Sriram Krishnan | ‘చదరంగం ఆటలో రాజు ఒకే ఒక అడుగు వేయగలుగుతాడు. కానీ, అతని బలం అంతా పక్కన ఉన్న మంత్రే’ ఇలాంటి డైలాగే ఓ సినిమాలో చాలా పాపులర్ అయింది. అలాంటి బలమైన బలగం ఉన్న వాళ్లే కార్పొరేట్ రాజ్యంలో చక్రం తిప్పగలుగుతారు. ట్విటర్ ( Twitter ) పిట్టను ఎలాగైనా కొంటానని పట్టుపట్టి, అంతలోనే బెట్టువీడి, చివరికి ఒడిసిపట్టుకున్న ఎలాన్ మస్క్ ( Elon Musk ) దగ్గరా ఇలాంటి దిగ్గజాలు చాలామందే ఉన్నారు. వారందరిలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు శ్రీరామ్ కృష్ణన్. తమిళనాడుకు చెందిన ఈ ఐటీ మేధావి మేనేజ్మెంట్ సూత్రాల ఆధారంగానే మస్క్ పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
శ్రీరామ్ కృష్ణన్ ఒకప్పుడు ట్విటర్ ఉద్యోగే. అంతకుముందు, ఆ తర్వాత కూడా ఆయన కొన్ని కొలువులు చేశాడు. తమిళనాడుకు చెందిన కృష్ణన్ వాళ్లది మధ్యతరగతి కుటుంబం. లక్ష్మీ కటాక్షం లేకున్నా.. సరస్వతి అనుగ్రహం మాత్రం మెండుగా ఉంది. ఎస్ఆర్ఎమ్ కాలేజ్లో ఇంజినీరింగ్ చదివాడు. తర్వాత అమెరికా వెళ్లి మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరాడు. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగాడు. యాహూ, స్నాప్చాట్, ట్విటర్, ఫేస్బుక్ సంస్థల్లో మేనేజ్మెంట్ హోదాలో ఉద్యోగం చేశాడు. 2021 నుంచి ‘ఆండ్రీసెన్ హోరోవిట్జ్’ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థ స్టార్టప్లకు, క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్గా వ్యవహరిస్తున్నది.
వృత్తి సంగతి అటుంచితే, ప్రవృత్తిలోనూ కృష్ణన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. యూట్యూబర్గా, పోడ్కాస్టర్గా తన సృజనాత్మకతను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో తన భార్య ఆర్తి రామ్మూర్తితో కలిసి ‘ఆర్తి అండ్ శ్రీరామ్స్ గుడ్ టైమ్ షో’ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఫేస్బుక్లోనూ పనిచేసింది. వీళ్లిద్దరూ హోస్ట్ చేసే షోకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు. ఎలాన్ మస్క్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. అప్పటినుంచి మస్క్, కృష్ణన్ మధ్య పరిచయం పెరిగింది. అది కాస్తా ఇప్పుడు కృష్ణన్కు కొత్త బాధ్యతలు అప్పగించేవరకు వెళ్లింది. ఎలాన్ తను సొంతం చేసుకున్న ట్విటర్ను ఎలాగైనా చక్కదిద్దాలంటూ మన తమిళ తంబిని ఎంచుకోవడం భారతీయులందరికీ గర్వకారణమే కదా!
“Twitter : భారత్లో అందుబాటులోకి వచ్చిన ట్విట్టర్ బ్లూ టిక్.. నెలకు ఎంత కట్టాలంటే..”