లలిత్ కుమార్ సింగ్ బీహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నతాధికారి. డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. సమాజానికి తనవంతు చేయూతగా వందల మంది విద్యార్థులకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, పోలీసు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తూ.. పేద విద్యార్థులు తమ కలల కొలువులు సాధించడానికి సహకరిస్తున్నారు. తన శిక్షణ కార్యక్రమానికి లలిత్ ‘బీహార్ సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్’ అని పేరు పెట్టారు. నిపుణులైన ఉపాధ్యాయుల సహకారంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత శిక్షణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. తనదైన అనుభవాన్ని జోడించి విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంకులు తయారుచేసి ఇస్తారు. పరీక్షల సన్నద్ధతలో ఉద్యోగార్థుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. పేదలకు ఉచిత శిక్షణ కోసం లలిత్ ఫౌండేషన్ ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది.
అందులో ఎంపికైన వారికే ఈ సదుపాయం. ‘సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే నా ఆలోచనకు ప్రేరణ ఏపీజే అబ్దుల్ కలాం’ అంటారు లలిత్. బీహార్కు రాకముందు లలిత్ ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో తరచూ ఆయనకు రాష్ట్రపతి భవన్లో గస్తీ డ్యూటీ ఉండేది. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంను అతిదగ్గర నుంచీ చూసేవారు. ఆయన నిరాడంబరత లలిత్ను ప్రగాఢంగా ప్రభావితం చేసింది. పన్నెండేండ్ల క్రితం.. బీహార్లోని బంకా సబ్ డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా లలిత్ ఉద్యోగ జీవితం ఆరంభమైంది. అక్కడ ఉన్నప్పుడే, బలహీన వర్గాల పిల్లల కోసం విద్యా సదుపాయాలు కల్పించడం మొదలుపెట్టారు. అప్పటినుంచి తాను బదిలీ మీద వెళ్లిన ప్రతిచోటా ఓ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. విద్యార్థులకు ఉద్యోగాల సాధనలో పెద్దన్నగా అండగా నిలిచారు.‘సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్యను మించిన పరికరం లేదు’ అనేది లలిత్ కుమార్ నిశ్చితాభిప్రాయం. ఆ మాట నిజం కూడా.