శారీరకంగా ఫిట్గా ఉన్న సెలెబ్రిటీలు ఏవో పానీయాలు తాగుతున్నట్టు మనం ప్రకటనల్లో చూస్తుంటాం. దీని వెనక మార్కెటింగ్ మాయాజాలాన్ని అలా ఉంచితే… ఫిట్గా ఉండేవారు చక్కెరలు ఎక్కువగా ఉన్న పానీయాలు తాగినా కూడా ఆరోగ్యానికి హామీ ఉంటుందా? అనే కోణంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఓ అధ్యయనం చేసింది. ఈ పరిశోధనకు లక్షమంది నుంచి మూడు దశాబ్దాల ఆరోగ్య సమాచారం సేకరించారు.
వారంలో 150 నిమిషాలపాటు వ్యాయామం చేసినప్పటికీ కూడా.. వారంలో రెండుసార్లకు మించి చక్కెర పానీయాలు తాగినవాళ్లలో దుష్ప్రభావాలు కనిపించాయట. కాబట్టి, ఎంత చురుగ్గా ఉన్నా వారంలో రెండుసార్లకు మించి చక్కెరలు ఎక్కువగా ఉన్న పానీయాలు తాగకపోవడమే మంచిదని అధ్యయన సారాంశం.
దాదాపు సగం మంది భారతీయులు అనాలోచితంగానే తమ స్మార్ట్ఫోన్ చూస్తున్నారని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంస్థ పరిశీలన ప్రకారం భారతదేశంలో స్మార్ట్ఫోన్ వాడేవాళ్లు రోజుకు దాన్ని 70 నుంచి 80 సార్లు చూస్తుంటారట. “దాదాపు యాభై శాతం మందికి తామెందుకు స్మార్ట్ఫోన్ చూస్తున్నామనే స్పష్టత కూడా ఉండదు.
దగ్గరుంది కాబట్టి చూస్తారంతే” అంటారు సెంటర్ ఫర్ కస్టమర్ ఇన్సైట్స్ ఇండియా నాయకురాలు కణికా సంఘి. ఇందుకోసం పరిశీలకులు దేశవ్యాప్తంగా వెయ్యిమంది స్మార్ట్ఫోన్ వాడకపు అలవాట్లను లోతుగా అధ్యయనం చేశారు. కాగా, మిగిలినవారిలో 45 నుంచి 50 శాతం మందికి ఫోన్ వినియోగంపై పూర్తి స్పష్టత ఉందని, 5 నుంచి 10 శాతం మందికి పాక్షికంగా స్పష్టత ఉందని ఈ పరిశీలనలో తేలింది. ఇంకో సంగతి.. స్మార్ట్ఫోన్లలో చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా భారతీయులు చాలావరకు వీడియోలు చూడటానికి ఇష్టపడతారట.
కొవిడ్తో దీర్ఘకాల పోరాటం చేసిన ఓ రోగి కాళ్లు నిల్చున్న పది నిమిషాల్లోనే నీలం రంగులోకి మారాయని ఇటీవల డాక్టర్లు కనుగొన్నారు. ఆ వ్యక్తి కాలి సిరల్లో రక్త ప్రసరణకు సంబంధించిన సమస్య అయిన
యాక్రోసైనోసిస్ ప్రభావాన్ని గుర్తించారు. అతను నిల్చున్న నిమిషంలోనే కాళ్లు ఎర్రబడటం మొదలైంది. పది నిమిషాలు అయ్యేసరికి నీలం రంగులోకి మారాయి.
బరువుగా, దురదగా కూడా అనిపించింది. నిల్చునే భంగిమ మార్చిన రెండు నిమిషాలకే కాళ్ల రంగు ఎప్పట్లా మారిపోయింది. కొవిడ్-19 ఇన్ఫెక్షన్కు గురైనప్పటి నుంచి ఈ సమస్య ఉన్నట్టు రోగి తెలిపాడు. అయితే కొవిడ్కు, యాక్రోసైనోసిస్ సమస్యకు మధ్య సంబంధం గురించి మాత్రం డాక్టర్లకు కూడా స్పష్టంగా తెలియడం లేదు. ప్రజలు దీని గురించి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.