శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. చుట్టూ కమ్ముకున్న యుద్ధమేఘాలను తొలగించే శక్తి శ్రీమత్ రామానుజాచార్యులకే ఉందని భావిస్తాడు విష్ణువర్ధనుడు. అదే జరిగింది.
త్రిభువనమల్లుడికి పూర్తిగా అర్థమైంది.
యుద్ధం అనివార్యం అని! నిజానికి ఆయన దృష్టి రాజ్యంలో శాంతిభద్రతలు సంపూర్ణంగా పరిరక్షించటంపైనా, సంక్షేమం, అభివృద్ధిపైనా కేంద్రీకృతమై ఉంది.
విద్యాపతి సేకరించిన సమాచారం ప్రభువుకు కూడా చేరింది.
శత్రువు విష్ణువర్ధనుడు ఒక్కడే కాదనీ, అతనికి తోడుగా ఇతర రాజుల సైన్యాలు కూడా వస్తున్నాయని!
వీళ్లంతా ఒకనాడు త్రిభువనమల్లుడి ధాటికి కకావికలై, తలో దిక్కుకూ పారిపోయి, తలదాచుకున్నవారే! ఇప్పుడు త్రిభువనమల్ల చక్రవర్తి ఏదో శక్తిహీనుడైనాడనీ, విష్ణువర్ధనుడు వ్యాపింపజేస్తున్న నీలివార్తలు విని, నమ్మి అతనికి తోడుగా వచ్చినవారే!
పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు.
చేతుల్లోంచి ఒక సరిహద్దు దుర్గం జారిపోయిన తర్వాత, భువనగిరి సామ్రాజ్యపు సైనికశ్రేణుల స్థయిర్యం కొంత దిగజారిందనే చెప్పాలి. అది కూడా గమనించాడు త్రిభువనుడు.
ఏ రాజ్యమైనా, ఆ రాజ్యంలోని ప్రజల పరిస్థితి పరిపాలించే ప్రభువును బట్టే ఉంటుంది. ఆయన ధైర్యంగా ధీమాగా ఉంటే, ప్రజలు గుండెలపైన చేయివేసుకొని నిద్రిస్తారు. ప్రభువుకే ధైర్యం సన్నగిల్లితే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతారు.
ఏది ఏమైనా, భువనగిరి సామ్రాజ్యం త్రిభువనమల్ల ప్రభువును విశ్వసిస్తూ, ప్రస్తుతానికి భద్రంగానే ఉన్నది. కానీ, ఏ క్షణమైనా అది పగిలిపోవచ్చని విద్యాపతి వంటి ఆంతరంగికులకు అనిపిస్తున్నదీ అంటే అటువంటి వాతావరణాన్ని వారు ఊహిస్తున్నారు.
ఒక్కోసారి ఊహలు నిజాలు కూడా కావచ్చు.
నిజానికి ఊహ అనేది గత అనుభవాలను అనుసరించే ఏర్పడుతుంది.
మహారాణి చంద్రలేఖాదేవి కానీ, పండితుడూ, మంత్రీ అయిన విద్యాపతి కూడా ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకున్నది.
అది త్రిభువనమల్లుడే స్వయంగా ప్రకటించాడు.
“మంత్రులారా, సేనాధిపతులారా, భువనగిరి సామ్రాజ్య శ్రేయస్సు కోరే మిత్రులారా! ఇంతకాలం మేము యుద్ధంపట్ల విముఖంగా ఉన్నాం. అభివృద్ధిని అడ్డుకుంటుందని యుద్ధాన్ని వద్దనుకున్నాం. కానీ, మనం కావాలనుకున్నా, వద్దనుకున్నా ముంచుకొస్తున్న ముప్పు తప్పుకోదు. అది మనల్ని ముంచేయడానికి ముందుముందుకు వస్తున్నది. దాన్ని మేము అడ్డుకుంటాం. ఒక దుర్గం చేజారిపోయిందనీ, అనంతపాలసేనాని ఓటమి పాలయ్యాడనీ, శత్రు సైన్యాలు విజృంభిస్తూ ముందుకు దూసుకొస్తున్నాయనే వార్తలు మేము వింటున్నాం”
అని అత్యవసరంగా సమావేశమైన సభను ఉద్దేశించి అన్నాడు త్రిభువనమల్లుడు.
ఆయన మాటలు విని ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అందరూ లోతైన ఆలోచనల్లో ఉండిపోయారు.
“అయినా భయం లేదు. మన కత్తికి తిరుగులేదు. తలలు తెగిపడటం మొదలుపెడితే, అది ఆఖరి శత్రు సైనికుడి దగ్గరే ఆగుతుంది. అందులో సందేహం లేదు. నిన్నమొన్నటి దాకా మనపేరు చెప్తేనే గడగడలాడిపోయే వాళ్లు. ఈనాడు మన గడపదాకా వస్తామంటున్నారు. అది అసంభవం! మేమే స్వయంగా యుద్ధానికి బయల్దేరి వెళ్తున్నాం.”
ఆ మాటలకు అడ్డువస్తూ అన్నాడు విద్యాపతి…
“ప్రభూ! మన్నించండి. శత్రువు బలం అధికంగా ఉంది. మన శక్తికి మించి ఉంది. గెలవాలంటే మన శక్తి పెంచుకోవాలి. లేదా, యుక్తిగా ప్రస్తుతం సంధి అన్నా చేసుకోవాలి…”
విద్యాపతి మాటలను పట్టించుకోలేదు త్రిభువనుడు.
ప్రభువులవారు ఒక నిర్ణయం తీసుకున్నాక, ఇక దానికి తిరుగు ఉండదని అందరికీ తెలుసు.
తక్షణమే యుద్ధ సన్నాహాలు ప్రారంభమైనాయి.
చంద్రలేఖకు వేగంగా జరుగుతున్న ఈ పరిణామాలు అంతుపట్టకుండా ఉన్నాయి.
అప్పటికీ అడిగాడు త్రిభువనుడు తన భార్యను!
“దేవీ! నువ్వే కదా మానుండి సాహసాన్ని, పౌరుషాన్ని కోరుకున్నది. యుద్ధానికి వెనకడుగు వేయొద్దనీ, సర్వసైన్యాలను ముందుండి నడిపించాలనీ, మేము సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటిస్తే ఇదేమిటీ మౌనం? ఉత్సాహకరమైన వాతావరణమేదీ? ప్రోత్సాహకరమైన పలుకులేవీ? మనసు మూగపోయిందా? హృదయం నిర్ఘాంతపోయిందా? లేక అనంతపాలుడు, విద్యాపతి వంటివారు నూరిపోసిన పిరికితనం నరనరాన పాకిపోయిందా?”
ఆ మాటలను విని అన్నది రాణి…
“ప్రభూ! నేను మీనుండి వీరత్వాన్ని ఆశించాను. భీరత్వాన్ని కాదు. నిజమే! సాహసం అవసరమే, అభినందనీయమే! కానీ దుస్సాహసం ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందేమో అనే భయం! మీ భార్యగా అది ఎక్కువగా ఉన్నది..”
“దేవీ చంద్రలేఖా! భయం అంటే పిరికితనం. మేము దేనికి భయపడాలి? యుద్ధానికా? మీరందరూ ఊహిస్తున్న ‘అపజయం’ అనే ఆలోచనకా? దేవీ, మా సంగతి మీకు తెలుసు. మేము ప్రాణాలతో ఉండటం అంటే పౌరుషంతో ఉండటమే! మా అనుభవంతో మేము తెలుసుకున్నది, నేర్చుకున్నదీ ఒకటే, యుద్ధం చెయ్యి, గెలుస్తావు. భయపడి వద్దనుకుంటే, యుద్ధం మొదలు కాకముందే ఓడిపోతావు. రేపే ముహూర్తం.. విజయమో…”
‘వీరస్వర్గమో’ అనే మాట నోట రాకముందే, మహారాణి చంద్రలేఖ చప్పున ఆయన నోరు మూసింది.
“అమంగళం, మీ నోట రానీయకండి ప్రభూ!” అన్నది కంటనీరు చిప్పిల్లగా.
సూటిగా చూశాడు భార్యకేసి త్రిభువనుడు.
“దేవీ! ఇప్పుడే ముహూర్తం. మంగళహారతులిచ్చి సాగనంపు. విజయులమై తిరిగివస్తాం..”
వెంటనే ఏర్పాట్లు జరిగిపోయినై.
హారతి ఇచ్చి భర్తకు వీరతిలకం దిద్దింది మహారాణి.
మరుక్షణం…
గుర్రాలు గాల్లోకి లేచి, దుమ్ము రేపుకొంటూ యుద్ధరంగానికి తరలిపోయినై.
అయితే, ఆ సమయంలోనే మరొక సంఘటన జరిగింది.
యువరాజు సోమేశ్వరుడు తండ్రిగారు యుద్ధరంగానికి వెళ్తున్న సంగతి తెలుసుకుని పూజామందిరంలో నుండి పరుగుపరుగున తల్లి దగ్గరికి వచ్చాడు.
“అమ్మా! నాయనగారు ఎక్కడమ్మా?” అన్నాడు ఆతృతగా.
“ప్రభువుల వారు ఇప్పుడే యుద్ధరంగానికి తరలివెళ్లారు నాయనా. కొద్ది సమయం ముందుగా వచ్చుంటే నీకు వారి ఆశీస్సులు లభించేవి. కాస్త ఆలస్యమయింది కుమారా…”
అనునయంగా చెప్పింది చంద్రలేఖ.
“ఎంత పని జరిగిందమ్మా! నేను కాస్త ముందుగా వచ్చుంటే, నాయనగారిని కలిసేవాడిని. వారికి క్షేమం కలిగేది…”
సోమేశ్వరుని మాటలువిని ఉలిక్కిపడిందామె.
ఏమన్నాడు సోమేశ్వరుడు…
“వారికి క్షేమం… కలిగేది…”
అంటే ఏమిటి ఈ మాటలకర్థం?
“సోమేశ్వరా! ఏమంటున్నావు నువ్వు?” అయోమయంగా అడిగింది.
“నువ్వు ముందే వచ్చుంటే, వారికి క్షేమం కలగడమేమిటి? ఏం జరుగుతున్నది ఇప్పుడు?”
కుమారుని భుజాలు కుదుపుతూ అన్నది.
సోమేశ్వరుడు తల్లికేసి చూశాడు. తన చేతిలో ఉన్న చిన్న వస్తువును చూసుకున్నాడు.
“అవునమ్మా, యుద్ధవార్తలు నేను కూడా విన్నాను. అవతల శత్రువులు శక్తిమంతులనీ, నాయనగారు ధైర్యంగా వెళ్లారని నాకు తెలుసు. అయితే, రామభట్టు గారు నాకొక అపురూపమైన వస్తువును ఇచ్చారు. నాయనగారు యుద్ధానికి వెళ్లే సమయంలో వారికి ఇమ్మన్నారు.”
“రామభట్టు గారా?”
“అవునమ్మా! రామభట్టు గారే. యాదర్షి తపస్సు చేసిన కొండమీద గుహలో నరసింహదేవుడు ఉన్నాడని మొట్టమొదటగా మనకు చెప్పారే, ఆ పండితుడే. ఆయన చెప్పాక కదమ్మా, నాయనగారు కొండమీదికి వెళ్లి, నరసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొంది, తిరిగివచ్చారు. అక్కడే ఆలయం కూడ నిర్మిస్తానని అనుకున్నారు కదమ్మా..”
కొడుకు మాటలు వింటూ అన్నది.
“అవును నాయనా! రామభట్టు గారు సింహదేవుని ఉపాసకులు. వారు ఏమిచ్చారు నాయనా… మీ నాయనగారికి ఇమ్మని?” ఆతృతగా అడిగింది.
తన గుప్పిట విప్పి చూపించాడు.
దృశ్యాదృశ్యంగా ఉన్న అపూర్వ కాంతిపుంజం ఏదో ఆ వస్తువును ఆవరించుకొని ఉన్నట్లు అనిపించింది.
అది… ప్రసన్న నరసింహస్వామి వారి శిరసు భాగం చెక్కి ఉన్న వెండి నాణెం. ఒక పసుపు దారానికి కట్టి ఉన్నది.
“అమ్మా! ఇది ధరిస్తే, ఏ ఆపదా రాదని రామభట్టు గారు చెప్పారు. స్వామివారిని ధ్యానిస్తూ దీన్ని తయారుచేశామని, ఇదొక రక్షణ కవచంగా పనిచేస్తుందనీ వారన్నారు. అందుకే ఇది నా దగ్గరికి రాగానే పూజా మందిరంలో ఉంచి, ఇక్కడికి తీసుకువచ్చాను”
“భగవంతుడా! కొంచెం ముందుగా వచ్చుంటే బాగుండేది నాయనా…”
ఆ మాటలు పైకి అన్నవే కానీ, ఈ నారసింహ రక్షాసూత్రం ప్రభువుల వారిని చేరేది ఎలా?
ఆమెకు ఏమీ తోచడం లేదు.
ఆ సమయానికి త్రిభువనుడు చాలాదూరం వెళ్లిపోయాడు.
ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదం అంచుల దాకా ప్రయాణించాడు. మృత్యుదేవత అడుగుల్లో అడుగులేస్తున్నాడు..
“అవునమ్మా! రామభట్టు గారే. యాదర్షి తపస్సు చేసిన కొండమీద గుహలో నరసింహదేవుడు ఉన్నాడని మొట్టమొదటగా మనకు చెప్పారే, ఆ పండితుడే.
ఆయన చెప్పాక కదమ్మా, నాయనగారు కొండమీదికి వెళ్లి, నరసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొంది, తిరిగివచ్చారు. అక్కడే ఆలయం
కూడ నిర్మిస్తానని అనుకున్నారు కదమ్మా..”కొడుకు మాటలు వింటూ అన్నది.“అవును నాయనా! రామభట్టు గారు సింహదేవుని ఉపాసకులు. వారు ఏమిచ్చారు నాయనా… మీ నాయనగారికి ఇమ్మని?” ఆతృతగా అడిగింది.తన గుప్పిట విప్పి చూపించాడు.దృశ్యాదృశ్యంగా ఉన్న అపూర్వ కాంతిపుంజం ఏదో ఆ వస్తువును ఆవరించుకొని ఉన్నట్లు అనిపించింది.అది… ప్రసన్న నరసింహస్వామి వారి శిరసు భాగం చెక్కి ఉన్న వెండి నాణెం. ఒక పసుపు దారానికి కట్టి ఉన్నది.
శ్రీ నృసింహ భుజంగ స్తోత్రమ్
అజోమేశ దేవం రజోత్కర్ష వద్భూ
ద్రజో త్కర్షవద్భూ ద్రజో ద్ధూతభేదం
ద్విజాధీశ భేదం రజోపాల హేతిం
భజేవేద శైల స్ఫురన్నారసింహమ్
హిరణ్యాక్ష రక్షో వరేణ్యాగ్ర జన్మ
స్థిర క్రూరవక్షో హరప్రౌఢదక్షః
భృతశ్రీనఖాగ్రం పరశ్రీ సుఖోగ్రం
భజేవేద శైల స్ఫురన్నారసింహమ్
నిజారంభశుంభ ద్భుజాస్తంభ డంభ
దృఢాంగ స్రవద్రక్త సంయుక్తభూతం
నిజాఘా వనోద్వేల లీలానుభూతం
భజేవేద శైల స్ఫురన్నారసింహమ్
వటుర్జన్యజాస్యం స్ఫుటాలోల ధాటీ
సటాఝాట మృత్యుర్బహిర్గాన శౌర్యం
ఘటోద్ధూత పద్భూద్ఘట స్తూయమానం
భజేవేద శైల స్ఫురన్నారసింహమ్
పినాక్యుత్త మాంగం స్వనద్భంగ రంగం
ధ్రువాకాశరంగం జనశ్రీ పదాంగం
పినాకిన్య రాజప్రశస్త స్తరస్తం
భజేవేద శైల స్ఫురన్నారసింహమ్
– అల్లాణి శ్రీధర్