నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2020’లో ప్రచురణకు ఎంపికైన కథ.
‘ఇక మళ్లీ పల్లెటూరుకు వెళ్లలేక, వెళ్లడం ఇష్టంకూడా లేక.. ఆ పట్నంలోనే ఉండిపోయాం. నా బడికి దగ్గర్లో చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాం. అమ్మ, అమ్మమ్మ చుట్టుపక్కల ఇండ్లలో పాచిపనికి కుదిరారు. డబ్బులైతే వచ్చాయికానీ, వాళ్లిద్దరి ఆరోగ్యం గుల్లవుతూ వచ్చింది. నేను పదోతరగతి ఫస్ట్క్లాస్లో
పాస్ అయ్యాను. నేను ఎక్కడా మా కులం గురించి చెప్పడానికి ఇష్టపడలేదు’
అరచేతులను చూసుకుంటోంది గీతపరీక్షగా. మొదటిసారి.. గీత ఇంతలా తన చేతుల్లోని గీతలను చూడటం. ‘నా చేతుల్లోని గీతలూ గజిబిజిగా ఉన్నాయి. నా జీవితం లాగానే!’ అని సన్నగా నవ్వుకుంది. ‘నా ఆత్మస్థయిర్యంతో ఈ గీతలన్నీ ఈపాటికి సరైపోయి, ఈ స్థాయికి చేరి ఉంటాయి. ఇప్పుడొక ప్రభుత్వ ఉద్యోగిగా నేను బిజీ అయిపోతాను. గజిబిజీలో బిజీనే మిగిలేలా.. నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాను. చేతులే లేకుండా పుట్టిన మిస్టర్ నిక్.. ఆ దేవుడి రాతను కూడా మార్చి ఉంటాడు. తన కృషితో.. పట్టుదలతో!’.
ఇలాంటి ఆలోచనలతో ఒక్క ఉదుటున లేచింది. ఒక్కసారిగా తూలింది. ఒంటి కాలిపై నిలదొక్కుకుంది. రెక్కతెగిన సీతాకోకచిలుకలా ఎగురుకుంటూ వెళ్లింది.
‘జాలి పడకండి – గర్వపడండి’ అని తన ఎదురుగా రాసిపెట్టుకున్న కాగితాన్ని తడిమి చూసుకొని, నిజంగానే ఒకింత గర్వపడింది. అలాంటి సూక్తులు ఆ గదిలో ఎన్నో ఉన్నాయి. గోడకు తగిలించిన మయూరి ఫేమ్ సుధా చంద్రన్, నికోలస్ (నిక్) ఫొటోలకు దండం పెట్టి, స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేసింది.
తనకిష్టమైన గులాబీ రంగు డ్రెస్ వేసుకొంది. అదేరంగు బొట్టుబిళ్ల పెట్టుకొంది. అద్దంలో తనను తాను చూసుకొని మురిసిపోయింది.
‘మంచి రంగు. కళ కలిగిన ముఖ కవళికలు. దేవుడు దీని కాలు తీసుకెళ్లి అన్యాయం చేశాడు కానీ, లేకపోతే దీనికోసం రెక్కలగుర్రం మీద రాకుమారుడు వచ్చేవాడు’.. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తన గురించి అమ్మతో అమ్మమ్మ ఇలా అనడం.. అది తనకు వినపడటం గీతకింకా గుర్తు. అమ్మమ్మ తనలో ఆత్మస్థయిర్యం నింపడానికి ప్రయత్నించేది.
గీత అందాన్ని పొగుడుతూ.. ‘నీ కాలుందో లేదో చూడకుండా నీ అందం చూసి నిన్ను చేసుకునే వాడు వస్తాడే!’ అంటూ అవకాశం దొరికినప్పుడల్లా గీతలో ధైర్యం కలిగించేది.
అందంగా తయారై కూర్చుని, మోకాలికి కిందిదాకా తీసేసిన కాలికి.. కృత్రిమ కాలు పెట్టుకుంటుంటే.. కండ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. గీత ఆలోచనలు.. గతంలోకి జారుకున్నాయి.
మాది గుంటూరు జిల్లాలోని ఒక పల్లె. తాగుబోతు నాన్న. చెక్కరిక్షా తొక్కేవాడు. ఇంట్లో ఇచ్చేవాటికన్నా, చిన్నా చితకా అబద్ధాలు చెప్పి తీసికెళ్లే సొమ్మే ఎక్కువ. అమ్మ, అమ్మమ్మ చెమటోడ్చి కూలి పనులు చేసి సంపాదించిన దాంట్లో పొదుపు చేసి, నాన్నను సమర్థించుకుంటూ సంసారాన్ని గుట్టుగా జరిపేవారు.
అన్నకు నాకు ఆరేండ్లు తేడా. అన్న పుట్టిన తర్వాత మళ్లీ పిల్లల కోసం మందులు వాడితే.. నేను పుట్టానట. అమ్మ, అమ్మమ్మ మంచి రంగు. నాన్న చామన ఛాయ.
‘తాగితాగీ రంగు విరిగిపోయింది’ అని అమ్మ వాపోయేది. నాకు మూడు, అన్నకు తొమ్మిదేండ్లు ఉన్నప్పుడు కల్తీ సారా తాగి నాన్న చనిపోయాడు. ఆ తర్వాత ఆరేండ్లకు మా కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. అన్న సైకిల్ బాగా తొక్కుతాడు. నేను తన వెనక కూర్చుంటే, ఇద్దరం బడికి వెళ్లే వాళ్లం. అప్పుడు అన్న పదో తరగతి, నేను ఆరో తరగతిలో ఉన్నాం. ఎప్పట్లాగే సైకిల్పై బడికి వెళ్తుండగా, తాగి ఆటో నడిపిన వాడి తప్పువల్ల.. అన్న అక్కడికక్కడే చనిపోయాడు. నా కుడికాలు నుజ్జునుజ్జు అయ్యింది. నన్ను జనరల్ ఆసుపత్రిలో చేరిస్తే, మోకాలు కిందివరకూ తీసేశారు.. ఉంచే పరిస్థితి లేక. అన్న చనిపోవడంతో మేము ముగ్గురం సగం చచ్చిపోయాం. అన్న హీరోలాగా ఉండేవాడు. బాగా చదివేవాడు. అంతా మట్టిలో కలిసిపోయింది. అన్నకు.. గాంధీ, అబ్దుల్ కలాం, అంబేడ్కర్ ఆశయాలు బాగా నచ్చేవి. కులం గురించి మాట్లాడితే చిరాకు పడేవాడు.
మా మేనమామ గుంటూరులో ఒక అపార్ట్మెంట్లో కాపలా ఉద్యోగం చూపించాడు. దీంతో ముగ్గురం గుంటూరు చేరాం. అక్కడంతా శుభ్రంగా ఉంచి, కాపలా ఉంటూ.. వచ్చేపోయే వాళ్లకు సమాధానం చెప్పడమే మా పని. కొన్నిరోజులు బాగానే గడిచింది. ఆ అపార్ట్మెంట్లో కొంతమంది ‘పొద్దున్నే కుంటిపిల్లను చూడాల్సి వస్తోంది. కావాల్సిన పనులు అవడం లేదు. వీళ్లను తీసేసి కొత్తవాళ్లను పెట్టండి’ అని తీర్మానించి, మమ్మల్ని తీసేశారు. ఆ సమావేశంలో మా కులం ప్రస్తావన కూడా కొందరు తెచ్చారట.
‘మనమీద కేసులు కూడా పెడతారు. వీళ్లను ఎంత తొందరగా వదిలించుకుంటే, అంత మంచిది’ అని కూడా వాదించారట.
ఇక మళ్లీ పల్లెటూరుకు వెళ్లలేక, వెళ్లడం ఇష్టంకూడా లేక.. ఆ పట్నంలోనే ఉండిపోయాం. నా బడికి దగ్గర్లో చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాం. అమ్మ, అమ్మమ్మ చుట్టుపక్కల ఇండ్లలో పాచిపనికి కుదిరారు. డబ్బులైతే వచ్చాయికానీ, వాళ్లిద్దరి ఆరోగ్యం గుల్లవుతూ వచ్చింది. నేను పదోతరగతి ఫస్ట్క్లాస్లో పాస్ అయ్యాను. నేను ఎక్కడా మా కులం గురించి చెప్పడానికి ఇష్టపడలేదు.
‘నీది మంచి రిజర్వేషన్ వచ్చే కులం. చదువులో, ఉద్యోగంలో అన్ని చోట్లా అది ఉపయోగపడుతుంది’ అని మా హెడ్మాస్టర్ చెప్పినా, నేను వినలేదు. కుల ప్రస్తావన లేకుండానే దరఖాస్తు పూర్తి చేశాను. కుల ధ్రువీకరణ పత్రం కూడా తీసుకోలేదు. కొన్ని సందర్భాల్లో.. ‘అన్న ఉంటే ఎంత బాగుండేది’ అనిపిస్తుంది. అన్న లేకపోవడంతో ఒక్కోసారి రెండోకాలు కూడా పోయిందన్నంత బాధ వేస్తుంది.
కాలు కోల్పోవడం వల్ల నాకు మనోనిబ్బరం, సహనం, జ్ఞానం.. సకలాంగులకన్నా ఎక్కువగా అబ్బినట్లు అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ చేశాను. స్నేహితులతోపాటు పుస్తకాలతో కూడా సమయాన్ని గడుపుతున్నాను.
‘గాంధీ ఇష్టం’ అంటే.. ఒక కులం అంటగడుతున్నారు. ‘అంబేడ్కర్ ఆశయాలు ఇష్టం’ అంటే.. ఇంకో కులం అంటగడుతున్నారు. నేను నాలాంటి వికలాంగులైన వాళ్ల స్ఫూర్తిని కూడా నా జీవితంలోకి తీసుకోవాలని.. మయూరి ఫేమ్ సుధా
చంద్రన్ గురించి నెట్లో చదువుకున్నాను. అలాగే ‘నిక్’.. కాళ్లూ, చేతులు లేకుండా పుట్టిన
ఆస్ట్రేలియన్. ఆయన మోటివేషనల్ స్పీచులు కూడా వింటున్నాను. నిజానికి నేను ఎప్పుడూ మోటివేట్ అయి ఉండటానికే, సుధాచంద్రన్, నిక్ ఫొటోలు నా బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నాను.
అలా నా ఇంటర్ పూర్తయి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు నాకు ఒక సంబంధం వచ్చింది. అమ్మమ్మ బాగా పట్టుపట్టింది. తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అంతా సవ్యంగా ఉండే సంబంధం. పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చని నాకు నచ్చచెప్పి, పెళ్లిచూపులు పెట్టించింది. నా మీద అమితమైన ప్రేమ, తాను ఉండగానే నన్నొక ఇంటిదాన్ని చెయ్యాలనే పట్టుదల, అమ్మ ఒక్కతే చెయ్యగలదో లేదో అనే భయంతో.. మధ్యవర్తిని ఎక్కువగా నమ్మి అన్ని ఏర్పాట్లూ చేసింది. అయితే, వచ్చిన పెళ్లి కొడుకుని చూసి కంగుతిన్నది. అయినా తప్పదు కదా! కాఫీలు, టిఫిన్లు పెట్టించింది. ఆ తర్వాత ఆయన మాటలు విని.. అమ్మమ్మకు పిచ్చి కోపం వచ్చింది. అయినా తమాయించుకొంటూ ‘ఈ సంబంధం మాకొద్దు’ అని మధ్యవర్తికి చెప్పి, వాళ్లిద్దరినీ మర్యాదగా బయటికి పంపించింది.
ఆయనగారికి ఇది రెండో పెళ్లట. ‘వీళ్లింట్లో ఒక అందమైన పిల్ల ఉంది. ఆ అమ్మాయికి ఒక కాలు కూడా లేదు’ అని పనివాళ్ల ద్వారా తెలుసుకొని, తన వయసు, ఇంతకుముందే పెళ్లయిన విషయం దాచిపెట్టి చూపులకు వచ్చాడు. ఆ పెళ్లికొడుకును తిట్టి పోసింది అమ్మమ్మ.
‘పెళ్లానికి ఆరోగ్యం బాగాలేక ఇద్దరు పిల్లల్నీ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడుట. రోగిష్టి పెళ్లానికి బదులు చుక్కలాంటి నా మనవరాలిని మనువాడుతాడా? వాడ్ని దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడు. పైగా వాడికి కట్నం వద్దుట. కానీ, ఆ కాలు ఏడాదికి ఒకసారి మార్చినా, తనతో ఉన్నంత కాలంలో కనీసం మూడు లక్షలు అవుతాయనీ, అవి ఇవ్వండి చాలంటూ.. అక్కడ పెట్టిన కాలును చూపించి అన్నాడుట. వాడే మానసిక వికలాంగుడు. మన పిల్ల దివ్యాంగురాలు. మంచి మనసున్న దేవత. వాడి మొహానికి కాలు ఖర్చులు ఎదురివ్వాలిట. మన పిల్లను జీవితాంతం ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటాడట.. ఆ డబ్బిస్తే. పిల్లలు పుట్టినా వాడే సాక్కుంటాడట’ అంటూ దుమ్మెత్తిపోసింది.
‘బీదోళ్లులే.. వెంటపడతారు’ అనుకొని వచ్చాడు. వెధవాలోచనలూ వాడూను. అయితే, ఈ పెళ్లిచూపుల తతంగంతో నాక్కూడా పట్టుదల పెరిగింది. ఇక ఎప్పటికీ పెళ్లిచూపుల్లో కూర్చో కూడదని. కాలు ఖర్చులు అడగటం.. చాలా అసహ్యంగా అనిపించింది.
ఒక దివ్యాంగురాలి విషయంలో అతని నైజం బయట పడింది. ఇలాంటి వాళ్లు లోకంలో.. మగవాళ్లలో మరీ ఎక్కువగా ఉంటారనిపించింది. అందుకే నన్ను ఇష్టపడే వాడు దొరికితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.. నా మనసులో. అప్పటినుంచి నా పెళ్లి విషయం దాటేస్తూ వస్తున్నాను. అయితే అమ్మమ్మ బాగా దిగులుపడి రెండు నెలల్లోనే మంచం పట్టి మాకు దూరమైంది. పాపం అమ్మమ్మ.. నా గురించే ఆలోచించే నా ప్రేమ ప్రాణి నాకు దూరమైపోయింది. ఇక నేనూ, అమ్మే మిగిలాం. అమ్మమ్మ మరణం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. జీవిత పోరాటాన్ని, ప్రేమ తత్వాన్ని వంటబట్టేలా చేసింది. డిగ్రీ కూడా పూర్తి చేశాను. అమ్మతోపాటే నా ఆలోచనలు కూడా ఎటూ మరలకుండా చూసుకుంటున్నాను. అప్పుడప్పుడూ వయసు చేసే చిలిపి ఆలోచనలతో మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కాళ్లూ చేతులు లేని ‘నిక్’ను ఒకమ్మాయి ప్రేమించి పెళ్లిచేసుకోలేదా? తోడుంటే బాగుండు. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడపటానికి ఒక మగ స్నేహితుడు ఉంటే? ఇలాంటి ఆడ మనసు ఆలోచనలు సహజమేనని సర్ది చెప్పుకుంటూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాను.
ఒకరోజు కృత్రిమ కాలు అమర్చుకునే సమయంలో కాలు నొప్పి పుడుతోందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది గీత. డాక్టర్ మాత్రలు రాసి ఇచ్చారు. ‘వాక్ ఫౌండేషన్’లో ఉచితంగానే అధునాతన కృత్రిమ కాళ్లు అందిస్తున్నారంటూ వాళ్ల అడ్రస్ ఇచ్చాడు ఆ డాక్టర్. ‘చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాడిలా ఉన్నాడు’ అనిపించింది ఆయన్ని చూస్తే. అక్కడికి వెళ్లి, వాళ్లిచ్చిన కాలు పెట్టుకొని మళ్లీ ప్రశాంతంగా చదువుకోవడం మొదలుపెట్టింది. ఎవరికీ కులం చెప్పట్లేదు. పరీక్షలకు కూడా రిజర్వేషన్ను వాడుకోవడం లేదు. పట్టుదలగా ఓపెన్ కేటగిరీలోనే గ్రూప్-1 ఉద్యోగం కొట్టాలని చూస్తోంది. ఆఖరికి మహిళా కోటా, వికలాంగ కోటాను కూడా ఆశించకుండా.. తానేమిటో నిరూపించుకోవాలని అనుకుంటోంది. దాన్ని ఓ సవాలుగా తీసుకొని శిక్షణ పొందుతోంది.
ఆలోచనా తరంగాలు మళ్లీ జీవితం ఒడ్డున తెచ్చి పడేశాయి. నాకు తహసీల్దారు ఉద్యోగం వచ్చింది. కలెక్టర్ ఆఫీసులో రిపోర్ట్ చేసి, ఒక మండలానికి అధిపతిగా, ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టా.. గర్వంగా! మొదటిరోజు తొలి సంతకం ఒక దివ్యాంగురాలి కుల ధ్రువీకరణ పత్రం మీద పెట్టాల్సి వచ్చి.. నవ్వుకున్నా.
‘డబ్బులు ఇవ్వలేను’ అని టెన్షన్ పడుతూ, నా గది బయట నిల్చుని ఉన్న ఆ దివ్యాంగురాల్ని లోనికి పిలిపించుకొన్నా. ఆమెకు ధైర్యం చెబుతూ, బెస్ట్ విషెస్ చెప్పి పంపించా. అవినీతికి ఆమడ దూరం జరిగినట్లు అనిపించింది. ఆ రోజు ఆఫీస్ అయిన తరువాత సాయంత్రం ఇంటికెళ్తుంటే.. ‘గీతా’ అని ఎవరిదో మగ గొంతు విని వెనుదిరిగి చూశా. అతణ్ని మాత్రం పోల్చుకోలేకపోయా.
“నేనండీ.. మిమ్మల్ని ప్రభుత్వాసుపత్రిలో చూసి మందులు రాసిచ్చిన ఆర్థో డాక్టర్ని. ఇందాక మీరు సంతకం చేసింది మా కజిన్కే. తనకు తెలీదంటే నేనే తీసుకొచ్చాను. లోపలికి రాలేదుకానీ, సీట్లో మిమ్మల్ని చూసి చాలా
ఆనందించాను. తనని దింపేసి మిమ్మల్ని కలుద్దామని వచ్చేసరికి, మీరు బయలుదేరి పోతున్నారు” అన్నాడా వ్యక్తి. అప్పుడు గుర్తొచ్చింది .. ఆ రోజు ఈ డాక్టరే మందులు రాసిచ్చింది.
“మీరు నడుస్తుంటే మయూరి నడిచినట్లే ఉంది. మీలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటే చూడముచ్చటగా ఉంది. అన్నట్లు నా పేరు .. రవి కిరణ్. మీ పేరు ‘గీత’ అని మీ గది ముందు చూశాను” అంటూ పరిచయం చేసుకొన్నాడు. ఆ మాటలకు నా మనసులో ఏదో అలజడి. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటే ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
ఇద్దరం అనుకోకుండానే మా ఇంటిదాకా నడిచే వెళ్లాం. తన బైక్ ఎక్కమన్నాడు.. కానీ, నేను నా అన్న సైకిల్ ఎక్కడం తప్పించి, ఇప్పటిదాకా ఎవరి వెనకా కూర్చుని వెళ్లలేదు. ఏదో అనుకోని భయంతో ‘ఎక్కను’ అని చెప్పేశా.
తనుకూడా కష్టపడి మెడికల్ సీట్ కొట్టాడట. ఆ తర్వాత గుంటూరు వైద్య కళాశాలలో ఆర్థో పీజీ సీట్ వచ్చిందిట. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడట. నన్ను ఆ రోజు చూసిన దగ్గర్నుంచీ మళ్లీ ఒక్కసారైనా కలవాలని అనుకున్నాడట. కానీ ఇల్లు, ఉండే చోటు తెలియక పోవడంవల్ల కలవలేకపోయాడట. ఇప్పుడు అనుకోకుండా ఒక మంచి పనిచేయడానికి వచ్చినప్పుడు, నేను కనిపించడంతో అదొక శుభసూచకంగా అనిపిస్తోందట. తన ఫోన్ నెంబర్ ఇచ్చి, ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యొచ్చని చెప్పి వెళ్లిపోయాడు. నేను ఇంట్లోకి వెళ్లేదాకా నన్నే చూస్తుండటం, నేను కూడా ఓరకంట గమనిస్తునే ఉన్నా. తన కొంటె చూపులతో సిగ్గుల మొగ్గే అయ్యా.
అలా మొదలైన మా పరిచయం ఎన్నో ఊసులతో, ఎన్నో విషయాల చర్చలతో రెండేళ్లు సాగింది. తనకు కూడా కులం, మతం అంటే నమ్మకం లేదుట. వాళ్ల అమ్మ చిన్నప్పుడే పోయిందట. తండ్రి వేరే పెళ్లి చేసుకొన్నాడట. ఇక హాస్టల్ బతుక్కి, పుస్తకాలకీ అలవాటు పడి చదువు చివరికి వచ్చేశాడట.
అమ్మకు కూడా రవిని పరిచయం చేశాను. ఇద్దరి మనసులు కలిశాయనీ, అభిరుచులు, అభిప్రాయాలు కూడా ఒకటేనని చెప్పాం. అమ్మ సమక్షంలోనే, ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాం. మేము కులమే లేని ప్రేమికులం. మాకు ఒక అబ్బాయి. పేరు మిళిత్. వాడు దళితుడు కాదు, పెద్ద కులపోడు అసలే కాదు. కులాలని మట్టుపెట్టి పుట్టిన మిళితుడు. అందుకే ‘మిళిత్’ అని పేరు పెట్టాం. వాడు పుట్టిన నెలకే నాకు ఐఏఎస్ సెలక్షన్ వచ్చింది. రవికి ఆర్థో విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. ఇద్దరం సమాజంలో మార్పు కోసం చాలా కష్ట
పడుతున్నాం. ముఖ్యంగా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తున్నాం. కులరహిత సమాజం కోసం పాటుపడుతున్నాం. వారిని ‘మిళితులు’ అని పిలుస్తూ సంఘంలో వారి సంఖ్య పెరిగేలా చూస్తున్నాం. ‘నిక్’ లా మోటివేషనల్ ప్రసంగాలతో యువతను, దివ్యాంగులనూ ప్రభావితం చేస్తున్నాం.
జీవితం ఒక ఉత్సవం.. సాగుతూనే ఉంటుంది.
తనుకూడా కష్టపడి మెడికల్ సీట్ కొట్టాడట. ఆ తర్వాత గుంటూరు వైద్య కళాశాలలో ఆర్థో పీజీ సీట్ వచ్చిందిట. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడట. నన్ను ఆ రోజు చూసిన దగ్గర్నుంచీ మళ్లీ ఒక్కసారైనా కలవాలని అనుకున్నాడట. కానీ ఇల్లు, ఉండే చోటు తెలియక పోవడంవల్ల కలవలేకపోయాడట. ఇప్పుడు అనుకోకుండా ఒక మంచి పనిచేయడానికి వచ్చినప్పుడు, నేను కనిపించడంతో అదొక శుభ సూచకంగా అనిపిస్తోందట.
డా. రమణ యశస్వి
రచయితగా, ఆర్థోపెడిక్ వైద్యుడిగా డా. రమణ యశస్వి సుపరిచితులు. స్వస్థలం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని గణపవరం. గుంటూరులో నివాసం ఉంటున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో ఆర్థో విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. ‘బాపు – రమణ – బాలు’ కళాపీఠాన్ని స్థాపించి సాహితీసేవ చేస్తున్నారు. కుటుంబ బంధాలు, మానవతా పరిమళాలు వెదజల్లే రచనలు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇప్పటివరకూ అరవైకిపైగా కథలు రాశారు. తులసీ దళాలు (మాతృ శతకం), మిణుగురులు (హైకూ కవిత్వం), రెక్కల గుర్రం (రెక్కలు), తిమ్మిరి బిళ్లలు (నానీలు), భలేమంచి రోజు (న్యూమరిక్కులు), కరోనా ఆత్మకథ (దీర్ఘకావ్యం) రచనలు చేశారు. ఇటీవలే ‘మా గణపవరం కథలు’ పేరుతో కథా సంపుటి వెలువరించారు. జన్మనిచ్చిన పల్లె మట్టి పరిమళాన్ని అందంగా విరబూయించారు. వందకు పైగా పురస్కారాలను అందుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదగా హంస (కళారత్న) అవార్డును స్వీకరించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు చేయాలన్నది తన లక్ష్యమని చెబుతారు.
డా. రమణ యశస్వి
98480 78807