Thoti Tribes | కళలకు, కళాకారులకు పుట్టినిల్లు తెలంగాణ. వందల జానపద కళారూపాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నాయి. ఇప్పటికీ ఎంతోమంది జానపద కళలే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. కళే వారి జీవితం. ప్రదర్శనే వారి జీవన విధానం. ఆ జీవితాలు కళకే అంకితం. అలాంటి అరుదైన కళాకారులు.. తోటివాళ్లు.
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనుల్లో ‘తోటి’వారు ఒకరు. వీళ్లు గోండులకు ఉపకులస్థులు. గోండులకు సంబంధించిన చారిత్రక, సాంస్కృతిక విశేషాలను కోయ, గోండు, నాయకపోడు కులాలకు పాటల రూపంలో చెబుతుంటారు. గోండులు, కొలాముల ఇండ్లల్లో పెండ్లి, చావు, పూజ మొదలైన సందర్భాలలో ‘తోటి’ వాళ్లు తమ కళను ప్రదర్శిస్తారు. వీరి జీవితం ప్రకృతితో మమేకమై సాగుతుంది.
‘తోటి’ వారి సామాజిక నిర్మాణం, వంశావళి గోండులను పోలి ఉంటుంది. ‘తోటి’వారు గోండులను ‘బిర్ధాల్ (స్వీకర్త) అని, గోండులు ‘తోటి’వారిని ‘దాని’ (దాత)గా వ్యవహరిస్తారు. గోండుల ఇంటిపేరు గల ‘తోటి’ వారు మాత్రమే ఆ ఇంటివారికి కర్మకాండల్లో, ఉత్సవాల్లో గోండుల వంశచరిత్ర కథలు చెప్పాలనే నియమం ఉంది. తోటివారి ప్రదర్శన బృందంలో ప్రధానంగా ముగ్గురు కళాకారులు ఉంటారు. ప్రధాన కథకుడు కీకిరి వాయిస్తూ కథ చెపుతుంటే వంతలు కుజ్జా, డక్కి అనే వాద్యాలు వాయిస్తారు. నాలుంసగన బీడీ (గోండుల నాలుగు గోతాల కథ), ఇందాయి కథాగానం, యేత్మసూర్ కథ, జంగుబాయి కథ, మహాభారతం, రామాయణం పాటలు పాడుతారు. అల్లిరాణి, సానపాట, మూలస్తంభం.. వంటి కథలను చెబుతారు. వాటిలో ఒక్కొక్కటీ నాలుగైదు రోజుల పాటు సాగడం విశేషం. కర్మకాండల్లో, ఉత్సవ సమయాల్లో కాలికోమ్, పేపరే, డోలు, సన్నాయి వంటి వాద్యాలను ఉపయోగిస్తారు.
గోండులు పెద్ద దేవుడికి కొలుపు చేసేప్పుడు తోటీలు బాజాలు, టుమీ పట్టుకొని ముందు నడుస్తారు. తోటిలు కొత్త పంటను పులగం వండి, దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే గోండులు తినడం ఆనవాయితీ. ఆదిలాబాద్ జిల్లాలోని తోటివారిలో కొందరు బతుకుదెరువు కోసం వివిధ మైదాన ప్రాంతాలకు వలస వెళ్లి మనుగడ సాగిస్తున్నారు. అలాంటివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనంతారం, పోలారం, మద్దునూరు కడిపికొండ, చింతల్, కటాక్షపూర్ తదితర గ్రామాల్లో నివసిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో తమ ప్రధాన పోషకులైన గోండువారు లేకపోయేసరికి వీరికి ఆదరణ కరువైంది. దీంతో స్థానికంగా అన్ని కులాల వారికి ‘కిన్నెర’ వాద్య సహకారంతో మహాభారత కథలను వినిపిస్తున్నారు. వంతలు కాలికోమ్, పేపరే వాద్యాలకు బదులుగా మద్దెల, హార్మోనియంతో ప్రదర్శనలు ఇస్తున్నారు.
గతంలో తోటి కళాకారుల బృందాల్లో మగవాళ్లు మాత్రమే పాడేవారు. ఆడవాళ్లు బాజాలు వాయించడమో, కోరస్ ఇవ్వడమో చేసేవారు. పరిస్థితి ఇప్పుడు కొంత మారింది. కథలు, పురాణాలు చెప్తున్నారు. తోటివారి పాటలు ఆనంద సమయాల్లో, విషాద సంఘటనల్లోనూ భావోద్వేగానికి గురిచేస్తాయి. సందర్భాలను బట్టి సంప్రదాయబద్ధంగా పలురీతుల్లో నృత్యాలు చేస్తారు. స్త్రీ, పురుషులు విడివిడిగా, కలివిడిగా చేసే నృత్యాలు ఎంతో ఆకట్టుకుంటాయి. కథాగానంతో పాటు స్థానిక వీరులు, మహనీయుల గురించి కూడా కండ్లకు కట్టినట్టు కథలు చెప్తారు. తమ మాతృభాష అయిన గోండి లోనే ఈ కథాగానమంతా సాగుతుంది. తోటివారిని గోండుల సాంస్కృతిక వారధులుగా పేర్కొనవచ్చు. ఆగి పోతున్న ఆ పరంపరను నిలుపుకోవడం మన బాధ్యత.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన ‘తోటి’ కళాకారిణి కళావతి. గోండులు, కొలాముల చరిత్ర, సంస్కృతిని పాటలనే ఆధారంగా బతికించింది. ఆ సేవకు గుర్తింపుగా కళావతికి 2022 మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట మహిళ పురస్కారం అందజేసింది. తన తండ్రి తొడసం భీంరావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కళావతి పురుషులకు దీటుగా ప్రదర్శనలు ఇస్తున్నది. ఇతర మహిళలు వనమూలికలు అమ్ముతూ, పచ్చబొట్లు వేస్తూ జీవనం సాగిస్తుంటే.. కళావతి మాత్రం జీవితాంతం పాటలు పాడతానని తన తండ్రికి మాట ఇచ్చింది. ఆ మాటను నిలబెట్టుకోవడానికి కొడుకులతో కలిసి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మహారాష్ట్రలోని నాందేడ్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది.
– అరవింద్ ఆర్య, 7997 270 270
అంతరించిపోతున్న కూనపులి కళను కాపాడుతున్న ఒకే ఒక్కడు.. అసలు దాని ప్రత్యేకత ఏంటి?
కాటికి తోడుగా వచ్చే కాటికాపరుల గురించి ఈ విషయాలు తెలుసా!
ఈ యుద్ధ కళ తెలిసి చేతిలో కర్ర ఉంటే.. ఐదారుగురు తోడున్నట్టే
Burra katha | బుర్ర కథకు ఆ పేరెలా వచ్చింది? అసలు ఫస్ట్ ఇవి ఎలా రూపొందాయి?
Raj Gonds | రాజ్ గోండుల చరిత్రను కాపాడటంలో ప్రధానపాత్ర పోషించేది వీళ్లే..
Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి
హైదరాబాద్లో ఎన్ని బ్యాండ్లు ఉన్నా అరబ్బీ మార్ఫా బ్యాండ్కే ఎందుకంత క్రేజ్?