భజన సంప్రదాయం తెలంగాణ సొత్తు! భక్త రామదాసు సంకీర్తనలు భజన సాహిత్యానికి ఊపునిచ్చాయి, ఉత్సాహాన్ని తెచ్చాయి. కానీ, క్రమంగా ఈ సనాతన సంప్రదాయం అంతరించిపోతున్నది. అందుకు ప్రజలనిర్లిప్తతా ఓ కారణమే. కానీ, సిద్దిపేట జిల్ల ధూళిమిట్ట మండలం జాలపల్లి ప్రజలు మాత్రం ఆ పరంపరను నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పూర్వం ఈ ప్రాంతంలో నిర్విఘ్నంగా సాగిన రామచక్రి భజనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రామచక్రి భజన సజీవంగా ఉన్న తెలంగాణ గ్రామాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అందులో ఒకటి జాలపల్లి గ్రామం.
తెలంగాణలో భక్తి ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించిన వ్యక్తి.. వాగ్గేయకారుడు రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి. పామరుల చెంతకు రామనామాన్ని తీసుకెళ్లాలన్నదే ఆయన ఆశయం. ఆ ఆలోచనలోంచి పుట్టిందే రామచక్రి భజన. నేటి సిద్దిపేట జిల్లా గజవెల్ల్లి గ్రామంలో జన్మించారు విధుమౌళి శాస్త్రి. రుక్మాభట్ల నర్సయ్య గారి దత్తపుత్రుడు కావడంతో ఇంటిపేరు రుక్మాభట్లగా స్థిరపడింది. విధుమౌళి రామనామాన్ని ఊరూరా తీసుకెళ్లారు. తెలంగాణలో రజాకార్ల రాజ్యం కొనసాగుతున్న సమయంలోనే 108 భక్తి సంఘాలను స్థాపించారు. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయాలను పునరుద్ధరించారు. మహారాష్ట్ర సంప్రదాయ నృత్యమైన చక్రి భజనను స్ఫూర్తిగా తీసుకొని రామచక్రి భజనను రూపొందించారు. రాముడిని కీర్తిస్తూ ఎన్నో కీర్తనలు అల్లారు. ‘తందనాన రామాయణం’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఆయన ద్వారానే భక్తి ఉద్యమం జాలపల్లి గ్రామా నికి చేరింది. ‘ తరాల నుంచీ చుట్టుపక్కల గ్రామాల్లో రామచక్రి భజన అంటే జాలపల్లి పేరే వినిపిస్తుంది. ఇది మాకు గర్వకారణం’ అంటున్నారు ఆ భజనను బోధిస్తున్న రాగుల సంపత్.
ఏం ఉంటాయి?
రామ చక్రి భజన గణపతి ప్రార్థనతో మొదలవుతుంది. శ్రీరాముడిని స్తుతిస్తూ , రామ ధర్మాన్ని బోధిస్తూ, భద్రాచల విశేషాలను తెలియజేస్తూ ఉత్సాహభరితంగా సాగుతుంది. దశావతారాలను వర్ణించే భజన పాట, ఆట.. రామచక్రి భజనకే కలికితురాయి. ఇందులోని ఒక పాటలో జాలపల్లి గ్రామస్తులు తమ ఊరి పేరునూ చేర్చుకున్నారు. ‘జాలపల్లి పురనివాస… చల్లని నీకృప చూపుమా..’ అన్న మకుటాన్ని జోడించుకున్నారు. రండి భద్రాద్రి క్షేత్రము, జైజై భద్రాచల సీతారామ, నడువజాలమో రామ, పర్ణశాల పోదాము రండి, జయరామ రారా.. దేనికదే ఆణిముత్యం. అలా అని రాముడికే పరిమితం కాలేదు. కృష్ణ తత్వాన్నీ బోధించారు. రామ చక్రి భజనలో శారీరక వ్యాయామమూ కలగలసి ఉంది. జాలపల్లి గణేశ్ నవరాత్రుల్లో 2007 వరకు రామచక్రి భజన ప్రతిధ్వనించేది. ఆ తర్వాత ఆగిపోయింది. మళ్లీ, 2019 లో ‘ఊరికి ఒక వినాయక విగ్రహం’ అన్న ఆలోచన రాగానే స్థానిక యువత భజన సంప్రదాయాన్నీ పునరుద్ధరించాలని అనుకొన్నారు. తమ ఊరి కళను కాపాడుకోవాల్సిన బాధ్యత తమదేనని తీర్మానించుకున్నారు. పెద్దల వద్ద నేర్చుకుని ఆడిపాడారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం నిధుల సేకరణకూ దీన్నో మార్గంగా ఎంచుకొన్నారు. ‘మా తండ్రి తరంలో ఆడారు. మేమూ ఆడాం, ఇప్పుడు మా పిల్లలు కూడా ఆడుతున్నారు. మూడు తరాల ముచ్చట ఇది’ అని మురిసిపోతున్నారు జాలపల్లి వాసి బందారం నర్సింలు. ఇంతకు మించిన ఆనందం ఏం ఉంటుంది?
-శివరామకృష్ణ ప్రసాద్