చతుర్దశి నాడు ఆకాశంలో రాశుల స్థితిని తెలియజేస్తుంది నరకాసుర వధ. తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుండగా, పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంది. నిజానికి, మేషరాశి భౌముని రాశి. నరకుడు భూదేవి కుమారుడు. మేషం స్వభావరీత్యా సాధువే అయినా మూర్ఖతకు మూర్తి. నరకుడు అలాంటివాడే.
ఆశ్వయుజ అమావాస్యను దీపావళిగా జరుపుకొంటాం. దక్షిణ భారతంలో ఇది మూడు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి (నరక చతుర్దశి), అమావాస్య (దీపావళి), కార్తిక శుద్ధ పాడ్యమి (బలిపాడ్యమి).. ఈ మూడూ కలిస్తేనే దీపావళి సమగ్రం అవుతుంది. ఉత్తర భారతదేశంలో దీపాల పండుగ ఐదు రోజుల వేడుక. పై మూడు రోజులకు అదనంగా.. ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి), కార్తిక శుద్ధ విదియ (యమ ద్వితీయ లేదా భ్రాతృ విదియ) ఇంకో రెండు రోజులు ఎక్కువగా వేడుకలు చేసుకుంటారన్నమాట! కానీ, దీపావళి నేపథ్యం మాత్రం నరకాసురుడితోనే ముడిపడి ఉంటుంది. నరక చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకుణ్ని చంపేశాడని, దానికి గుర్తుగా ప్రతియేటా దీపాలు వెలిగిస్తూ ఆనందోత్సాహాలతో పండుగ చేసుకుంటామనీ పౌరాణిక గాథ. అయితే ఈ ఘట్టానికి జ్యోతిష శాస్త్రపరంగా కూడా ఒక నేపథ్యం ఉంది. ఆ రహస్యాన్ని తిరుమల రామచంద్ర ‘హిందువుల పండుగలు – పర్వములు’ పుస్తకంలో ఇలా వివరించారు…
‘నరకాసుర వధ అనేది చతుర్దశి నాడు ఆకాశంలో రాశుల స్థితిని తెలుపుతుంది. తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుండగా.. పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంది. ఈ మేషరాశి భౌముని రాశి. నరకుడు భూదేవి కుమారుడు. మేషం స్వభావరీత్యా సాధువే అయినా మూర్ఖతకు మూర్తి. నరకుడు అలాంటివాడే. కాబట్టే, అతని పరిపాలన అంధకార బంధురమైంది. అంటే.. ఆ దినాలలో మేషరాశి సూర్యాస్తమయ సమయాన ఉదయిస్తుంది. మళ్లీ అస్తమించే వరకు చీకటే. మేషరాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దానిని అధిష్ఠించి నరకుని మీదికి యుద్ధానికి బయల్దేరిన కృష్ణుడు సూర్యుడు; సత్యభామ చంద్రుడు; నరకుడు పడిపోగానే ఆకాశపు అంచుల మీద దీపచ్ఛాయలతో ఉన్న కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బందెనుంచి విడివడి; తమను విడిపించిన సూర్యుని – కృష్ణుని – నాయకునిగా చేసుకొన్నది. దీనిని పురాణ కథతో అతికించారు’.