మంచి కథలకు, కొత్త కలాలకు ప్రేరణనిస్తున్నది ముల్కనూరు సాహితీ పీఠం – నమస్తే తెలంగాణ అక్షర సంకల్పం.తెలుగులో కథల పత్రికలు తగ్గుతున్న దశలో ఒయాసిస్సుల్లా ఏటా ఈ కథల పోటీలు వస్తున్నాయి. వడలిపోతున్న కథా వృక్షాన్ని వికసింపజేయడానికి ఈ రెండు సంస్థలూ చేస్తున్న కృషి నిరాటంకంగా సాగాలి. తెలుగు కథ వర్ధిల్లాలి.
ఇందులోని కథల్లో చాలావరకు తెలంగాణ జీవితాలను ఇతి వృత్తంగా చేసుకొని రాసినవే. ఈ ప్రాంతపు బతుకుల్లో వేదనలు, ఘర్షణలు, కష్టాల్లోంచి గట్టెక్కే ప్రయత్నాలు నమోదు చేశారు రచయితలు. ఏ కథకైనా పాత్రోచిత స్థానిక భాష ప్రాణప్రదమని చెప్పాలి. కథా సందర్భం తెలిసినా, రచనా కథన శిల్పంపై పట్టున్నా ఆ పరిసరాల భాష, పదాల వాడకం తెలియకపోతే కథకు జీవం రాదు. కానీ ఈ సంకలనంలోని రచయితలు మాత్రం మట్టి భాషపై మమకారం కురిపించారు.
ముల్కనూరు సాహితీ పీఠం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి తెలుగు కథల పోటీలో బహుమతి సాధించిన కథల సమాహారం.. ‘కథ 2021’. ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న కథ పేరు ‘డిమ్కీ’. ఆర్ద్రత నిండిన ఈ కథను యువ రచయిత్రి స్ఫూర్తి కందివనం రాశారు. సంచార జాతులకు జీవనాధారమైన జానపద కళారూపాల నిరాదరణతో దిగజారిన ఆర్థిక స్తోమతను రచయిత్రి వేదనాభరితంగా చిత్రించారు. చందు తులసి కథ ‘మోదుగు పువ్వు’ లంబాడీ తెగలోని ఆడపిల్లల దీనస్థితికి ప్రతిరూపం. సైది అనే లంబాడీ అమ్మాయి జీవితంలో ఎదురైన కష్టాలు అంగన్వాడీ టీచర్గా ఎంపిక కావడంతో గట్టెక్కుతాయి. కథలో మలుపులు అనూహ్యం. ‘దిశ మార్చుకున్న గాలి’.. ఈతరం ముస్లిం యువతి కోరుకునే స్వేచ్ఛ, ఆత్మగౌరవాలకు అద్దంపడుతూ నస్రీన్ ఖాన్ సంధించిన కథ. ఇతివృత్తంలో వాస్తవికత, పాత్రల్లో ఘర్షణ, కథ నడిపిన తీరులో సహజత్వం పుష్కలంగా ఉన్నాయి.
నెల్లుట్ల రమాదేవి ‘పొద్దు గుంకక ముందే’ మహిళా చైతన్యానికి ప్రతీక. రియల్ ఎస్టేట్ పంజా నుండి భూమిని దక్కించుకున్న ఓ కాలజ్ఞాని అమ్మ కథ. ఉన్న భూమిని అమ్మేస్తే సుఖంగా బతకొచ్చు అనుకునే కొడుకును ‘పని చేయకుండా సుకంగ ఎట్లుంటం కొడుకా? లేని రోగాలస్తయి’ అంటూ హెచ్చరించే ఆ తల్లి మాటలు లోకానికి కళ్లు తెరిపించేలా ఉన్నాయి. ప్రభాకర్ జైని ‘బోన్గిరి టు లష్కర్’ డాక్యుమెంటరీ బాటలో సాగిన షార్ట్ ఫిలిం లాంటి కథ. నగరానికి దగ్గరగా ఉన్న భువనగిరి పట్టణంలోని జీవితాల్లో ఆధునికత రేపిన చిచ్చు నేపథ్యంగా సాగుతుంది. కఠోరమైన వర్కింగ్ రూల్స్ను ధిక్కరించి ‘రైట్ టు సిట్’ సాధించిన సేల్స్ సిబ్బంది గెలుపు గాథ ఇది. సయ్యద్ గఫార్ ‘ఉల్టా బాజా’ హృదయవిదారక ఘటనల సమాహారం. మాదిగ మట్టయ్య, గోరేమియా మంచి మిత్రులు. అనుకోకుండా చనిపోయిన మట్టయ్య అంత్యక్రియలకు స్థల కేటాయింపు విషయంలో ఏవో సాకులతో ఊరంతా జారుకున్నప్పుడు, గోరేమియా తన భార్య ఖతీజాతో కలిసి శవాన్ని సాగనంపిన తీరు గుండెల్ని కలచివేస్తుంది. బీడీ కార్మికురాలి అధర్మ సంకటాన్ని నేర్పుగా నడిపించిన కథ ‘తండ్లాట’. ఉత్తర తెలంగాణలో పేద ఆడ బతుకులకు జీవనాధారమైన బీడీ పరిశ్రమలోని వెతలు, రోగాల కతలను ఈ కథలో అరుణ్ కుమార్ ఆలూరి సహజసిద్ధంగా కూర్చారు.
బతుకు కథలు
‘కాటుక కన్నుల సాక్షిగా’ ఏక్ దమ్ వెరైటీ కథ. ఒక్కసారిగా పాఠకుడు ఆ కాటుక కన్నుల నీడలో విహరిస్తాడు. కాటుకను, కళ్లను ఎన్ని రకాలుగా విప్పి విప్పి, తిప్పి తిప్పి చెప్పవచ్చో కథా రచయిత వేణు మరీదు మనకు నేర్పుతారు. ఆహ్లాదంగా సాగిన కథలో చివర్న వేసిన సృజనాత్మకమైన వేటుకు తల్లడిల్లక తప్పదు. విశాఖకు చెందిన బొడ్డేడ బలరామస్వామి ఆ ప్రాంతపు గూడేలు పాటించే దురాచారాన్ని ఎత్తుకొని ‘కీడుగుడిసె’ కథ రాశారు. స్త్రీలు రుతుక్రమం, ప్రసవం సమయాల్లో ఇంటికి దూరంగా ఉండే ఓ గుడిసెలో కాలం గడపడం ఇతివృత్తం. దాన్ని రూపుమాపేందుకు చేసిన సఫల యత్నంతో కథ ముగుస్తుంది. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో గనులు మూతపడి, పని కోల్పోయిన శ్రామికులు ట్రక్కులో ప్రయాణిస్తూ ఒక్కొక్కరుగా చెప్పుకొనే స్వీయ పరిచయంతో ‘విషవలయం’ సాగుతుంది. ఈ కథ రచయిత అనిశెట్టి శ్రీధర్. అబ్రకపు గనుల ‘పడగ నీడ’లో బాల కార్మికుల బతుకుపోరును సయ్యద్ సలీం తనదైన కథన శైలితో పాఠకుల మనసులకు నలుపునద్దారు. ‘ఫుట్ బాల్’ పేరుతో రెండు కథలున్నాయి. కె.వి.ఎస్ శర్మ రచనలో మిద్దెతోట పెంచి తన ఆదాయంతో బాలుడు ఫుట్ బాల్ కొనుక్కోవడం కథాంశం. టి. సంపత్ కుమార్ కథలో ముగ్గురు కొడుకుల ఒప్పందం ప్రకారం వృద్ధురాలైన తల్లి నెలకొకరి ఇంటికి మారడాన్ని కొడుకులంతా సిగ్గుపడేలా చిత్రిచారు. ఆ తల్లి పరిస్థితికి ప్రతీకాత్మకంగా కథకు ‘ఫుట్బాల్’ అని నామకరణం చేశారు. ‘తన రాతలు నొసట లేవని, పిల్లల చేతుల్లో ఉన్నాయని’ తల్లి అనుకోవడం కలచివేస్తుంది.
ఈ పోటీలో పై బహుమతులన్నీ యువ, వర్ధమాన రచయితలు, రచయిత్రులు సాధించడం ఆహ్వానించదగ్గ పరిణామం. కథకులుగా ఎదుగుతున్న క్రమంలో వచ్చిన అవకాశాన్ని వదలొద్దని వారు కథల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లుగా ఉంది. సామాన్యుల జీవితాల్లోని ఇక్కట్లను ఇతివృత్తాలుగా ఎంచుకొని శిల్ప నైపుణ్యంతో చెక్కి, సుఖ దుఃఖాంతాలతో పరిష్కరించిన కథలు విజేతలుగా ముందు వరుసలో నిలిచాయి. ముల్కనూరు సాహితీ పీఠానికి అభినందనలు, నమస్తే తెలంగాణకు.. నమస్తే!
కథ 2021
ముల్కనూరు సాహితీ పీఠం,
నమస్తే తెలంగాణ 2021
పోటీ కథలు
పేజీలు: 526
వెల : రూ.350
ప్రతులకు : ప్రమోద్ రెడ్డి 94416270804
-బద్రి నర్సన్