సెన్సెక్స్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరాయనీ, మదుపరుల సంపద గణనీయంగా పెరిగిందన్న వార్తలు తరచూ వింటుంటాం. ఆ పెరిగిన సంపదతోపాటు దానిపై కట్టే పన్ను కూడా పెరుగుతుంది. అయితే, ఈక్విటీ లాభాలను తెలివిగా ఉపయోగించుకుంటే పన్ను పోటు తప్పించుకోవచ్చని తెలుసా? కోట్ల రూపాయలు వర్షించినా.. చట్ట సమ్మతంగా రూపాయి పన్ను కట్టకుండా పూర్తిస్థాయి లబ్ధి పొందొచ్చు. ఈక్విటీ, డెట్, బంగారు ఆభరణాలపై వచ్చిన లాభాలకు పన్ను దెబ్బలేకుండా వెసులుబాటు మార్గం ఒకటుంది. అదేంటంటే…
దేశంలో అభివృద్ధి, సంక్షేమం జోడుగా సాగాలంటే సుంకాలు కచ్చితంగా ఖజానాకు చేరాల్సిందే! దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశాల్లో పన్నులు ప్రధానమైనవి. వాటిని వసూలు చేయడంలో ప్రభుత్వమూ కొంత కఠినంగానే వ్యవహరిస్తుంటుంది. అయితే, అదే ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్కు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అలాంటిదే 1983లో చేసిన ఆదాయపు పన్ను చట్టంలోని 54ఎఫ్ ప్రొవిజన్. ఇది ఏం చెబుతుందంటే… ఈక్విటీ, మ్యూచువల్ఫండ్స్, డెట్, జువెలరీ మీద వచ్చిన లాభాలతో ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం ఉండదు. 54ఎఫ్ నియమం మదుపర్లకు మహదానందాన్ని కలిగించేదే అయినా, కొన్ని షరతులు వర్తిసాయి.
54ఎఫ్ ప్రొవిజన్ మదుపర్లకు ఎలా వర్తిస్తుందంటే… సుధాకర్ ఈక్విటీలో కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. 12శాతం రిటర్న్స్ లెక్కన ఆరేండ్లలో ఆ కోటి రూపాయలు కాస్తా రూ.2 కోట్లు అయింది. మరో ఆరేండ్లకు రూ.4కోట్లకు పెరిగింది. సుధాకర్ ఇన్వెస్ట్ చేసింది రూ.కోటి. వచ్చిన లాభం రూ.3 కోట్లు. చట్టప్రకారం ఈక్విటీ లాభాలపై పదిశాతం పన్ను కట్టాల్సిందే! అంటే రూ.3 కోట్ల లాభానికి గానూ రూ.30 లక్షలు ఆదాయ పన్ను చెల్లించాలి. లాభం మూడింతలు వచ్చినా అందులో పది శాతం పన్ను కట్టడానికి సుధా కర్కు మనసొప్పలేదు. అప్పుడు అతని సమస్యకు 54ఎఫ్ నియమం పరిష్కారం చూపింది. దీని ప్రకారం ఈక్విటీ లాభంతోపాటు పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకొని, ఆ మొత్తంతో ఏదైనా ఇల్లు తీసుకున్నట్లయితే ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. సుధాకర్ అదే చేశాడు. తను పొందిన లాభం రూ. 3 కోట్లు, మూల ధనం రూ.కోటి కలిపి మొత్తం రూ. 4 కోట్లతో ఇల్లు కొన్నాడు. అలా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందాడు.
ఇదేదో బాగానే ఉందే! సుధాకర్లా ఈక్విటీ లాభాలు వచ్చినప్పుడల్లా ఓ ఇల్లు కొనేస్తే ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవచ్చు అనుకుంటే పొరపాటే! ఈ వెసులుబాటు మొదటి రెండు ఇండ్లకు మాత్రమే వస్తుంది. వివరంగా చెప్పాలంటే.. ఈక్విటీ లాభాలతో ఆ వ్యక్తి మొదటి ఇంటిని గానీ, రెండో ఇంటిని గానీ తీసుకోవచ్చు. అప్పటికే రెండు ఇండ్లున్న వ్యక్తి.. ఈ లాభాలతో మరో ఇల్లు కొంటానంటే కుదరదు. అలాగే తెలివిగా ఆ లాభాలతో ఇల్లుకొని నాలుగు నెలలు గడిచిన తర్వాత అమ్మేసి సొమ్ము చేసుకుందామంటే 54ఎఫ్ వర్తించదు. ఈక్విటీ ప్రాఫిట్తో కొనుగోలు చేసిన ఇంటిని కనీసం మూడేండ్లు అమ్మకూడదు. అప్పుడే పన్ను పోటు ఉండదు. ఈ క్రమంలో చాలామంది ఈక్విటీ ఇన్వెస్టర్లు వారి జీవితభాగస్వామి పేరు మీద గానీ, పిల్లల పేరు మీద గానీ ప్రాపర్టీలు కొంటుంటారు. కొందరు ఈక్విటీ పెట్టుబడిని తన పేరుతోపాటు జీవితభాగస్వామి పేరుమీద కూడా పెడుతుంటారు. వచ్చిన లాభాలను క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్లో డిపాజిట్ చేసి, దాన్నుంచి కొనుగోలు వ్యవహారాలు నడిపించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆదాయ పన్ను చట్టంలోని 54ఎఫ్ ప్రొవిజన్ ఇన్వెస్టర్లకు వరమైందని చెప్పొచ్చు.
కొందరు ఉద్యోగులకు తరచూ బదిలీలు అవుతుంటాయి. పట్టుమని మూడేండ్లు ఒక ఊళ్లో ఉండరు. అలాంటి వాళ్లు ఇంటి మీద ఇన్వెస్ట్ చేయకుండా.. ఈక్విటీలో గానీ, మ్యూచువల్ ఫండ్స్లో గానీ పెట్టుబడి పెడితే మంచిది. రిటైర్ అయ్యేవరకు ఆ సొత్తు కొండంత పెరుగుతుంది. పదవీ విరమణ తర్వాత ఎక్కడ సెటిల్ అవుదామని ఫిక్సవుతారో.. ఈక్విటీ లాభాలతో అక్కడ ఇల్లు తీసుకోవచ్చు. పన్ను తప్పుతుంది. ఇన్నేండ్ల పొదుపునకు ఒక అందమైన రూపమూ వస్తుంది.
ఆరుగురు సభ్యులతో అంధుల కచేరీ బృందం ఏర్పాటైంది. కుమారి తమ్ముడు కృష్ణారావు కన్వీనర్గా కుదిరాడు. అతనికి అన్ని అవయవాలూ సక్రమంగా ఉండటంతోపాటు ఏ పనీ లేనందువల్ల.. కుమారి ఏరికోరి అతణ్ని రప్పించింది. అతను ఆ అంధుల బృందాన్ని నడిపించే రథసారథి అయ్యాడు. ధర్మభిక్షం, కుమారి, పాపమ్మ వరుసగా పాటలు పాడుతుంటారు. బుజ్జి కంజిర వాయిస్తుంది. వీరేసు చేతితో పనిచేసే ఆర్గాన్తో సంగీతాన్ని పలికిస్తుంటాడు. దేముడుబాబు లయబద్ధంగా తబలా కొడుతుంటాడు. మొదట పాడుతున్న పాటలకు.. వీరి సంగీతానికి సంబంధం అంతగా ఉండేది కాదు. కానీ, రానురానూ పాటలకు ఈ సంగీతమే ప్రాణమైపోయింది.
ఈ అంధుల బృందం పాడే పాటల్లో సంగీతం ఏరులై ప్రవహించేది. గ్రామ దేవతల పండుగలు, వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాల సమయాల్లో రాత్రిపూట వీరి పాటల కచేరీలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు అవుతున్నాయి. ఒక ప్రదర్శనకు రెండు మూడు వేలు మాత్రమే ఆశించే ఈ బృందానికి.. ఎక్కడబడితే అక్కడ స్వాగత సత్కారాలు లభిస్తున్నాయి. బృందంలో ఉన్నవారు అందరూ అంధులే అయినందున వీరి ప్రదర్శనలు ఎక్కడ జరిగినా చాలామంది హాజరవుతున్నారు. కృష్ణారావు కన్వీనర్గా వివిధ గ్రామాల్లో నాయకుల్ని కలుసుకుంటూ.. వీరికి అవకాశాలు కల్పిస్తున్నాడు. వారందరితోపాటు తను కూడా ఒక భాగం వాటా సొమ్ము తీసుకుంటున్నాడు. ఒకప్పుడు రైల్వేస్టేషన్ బయట పాటలు పాడుతూ యాచకులుగా ఉన్న వీరి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎంతోమందికి ఆదర్శంగా వీరి కార్యక్రమాలు తయారయ్యాయి. కొన్ని పత్రికల్లో వారి సంగీత కచేరీల గురించి ఆసక్తికరమైన వార్తలు వెలువడ్డాయి.
“ఈ వారంలో మనం అనకాపల్లి వెళ్లాలి. నువ్వు పుట్టి – పెరిగిన.. పాటలు పాడిన ఆ రైల్వేస్టేషన్ ఎదుటే మన పాటల కార్యక్రమం ఏర్పాటు చేశారని మా తమ్ముడు చెప్పాడు” అని చెప్పింది కుమారి. అనకాపల్లి పేరు వినగానే ధర్మభిక్షం ఓ విధమైన అనుభూతికి లోనయ్యాడు. రోజూ స్టేషన్ ముందు పాటలు పాడటం గుర్తుకువచ్చింది. కుమారి సలహాతో బృందాన్ని ఏర్పాటుచేసిన విషయం కూడా గుర్తుకువచ్చింది. ‘నా వాళ్లు ఎవరూ లేకపోయినా.. నేను తెలిసినవాళ్లు ఉన్న అనకాపల్లికి ఎప్పుడు వెళ్తానా!?’ అని అతని మనసు ఉవ్విళ్లూరింది. తల్లి అని అతను భావిస్తున్న కంజిరమ్మ కూడా గుర్తుకువచ్చింది. రెండురోజుల్లో అనకాపల్లి వెళ్తారనగా.. “అందరికీ పెద్ద దిక్కుగా ఉన్న నీకు రుణపడి ఉన్నాం. అడుక్కోవడం నుంచి బయటపడాలని నేను చెప్పిన విషయాన్ని నువ్వు ఒప్పుకొని ఈ స్థాయికి తీసుకుని వచ్చావు. నీకు ఏం ఇవ్వగలను నేను” అన్నది కుమారి. ధర్మభిక్షం రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు.
“నీ ఆలోచనతో మన పరిస్థితి మారిపోయింది. నువ్వు నాతో ఉండటమే నాకు కొండంత అండ. ఒంటరితనం కూడా పోయినట్లుంది” అన్నాడు నెమ్మదిగా. ‘కానీ.. నీకేదైనా ఇవ్వాలి!’ అందామని అనుకున్నది. కానీ, మనసులోంచి మాటలు బయటికి రాలేదు. ఆరుగురు కలిసి అనకాపల్లి చేరుకున్నారు. నిర్వాహకులు వారికి చిన్న గదిని కేటాయించి.. “కార్యక్రమం రాత్రి ఉంది. అంతవరకూ విశ్రాంతి తీసుకోండి” అంటూ వెళ్లిపోయారు. ఊరంతా తిరిగి వస్తానని కుమారి కూడా వెళ్లిపోయింది. అనకాపల్లి చేరగానే ధర్మభిక్షానికి తెలియని అనుభూతి కలిగింది. గదిలో విశ్రాంతి తీసుకుంటున్నా.. చిన్నతనం నుంచి తను తిరిగిన ఆ జ్ఞాపకాలే మనసులో మెదులుతున్నాయి. ఆ పరిసరాలేవీ తను ఏనాడూ చూడలేదు. కానీ, తన సొంత ఇంటికి వచ్చిన మాదిరిగా అనిపించింది. తనను ‘ఘంటసాల’ అనుకునే ఆనాటి మనుషులు ఎవరైనా గుర్తించకపోతారా!? అని కూడా మనసు తహతహలాడింది. ‘పుట్టుకతో చూపులేని వారు బృందంగా పాటలెలా పాడతారా?’ అని ఎంతోమంది వచ్చారు.
ధర్మభిక్షం పాటలను అందుకున్నాడు. ఒక్కోపాట అతని గొంతులోంచి ప్రవాహంలా వస్తున్నది. మృదు మధురమైన కంఠంలోంచి తెరలు తెరలుగా వస్తున్న పాటలు.. అక్కడి వారిని చుట్టుముట్టాయి. ఒక్కోపాట ముగిసిన వెంటనే వినిపిస్తున్న కరతాళధ్వనులు.. వందల సంఖ్యలో శ్రోతలు ఉన్నారన్న విషయం, కనిపించని ధర్మభిక్షం కళ్ల వెనుక మనసు గ్రహించింది. తమ స్టేషన్ ముందు ఒంటరిగా పాటలు పాడుతూ భిక్షం ఎత్తుకున్న ఒకనాటి నిరుపేద ధర్మభిక్షాన్ని చాలామంది గుర్తించారు. కచేరీ జరుగుతుండగానే అక్కడున్న యువకులు ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. వచ్చినవారి నుంచి డబ్బులు వసూలు చేశారు. పది, ఇరవై, యాభై రూపాయల నోట్లతో పూలదండ మాదిరిగా తయారుచేశారు. అక్కడున్న నాయకుల్ని పిలిచి ధర్మభిక్షం మెడలో ఆ దండ వేసి అభినందించారు. శ్రోతలు చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. ధర్మభిక్షానికి జరుగుతున్నదేంటో అర్థం కాలేదు. అక్కడేం జరుగుతున్నదో వాద్య బృందానికి కనిపించడంలేదు. వేదిక మీద ఏదో జరుగుతుందన్న విషయం మాత్రం వారి మనోఫలకంలో మెదులుతున్నది. ‘ఆ వేదిక మీద కుమారి ఎక్కడుందా!?’ అని ఒక్క క్షణం ఆలోచించాడు.
“ఈ పాటగాళ్లంతా అంధత్వం శాపం కాదని నిరూపించారు. చూపులేని గానగంధర్వులుగా తయారయ్యారు. బృందాన్ని నడిపిస్తున్న ధర్మభిక్షం ఈ స్టేషన్ ముందే తన గానాన్ని మొదలుపెట్టాడు. ఈ అంధుల కచేరీ బృందం మరింత అభివృద్ధి చెందాలి”.. ఎవరో ఉపన్యాసం చెబుతున్నారు. కచేరీ బృంద సభ్యులకు అప్పుడు అసలు విషయం అర్థమైంది. ఉత్సాహం ఉప్పొంగిన వీరేసు.. తన ఆర్గాన్తో రకరకాల రాగాలను పలికించాడు. దేముడుబాబు ఆగకుండా అయిదు నిమిషాలు నిర్విరామంగా తబలా వాయించాడు. ప్రేక్షకుల నుంచి చప్పట్లే.. చప్పట్లు! ధర్మభిక్షం పక్కనున్న వ్యక్తిని మైక్ అడిగి తీసుకున్నాడు. అతనెప్పుడూ వేదికపై మాట్లాడలేదు. తనకు జరిగిన సన్మానానికి స్పందనగా మాట్లాడాలనిపించి గొంతు సవరించుకున్నాడు. “మీరు మా మీద చూపించిన అభిమానం మరవలేనిది. మరుపురానిది. మేమంతా అంధులమైనా మాలోని కళను ఆరాధించారు. అభినందించారు. మీరు నాకు వేసిన నోట్ల దండ విలువ ఎంత ఉంటుందో నాకు తెలియదు. దీనికి ఎవరూ విలువ కట్టలేరు. ఇది నా ఒక్కడికే కాదు.. మా అందరికీ చెందుతుంది. మేం ఎవరం మా కళ్లతో మిమ్మల్ని చూడలేం. కానీ, మా హృదయాలతో మీ ప్రేమను కొలవగలం. గుండెల నిండా దాచుకోగలం. మాకు కళ్లు వచ్చి ఈ అందమైన ప్రపంచాన్ని, రంగుల్ని, ప్రకృతి అందాలను కళ్లారా చూసినంత ఆనందంగా ఉంది. మీ ప్రేమతో మాకు కొత్త ప్రపంచాన్ని చూపించారు. ‘నేను అనాథను కాదు’ అనే విషయం మీ అభిమానంతో అర్థమైంది”.. ధర్మభిక్షం గొంతు పూడుకు పోయింది. మరి మాట్లాడలేకపోయాడు. అతని కళ్ల వెంబడి కన్నీళ్లు బొటబొటా కారిపోయాయి.వేదిక మీదికి చేరిన కుమారి.. తడుముకుంటూ ధర్మభిక్షం వద్దకు వచ్చింది. అతని సమీపంలోకి వచ్చిన కుమారి కదలికల్ని అతను గుర్తించాడు.
“బాబూ!”.. అంటూ ఓ వృద్ధురాలు ధర్మభిక్షాన్ని చుట్టుకునిపోయింది. ఆమె కళ్లు కూడా తడిచి ముద్ద అయిపోయి ఉన్నాయి. ఆమె కుమారి కాదన్న విషయం తెలుసు. ఎవరీమె!? అతని మదిలో లక్ష సందేహాలు.. “మీ అమ్మ కంజిరమ్మ. వెతికి పట్టుకుని తెచ్చాను”.. కుమారి చెబుతున్న మాటలు వినిపించడం లేదు. “అమ్మా”.. అంటూ బావురుమన్నాడు. కంజిరమ్మ కొడుకుని చుట్టకుని పోయింది. ఆమె కంటి నుంచి వస్తున్న కన్నీటి ధార అతని చొక్కాను తడిపేసింది. మరో పక్కనుంచి కుమారి అతణ్ని వాటేసుకుంది. మూతపడిన ఆమె కళ్లు కూడా వర్షిస్తున్నాయి. అనిర్వచనీయమైన ఆ దృశ్యం.. అక్కడి వారిని కట్టిపడేసింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కన్నతల్లి తన పక్కనున్నా చూడలేకపోతున్న ధర్మభిక్షం.. దుఃఖంతో వస్తున్న వెచ్చని కన్నీళ్లు రెప్పలు విప్పలేని కళ్ల నుంచి ధారాపాతంగా కారాయి. ఆ కన్నీళ్లు బొట్లుగా కుమారి తలపై రాలాయి. ప్రేక్షకుల కరతాళధ్వనులు మిన్నంటిపోయాయి.