జరిగిన కథ : ధనికరాజ్యంగా వెలుగొందుతున్న వెలనాడును చిత్తుగా ఓడించిన కాకతీయ ప్రభువు గణపతి దేవుడు.. అక్కడి ధనాగారమంతా సామంత మండలమైన ద్వీపరాజ్యం చేరిందని తెలుసుకొన్నాడు. కాకతీయ శ్రేణులన్నీ ద్వీపం మీద దండెత్తాయి. ఓటమి అంగీకరించిన ద్వీపరాజ్య పాలకుడు పినచోడుడు.. వెలనాడు ధనాగారాన్ని కాకతీయులకు అప్పగించాడు. దీంతో గణపతి దేవుని అహం చల్లారింది. సుసంపన్నమైన ద్వీపరాజ్యం తమ ఒడిలో పడటం.. కాకతీయులకు మహదానందం కలిగించింది.
ఆ ద్వీపసీమకు తన బంధువైన భూమయ నాయకుడిని పంపి, అభివృద్ధి చెయ్యవలసిందిగా కోరాడు రెండవ రాజేంద్రచోడుడు. రాజాజ్ఞ, ఆర్థిక సహకారంతో భూమయ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. కృష్ణా నదీమతల్లి సాగరునితో సంగమించే పాయ ఉన్నచోట.. కాకులు స్నానం చేసి హంసలు అయ్యాయని విని, ఆ ప్రాంతానికి హంసలదీవిగా నామకరణం చేశాడు. దాన్నొక జలదుర్గంగా అభివృద్ధి చేశాడు. అక్కడినుంచి రాజేంద్రచోడుడు ఊహించలేనంత పన్నులు వసూలుచేసి, ఆయన అభిమానాన్ని చూరగొన్నాడు భూమయ. దాంతో చోడరాజు దాన్నొక పూర్తిస్థాయి మండల రాజ్యంగా ప్రకటించి, అతనినే పాలకుడిగా నియమించాడు. భూమయ తదనంతరం కొడుకు నారాయణ నాయకుడు తలగడదీవి రాజధానిగా శ. సం.1108లో బలమైన కోటను నిర్మించి, ఆ దీవులను ప్రవర్ధమానం చేశాడు. వెలనాడుకు మంచి ఆదాయం ఇచ్చే నమ్మకమైన సామంతరాజ్యంగా చేశాడు.
* * *
కాకతీయ సైన్యం దండెత్తే కాలానికి వెలనాడును పృథ్వీశ్వరుడు పాలిస్తుంటే, ద్వీపరాజ్యాన్ని నారాయణ నాయకుని కొడుకు పినచోడుడు పరిపాలిస్తున్నాడు. పినచోడుడు ప్రజల్లో మంచిపేరున్న పాలకుడు. ద్వీప రాజ్యాన్ని సైన్యపరంగానూ దుర్భేద్యం చేశాడు. ద్వీప సైన్యంలో రాజ్యభక్తి ప్రేరేపించాడు. అయితే, ఆ సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడినా కాకతీయ సైనికశక్తి ముందు నిలవలేకపోయింది. యుద్ధం పూర్తయిన నెల రోజుల తర్వాత తిరుగు ప్రయాణపు ముహూర్తం నిర్ణయమైంది. దీనికి అనుమకొండ నుంచి పాలన అనుమతి కూడా లభించింది. దాంతో స్కంధావారంలో హడావుడి పెరిగింది. స్కంధావారమంటే యుద్ధ సన్నద్ధమై వచ్చిన సైన్యం విడిదిచేసే చోటు. వేదకాలంనుంచీ స్కంధుడు అంటే దేవతల సేనాని అయిన సుబ్రమణ్యస్వామే. ఆయనే యుద్ధశ్రేణులకు ఆరాధ్యుడు. యుద్ధప్రారంభం ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. శత్రుదేశం కూడా విభిన్న వ్యూహాలతో సిద్ధమై దగ్గరికి రాగానే విరుచుకుపడితే.. స్కంధావారం ఏర్పాటుకు కూడా సమయం ఉండదు. యుద్ధం ప్రారంభమైన తర్వాతే స్కంధావారం ఏర్పాటుచేస్తారు. ప్రతి స్కంధావారంలో సైనిక పటాలాలతోపాటు సహాయ బృందాలు, సదుపాయ బృందాలు, ప్రోత్సాహక బృందాలు.. అనే మూడంచెల బృందాలు ఉంటాయి. ఇవి ఎంత బలిష్ఠంగా ఉంటే.. యుద్ధ క్షేత్రాలలో చతురంగ బలగాల పోరాట పటిమ అంతకు మూడింతలు అవుతుందని రాజుల అభిప్రాయం.
మొదటి అంచె సహాయ బృందాల్లో మంత్రాంగ నిపుణులు, సమాహర్తలు, వేగులు, లేఖకులు, సమాచార నిపుణులు, వార్తాహరులు ఉంటారు. ప్రత్యక్ష యుద్ధం జరుగుతున్న తీరును ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ.. ఏ బల
గాలను, ఎప్పుడు.. ఎన్ని.. ఎలా పంపాలో అంచనావేసి, ప్రత్యక్షయుద్ధం ఏమాత్రం తగ్గకుండా పైచేయిగా ఉండేలా చూడటమే ఈ బృందాల ప్రధాన విధి.
చతురంగ సైన్యాలకు సమస్త సదుపాయాలూ సమకూర్చేవే.. రెండో అంచె సదుపాయ బృందాలు. కత్తులు, ఖడ్గాలు, కవచాలు, డాళ్లు, బల్లేలు, విల్లంబులు, బాణాలు, అంబుల పొదులు.. మొదలైన ఆయుధాల నిర్వహణ, అశ్వాల సమస్యలు, గజసైన్యపు అవసరాలు, రథాలు, ఎడ్ల బండ్ల అంశాలతోపాటు పదాతిదళాల సమస్యలు ఈ బృందాలే పరిష్కరించాలి.
వైద్య బృందాలు, భోజన బృందాలు, చాకలి, మంగలి, కంసాలి మొదలగు వృత్తులవారే కాదు.. భోగపు సానుల బృందాలు, కళాకారుల బృందాలు, పూజాదికాలు నిర్వహించే పురోహిత, జ్యోతిష బృందాలు.. ఇలా మిగిలిన వారంతా మూడో అంచె ప్రోత్సాహక బృందాల్లోకి వస్తారు. చతురంగ బలాలతోపాటు ఈ అంచె బృందాలన్నీ కలిస్తే.. స్కంధావారం.
ఈ చతురంగ బలగాలు కూడా సూక్ష్మ బృందాలుగా ఉంటాయి. దళం.. పద్మం అనే పదాలు పురాణకాలం నుంచీ యుద్ధభాషలో ముఖ్యమైనవే. పదిమంది కాల్బలం ఉన్నది ఒక దళం. దీనికి అధిపతి దళపతి. పది దళాలు ఒక పద్మం. దీనికి నాయకుడు సేనాపతి. పది పద్మాలు ఒక పటాలం. దీనికి నాయకుడు సేనాని. మొత్తంగా గజ బలగానికి నాయకుడు గజ సాహిణి. ఆశ్వ బలగాలకు నాయకుడు ఆశ్వ సాహిణి. రథాలకు నాయకుడు రథ సాహిణి. తర్వాతికాలంలో ఒక రథం, కొందరు సైనికులు, ఐదు ఏనుగులు, పది గుర్రాలు కలిసి ఒక దళంగా నిర్ణయించారు.
ఈ విభిన్న కూర్పులతో రూపొందించిన దళాలను సమన్వయం చేసేవాడు సమాహర్త. అంచె బృందాలకు నేతృత్వం వహించేవారు అధీకృతులు. సమాహర్తలు, సేనానులు, నాయకులు, సైన్యాధ్యక్షులు కలిసి కొత్త కొత్త యుద్ధతంత్రాలతో శత్రుసైన్యంపై ఆధిక్యం సాధించడానికి నిరంతరం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతారు. అందరూ సైన్యాధ్యక్షునికి జవాబుదారీగా ఉంటారు. ఈ సేనానులు, సైన్యాధ్యక్షులు యుద్ధ దుస్తులలో ఉంటే.. యుద్ధతంత్రాలు నడిపే సమాహర్తలు, అధీకృతులు సాధారణ దుస్తులలో ఉంటారు. అందరి దుస్తులపై రాజముద్రలు విస్పష్టంగా ఉంటాయి.
కాలాలను బట్టి, రాజులను బట్టి.. హోదాలు, పదవులు మారిపోతుంటాయి. ఒకప్పుడు దళపతి గొప్ప హోదా అయితే, ఇప్పుడు సేనాని గొప్పహోదా. నాయకుడు, అధ్యక్షుడు కూడా గొప్ప హోదాలుగా ఉన్నాయి. మళ్లీ ఇవి కాలగమనంలో మార్పు చెందుతుంటాయి. యుద్ధభూమిలో ఎవరిపాత్ర వారు చాలా నియమనిష్ఠలతో నిర్వహిస్తారు. వీరందరి సమష్టితత్వంవల్ల స్కంధావారం సర్వకాల సర్వావస్థలయందు పోరాటానికి సర్వసన్నద్ధంగా ఉంటుంది.
స్కంధావారానికి పూర్తిస్థాయి అధికారిని శూన్యపాలకుడు అంటారు. రాజు లేదా యుద్ధానికి నాయకత్వం వహించే సర్వసైన్యాధ్యక్షుడు అత్యుత్తమ అధికారి అయితే, ఆ తర్వాతివాడు శూన్యపాలకుడు. అతని తర్వాత వచ్చేవాడు సంధి – విగ్రహి. ఇరుపక్షాల మధ్య సంధి, చర్చలు నిర్వహించడం అతని బాధ్యత. ఇక్కడ సర్వసైన్యాధ్యక్షుడు మల్యాల చౌండ అయితే.. శూన్యపాలకుడు పూర్ణయ నాయకుడు. ఆయనే స్కంధావారం మొత్తానికి పూర్తి బాధ్యుడు.
* * *
యుద్ధానంతరం ఓడిన రాజ్యపు సప్తాంగాలను గెలిచిన రాజ్యం స్వాధీన పరచుకుంటుంది. సప్తాంగాలంటే స్వామి (రాజు), అమాత్య (మంత్రి), సుహృత్ (స్నేహితుడు/సామంతరాజ్యం), కోశ (సంపద), రాష్ట్ర (ప్రాంతం), దుర్గ (కోట), బలాలు (సైన్యం). ఇరు రాజ్యాల మంత్రాంగవేత్తలు సప్తాంగాల స్వాధీనతపై ఇరుపక్షాల సంధి విగ్రహులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. యుద్ధరంగంలో జరిగే గెలుపోటములన్నీ స్కంధావారంలో ప్రతిఫలిస్తాయి. గెలిస్తే సంతోషం, ఓడితే విషాదం. కాకతీయ స్కంధావారంలో యుద్ధ విజయంవల్ల భోగపు సానుల గుడారాలు తెల్లవార్లూ గానా బజానాలతో వెలిగిపోతున్నాయి. సైనికులు పగలు ఆరోగ్యాలు సరిచూసుకుంటూ సంధ్యవేళ సముద్రతీరంలో, నదీపాయల వెంట విహరిస్తున్నారు. గ్రామాలలో తిరుగుతూ పరిచయాలు, స్నేహబంధుత్వాలు ఏర్పరచుకుంటున్నారు. తమ సాటి గణాల, వృత్తుల వారిని కలుసుకుని పెళ్లి సంబంధాల ద్వారా బంధుత్వాలు కలుపుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడున్న కొత్త అంశాలేవో తెలుసుకుని వాటిని నేర్చుకోవడానికి, తమ ప్రాంతాలకు పరిచయం చేయడానికి ఉత్సుకత చూపుతున్నారు. కొందరు ఇక్కడే ఉండిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా యుద్ధానంతరం ద్వీపప్రాంతంలో ఎన్నో సంస్థాగత సాంఘిక మార్పుచేర్పులు జరిగిపోతున్నాయి. తిరుగుప్రయాణపు ముహూర్తం ప్రకటించడంతో ఈ కార్యకలాపాలకు ముగింపు పడింది. సైనికులంతా స్కంధావారానికి చేరుకుని మూటాముల్లె సర్దుకోవడం మొదలెట్టారు.
* * *
శ. సం. 1123.. దుర్మతి కార్తిక మాసం శుక్లపక్ష ఏకాదశి. ప్రత్యూషవేళ.. తిరుగు ప్రయాణపు తొలి తూర్యారావం మోగాలి. అది ముహూర్తం.
ఆ ముందురోజు రాత్రంతా పూజా వేదికవద్ద ఏర్పాట్లు చేశారు. గతచరిత్ర వదిలేస్తే ఇప్పుడు కాకతీయ ప్రభువులు శైవులు. కాకతిమహాదేవి, రుద్రుడు, మహాదేవుడు, మైలారదేవుల విగ్రహాలు, ద్వీపప్రాంతపు అమ్మ దేవరలు పోలేరమ్మ, నాంచారమ్మ, పోతురాజు విగ్రహాలను కూడా తాత్కాలిక ప్రతిష్ఠ చేశారు పూజారులు. ఫలపుష్పాలతో వేదికను అలంకరించారు.
ద్వీపసీమ మండలేశ్వరుడు పినచోడనాయకుడు దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నాడు. ఆ పూజా కార్యక్రమం వద్ద ప్రధానవ్యక్తి.. కాకతీయ సర్వసైన్యాధ్యక్షుడు శ్రీశ్రీశ్రీ మల్యాల చౌండ సేనాని.
పినచోడ నాయకుడు వినమ్రంగా ముందు నడవగా, మల్యాల చౌండసేనాని హుందాగా నడచివచ్చి.. ముందుగా కాకతీయ దేవతలకు, వైదిక పురోహితులకు తర్వాత ద్వీపరాజ్య ప్రముఖులకు నమస్కరించాడు. పూర్తి సైనిక ఆహార్యంలో చూడటానికే ప్రజలు భయపడుతున్నట్లున్న ఆజానుబాహువు ఆయన. ఆయనకు వినయంగా తలవొంచి నమస్కరిస్తూ కాకతీయ సేనా నాయకులంతా వచ్చి ఆయన పక్కగా నిలబడ్డారు. పూజా వేదికకు ఆవల పక్కన ద్వీప మండలేశ్వరుడు పినచోడుడు, పక్కగా ఆయన అన్నతమ్ముళ్లు, వెనగ్గా వారి వారి అంతఃపుర స్త్రీ పరివారం.. వెనక సేనా నాయకులు, వాళ్ల కుటుంబాలు, రాజప్రముఖులు, మంత్రులు, నియోగాధిపతులు, వృత్తి సమయ సెట్టిలు, వర్తక సెట్టిలు, బలింజ వర్తక ప్రముఖులు, కులీనులు, గ్రామణులు తదితరులు.
ద్వీపసీమ ప్రముఖులంతా ఆ సంరంభానికి హాజరయ్యారు. అనుకున్న సమయానికి పూజ ప్రారంభించారు. మొదటగా సర్వసైన్యాధ్యక్షుడు మల్యాల చౌండ నాయకుడు పెద్ద ఏనుగులా ఉన్న ఎనుబోతు తలను వైదికమంత్ర శబ్ద పవిత్రత నడుమ ఒకే ఒక్క కత్తి ప్రహారంతో శరీరంనుంచి వేరుచేశాడు. మరుక్షణం యుద్ధకాహళుల తూర్యారావం తూర్పుసముద్రం ఉలిక్కిపడేలా మారుమోగింది. అది తిరుగు ప్రయాణానికి గుర్తు. స్కంధావారమంతా ఉత్తేజంతో..
“జయ గణపతిదేవా! జయజయ గణపతిదేవా!” అంటూ కత్తులెత్తి నినాదాలు చేశారు. స్కంధావారం వెలుపలి ద్వారంవద్ద నిలబడ్డ మొదటి సైనికపటాలం, సర్వసైన్యాధ్యక్షుడు మల్యాల చౌండ నాయకుడికి సైనికవందనం చేసి పశ్చిమదిక్కుగా కదిలింది.
అదొక చిత్రమైన సన్నివేశం. సాధారణంగా యుద్ధంలో ఓడిన రాజ్యాధినేతలు, వారికుటుంబాలు విషణ్న వదనాలతో, సంకెళ్లతో ఉండటం పరిపాటి. కానీ, ఇక్కడ ఇప్పుడు అందరూ విజయులే అన్నట్లు కనిపిస్తున్నారు. గెలిచినవారికీ, ఓడినవారికీ ఏమాత్రం తేడా కనిపించకపోవడం ఆశ్చర్యం. దానికి కారణం.. కాకతీయ మహారాజు గణపతిదేవుల శాసనం! వారు తీసుకున్న ఓ గొప్ప నిర్ణయం. అదే తర్వాతి రోజుల్లో సరికొత్త రాజకీయ పరిణామాలకు నాంది అయ్యింది.
(ఇంకా ఉంది)
-మత్తి భానుమూర్తి