకు లొంగిపోయి.. మాట నిలుపుకోలేక పోతున్న ఈ తల్లిని ఛమిస్తావు కదూ!’ అనుకుంది.
మరునాడు ఉదయం అచ్చమ్మ తన కూతురి చేయి పట్టుకొని పనికి బయల్దేరింది. ఎంకడితోపాటు తన కూతురు కూడా గొయ్యిలోకి దిగుతుంటే.. ఆకలితో నోరు తెరుచుకుని ఎదురుచూస్తున్న రాక్షసుడి నోట్లోకి పిల్లల్ని పంపిస్తున్నట్టు అనిపించింది అచ్చమ్మకు. నేలను రెండు చేతుల్తో బాదుతూ గుండెలవిసేలా ఏడ్చింది!
ప్రకాశం జిల్లా, త్రోవగుంట గ్రామం.. సయ్యద్ సలీం స్వస్థలం. ఎమ్మెస్సీ (టెక్) చేశారు. ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్లో అడిషనల్ కమిషనర్గా ఉద్యోగ విరమణ పొందారు. కాలేజీ రోజుల నుంచే కవితలు రాయడం మొదలు
పెట్టారు. ఇప్పటి వరకూ మూడు కవితా సంపుటాలు, పది కథా సంపుటాలు, 27 నవలలను వెలువరించారు. ఈయన రాసిన మొదటి కథ ‘మనీషి’.. 1980లో ఆంధ్రభూమి పత్రికలో ప్రచురితమైంది. 150కిపైగా కవితలు, 50కి పైగా కథలు.. వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి. ‘కాలుతున్న పూలతోట’ నవలకు 2010లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ‘వెండి మేఘం’ నవల, ‘తలాక్’, ‘లాకులు’, ‘నూకలు’ కథలను పలు విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా చేర్చాయి.
-సయ్యద్ సలీం, 95886 30243