ఏం కావాలి? ఆలుగడ్డలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: ఏడు, మక్కజొన్న పిండి: ఒక టీ స్పూన్, టమాట సాస్: ఒక టీ స్పూన్, సోయా సాస్: ఒక టీ స్పూన్, మిరియాల పొడి: అర టీ స్పూన్, ఉల్లిగడ్డ తరుగు: అర కప్పు, క్యాప్సికమ్ తరుగు: అర కప్పు, చిల్లీ సాస్: ఒక టీ స్పూన్, తేనె: ఒక టీ స్పూన్, వెనిగర్: అర టీ స్పూన్, ఉల్లి ఆకుల తరుగు: పావు కప్పు, నూనె: సరిపడా.
ఎలా వండాలి? ముందుగా ఆలుగడ్డ పొట్టు తీసి పొడుగ్గా తరగాలి. వాటిని పావుగంటసేపు నీళ్లలో నానబెట్టాలి. ఒక గిన్నెలో మక్కజొన్న పిండి, మిరియాల పొడి, కొన్ని నీళ్లు పోసి పేస్ట్లా చేయాలి. మరోపైపు కడాయిలో నూనె వేడిచేసి, ఆలుగడ్డ ముక్కలను డీప్ఫ్రై చేసి పక్కన పెట్టాలి. తర్వాత అదే కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిగడ్డ తరుగు, క్యాప్సికమ్ తరుగు వేయాలి. అవన్నీ వేగాక సోయా సాస్, వెనిగర్, టమాట సాస్, తేనె, ఉప్పు వేయాలి. ఐదు నిమిషాలు అయ్యాక ముందుగా తయారుచేసుకున్న మక్కజొన్న పిండి పేస్ట్ వేయాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి కలపాలి. చివరగా ఉల్లి ఆకుల తరుగు వాటిపై చల్లాలి.
ఫ్యాక్ట్
మనం మసాలా దినుసుల్లో వాడే దాల్చినచెక్క ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి అది చెట్టు బెరడు. దాల్చిన చెట్టు 60 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.
వెరైటీ కాజూ కట్లీ కెచప్
వినడానికి కొత్తగా ఉంది కదూ! తింటే కూడా కొత్తగానే ఉంటుందని అంటున్నారు హరియాణాకు చెందిన కాలేజీ విద్యార్థులు. వాళ్ల ప్రయోగ ఫలితమే ఈ కాజూ కట్లీ కెచప్. నోరూరించే తియ్యటి, కమ్మని కాజూ కట్లీలను వాళ్లు పులుపు, తీపి కలగలిసిన టమాట కెచప్లో నంజుకుని తింటున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ప్రయోగాన్ని కొందరు మెచ్చుకుంటున్నా, కాజూ కట్లీ అభిమానులు మాత్రం నొచ్చుకుంటున్నారు. నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రయోగాల పేరుతో రాజా లాంటి కాజూను దుర్వినియోగం చేస్తున్నారని బాధపడిపోతున్నారు.
బ్లాగ్ ఫుడీ జంక్షన్
ఈ మధ్య చాలామంది ఫుడ్ బ్లాగర్స్గా మారుతున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో ప్రత్యేకంగా ఒక బ్లాగ్ ఏర్పాటు చేసి మరీ ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నారు. అలానే, హైదరాబాద్కు చెందిన సారాఖాన్ 2016లో సామాజిక మాధ్యమాల్లో ఒక ఖాతా తెరిచారు. అలా ‘ఫుడీ జంక్షన్’ పేరుతో ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నారు. అందులో, వెళ్లొచ్చిన రెస్టరెంట్ల నుంచి వండిన వింతైన పదార్థాల వరకు.. వివిధ రుచులపై విశ్లేషణ ఇస్తారు. ప్రముఖ షెఫ్ల ఇంటర్వ్యూలనూ పోస్ట్ చేస్తారు.
ఫుడ్ స్టార్టప్ పాపీకార్న్
హైదరాబాద్కు చెందిన ప్రశాంత్ గౌరీరాజు 2016లో ‘పాపీకార్న్’ను ప్రారంభించారు. ఇక్కడ తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ కలిగిన పాప్కార్న్ లభిస్తుంది. ఓ గ్యారేజీలో ప్రారంభించిన ఈ స్టార్టప్ ప్రస్తుతం ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నది.
నేనేంటో తెలుసా!మొరంగడ్డ
వీటినే గనుసు గడ్డలనీ అంటారు. విటమిన్-ఇ, సి, బి6, పొటాషియం, బీటా కెరోటిన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువ. అపారమైన విటమిన్-సి పుణ్యమాని చలికాలంలో సీజనల్ జబ్బులైన దగ్గు, సర్ది వంటి సమస్యలు రావు. అంతేకాదు, తినగానే తక్షణ శక్తి లభిస్తుంది.ఉడికించిన మొరంగడ్డలను తినడంవల్ల చర్మ, జుట్టు సమస్యలు దూరం అవుతాయి. ఎముకలు దృఢంగా మారతాయి. తప్పకుండా ఆరగించాల్సిన సీజనల్ రుచి ఇది.
చిట్కా
సాధారణంగా అందరూ అల్లం-వెల్లుల్లి ఒకటి, రెండు కిలోలు ఒకేసారి రుబ్బుకుని ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటారు. అది రంగు మారకుండా ఉండాలంటే, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. అలాచేస్తే, మూడు నెలలైనా అల్లం-వెల్లుల్లి పేస్ట్ తాజాగా ఉంటుంది.
ట్రెండ్ బస్తీమే సవాల్!
రెస్టరెంట్లలో కొత్తకొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ‘జెయింట్ బాహుబలి థాలీ’ కొవిడ్కు ముందు దేశవ్యాప్తంగా హల్చల్ చేసింది. అదే ట్రెండ్ మళ్లీ తిరిగొచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా రెస్టరెంట్లలో బాహుబాలి థాలీ పోటీలు జరుగుతున్నాయి. ఒక పెద్ద పళ్లెంలో పదుల సంఖ్యలో ఆహార పదార్థాలు పెట్టి, పూర్తిగా తిన్నవారికి నగదు బహుమతి కూడా ఇస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఏర్పాటుచేసిన థాలీ పోటీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నలభై నిమిషాల్లో థాలీని పూర్తిచేసిన వాళ్లకు రూ.8 లక్షలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది అక్కడి ఓ రెస్టరెంట్. ఘటోత్కచులకు బంపరాఫర్!