ఆత్మీయ వాక్యం
‘ఇదీ నా గొడవ’ నుంచి“మీరు తెలుగుల రాసింది నా అటువంటి వానికి కూడ తెలువకపాయె. కాబట్టి దయచేసి మీరు తెలుగుల రాసుడు బందుచేసి సంస్కృతంలనే రాస్తే సంస్కృతం తెల్శిన వాండ్లకన్న మీ ప్రతిభ తెలుస్తది. మీ స్థాయి వాండ్లకు అర్థమయితది. మీరు తెలుగుల రాసుడెందుకు? మీరు రాసింది అర్థం గాక మేం తిప్పలపడుటెందుకు? నీకేం తెలుస్తదిలే అని మీరు అనుడెందుకు. సంస్కృతంలనే రాయండి”
నూరేండ్ల కిందటి వరకు గూడ ఉర్దూల కవిత్వం రాసేటోండ్లు గారు. తెలుగుల రాయగూడదన్నట్లె, ఉర్దూల గూడ రాయవద్దన్నరు. పర్షియన్లనె రాసేటోళ్ళు. అరబ్బీలనయితె దేవుణ్ణి ప్రస్తుతిస్తు మాత్రమే కవిత్వం చెప్పాలె గాని వేరే తీరుగ రాయవద్దని ఆంక్షలుండేటివి. విశ్వనాథ సత్యనారాయణ “దేవుణ్ణి స్తుతించాలంటే దేవ భాషలోపటనే రాయాలె కనుక దేవభాష వుండాలె” అని వాదించినట్లన్నమాట. ‘ముస్లింలు మాట్లాడేది ఉర్దూ అయినప్పటికీ, పర్షియన్లోపటనే కవిత్వం చెప్పినట్లు ముస్లిమేతరులు గూడ (నూటి కొక్కరు గావచ్చు) పర్షియన్ల కవిత్వం రాసి ప్రసిద్ధి పొందిండ్రు. ఉర్దూల కవిత్వం జెప్తె చిన్నచూపు చూసేటోండ్లు. విశ్వనాథ సత్యనారాయణ తోటి ఒకసారి చెప్పిన. “మీరు తెలుగుల రాసింది నా అటువంటి వానికి కూడ తెలువకపాయె. కాబట్టి దయచేసి మీరు తెలుగుల రాసుడు బందుచేసి సంస్కృతంలనే రాస్తే సంస్కృతం తెల్శిన వాండ్లకన్న మీ ప్రతిభ తెలుస్తది. మీ స్థాయి వాండ్లకు అర్థమయితది.
మీరు తెలుగుల రాసుడెందుకు? మీరు రాసింది అర్థం గాక మేం తిప్పలపడుటెందుకు? నీకేం తెలుస్తదిలే అని మీరు అనుడెందుకు. సంస్కృతంలనే రాయండి” అని (విశ్వనాథ ప్రతిభ ఉత్తరాది వారికి తెల్సేటందుకు ఆయన ‘వేయిపడగల’ను ఈనాటి ప్రధాని పి.వి. నర్సింహారావు ‘సహస్రఫణ్’ పేరిట హిందీలకు తర్జుమా చేసిండ్రు). దేశీయ భాషలకు (వెర్నాకులర్స్) సంబంధించి అప్పటి పురాతన భావాలు అట్ల వుండేటివి. మొదట దేవుండ్లు, తర్వాత దేవతలు, అటు తర్వాత అవతారాలు, వాటి తర్వాత ఉన్నత వంశాలు పురాణాల నిండ ఇవ్వే. వీటిని దేవభాషల చెప్పిండ్రు. ఇది సామాన్య ప్రజల భాషకాదు, వాండ్ల జీవితమూ కాదు. ఈ ధోరణి అన్ని భాషలల్ల ఒక్కటే. అటువంటి పర్షియన్ – రాజభాష – నుంచి ఉర్దూ – ప్రజల భాషకు వచ్చుడు పెద్ద మార్పుగాదా? అయితే ఇది ఒక వర్గానికి మాత్రమే మేలుచేసింది.
– కాళోజీ నారాయణ రావు ఆత్మకథ