Adoption | అసలే అనాథలు. ఆపైన పుట్టుకతో వచ్చిన జబ్బులు. శిశువిహార్లో తలదాచుకుంటున్న ఆ పసిబిడ్డలను దత్తత తీసుకోడానికి అమెరికా, ఇటలీ తదితర దేశాల నుంచి ఎంతోమంది దంపతులు వస్తున్నారు. వారికి ప్రేమనే కాదు, పునర్జన్మనూ ప్రసాదిస్తున్నారు. మానవత్వం బతికే ఉందనడానికి ఇంతకుమించిన ఆధారాలు అవసరం లేదు. మూడేండ్ల క్రితం ఓ పసివాడు చెత్తకుప్పల మధ్య దొరికాడు. కొన ప్రాణంతో ఉన్న బిడ్డను నిలోఫర్ దవాఖానకు తరలించారు. సర్వశక్తులనూ ధారపోసి ప్రాణాలు నిలబెట్టారు వైద్యులు. ఆ తర్వాత శిశువిహార్కు పంపారు. ఆ బిడ్డకు ఆంబీజియస్ జెనిటాలియా అనే అరుదైన సమస్య ఉంది. దీనివల్ల జననాంగాలు బయటికి కనిపించవు. ఆ పసివాడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్నారు.
* * *
ఆ చిన్నారి సికింద్రాబాద్ జూబ్లీ బస్స్టేషన్ సమీపంలోని ఓ పబ్లిక్ టాయిలెట్ దగ్గర దొరికింది. పుట్టుకతోనే కంటిచూపు సమస్య. ప్రాథమిక చికిత్స తర్వాత శిశువిహార్కు తరలించారు. ఇప్పటికే, ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడింది. మసకమసకగా అయినా చూడగలుగుతున్నది. ఆ చిట్టితల్లిని అమెరికా నుంచి వచ్చిన ఓ జంట దత్తత తీసుకుంది.
* * *
ఆ ఐదేండ్ల పసివాడికి పుట్టుకతోనే వినికిడి లోపం. దీంతో మాటలు కూడా రాలేదు. తండ్రి ఏదో యాక్సిడెంట్లో మరణించాడు. తల్లి నాలుగు ఇండ్లలో పాచిపనులు చేసుకుని బతుకుతుంది. బిడ్డకు ఖరీదైన శస్త్రచికిత్స చేయించే శక్తి లేదు. దీంతో శిశువిహార్లో చేర్పించింది. ఓ అమెరికన్ దంపతులు ఆ బాలుడిని దత్తత తీసుకున్నారు.
* * *
కొవిడ్ సమయంలో.. హైదరాబాద్లోని ఓ షాపింగ్ మాల్ వెనుక రోజుల పసికందును ఎవరో వదిలేసి వెళ్లినట్టు పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే ఆ చిన్నారి ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది పడుతున్నది. అసలే కరోనా కలకలం. హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ఆ అనాథ శిశువును చేర్చుకోడానికి ఏ దవాఖానా సిద్ధపడలేదు. దీంతో ఉన్నతాధికారులు చొరవ తీసుకుని నిమ్స్లో చేర్పించారు. పది రోజులపాటు వెంటిలేటర్పై ఉంచారు. మొత్తానికి పసిబిడ్డ కోలుకున్నది. కెనడాకు చెందిన భార్యాభర్తలు ఈ మధ్యే దత్తత తీసుకుని తమతో తీసుకెళ్లారు.
* * *
పాపం పసికందులు! పుట్టుకతోనే పుట్టెడు అనారోగ్యం. ఖరీదైన వైద్యం చేయించలేని నిస్సహాయత. పోషించడమే గగనమైన పరిస్థితులు. దీంతో కన్నవారు గుండెరాయి చేసుకుని ఆ పిల్లల్ని చెత్తపాలు చేస్తున్నారు. మురికి కాలువల పక్కన పడేస్తున్నారు. ముళ్లపొదల్లో తోసేస్తున్నారు. మృత్యువుకు కూతవేటు దూరంలో ఉన్న ఆ పసికందులను సమాచారం అందగానే.. దవాఖానకు తరలిస్తారు అధికారులు. ప్రాథమిక చికిత్స తర్వాత.. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశువిహార్లో చేరుస్తారు. అప్పటినుంచి ఆయమ్మలే.. అమ్మానాన్నలు! వాళ్ల ఒడిలోనే పెరుగుతారు. ఆ చేతి గోరుముద్దలే తింటారు. పరిపూర్ణ ఆరోగ్యవంతులైన పిల్లల్ని ఎవరో ఒకరు దత్తత తీసుకుంటారు. కానీ జన్యు లోపాలతో, తీవ్ర అనారోగ్యాలతో, ఓ పట్టాన సరిచేయలేని వైకల్యాలతో పుట్టినవారి గతేమిటి? ఖరీదైన శస్త్రచికిత్సలు ఎవరు చేయిస్తారు? చిల్లులు పడిన గుండెలు ఆగేదాకో, బలహీనమైన వ్యవస్థ మొరాయించేదాకో.. దినదిన గండంగా చస్తూ బతకాల్సిందేనా? ఇప్పుడిప్పుడే, వాళ్లనూ దత్తత తీసుకోడానికి ముందుకొస్తున్నారు మనసున్న మనుషులు. అది కూడా అమెరికా, ఇటలీ, ఫిన్లాండ్, కెనడా తదితర దేశాల నుంచి గంపెడు ఆశతో వచ్చేవారే ఎక్కువ. ఇటీవలి కాలంలో ఇలాంటి దత్తతలు వంద వరకూ జరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది తొలి భాగంలోనే పదిహేడుమంది ‘స్పెషల్ చిల్డ్రన్’… కొత్త అమ్మానాన్నలతో కలిసి అంతర్జాతీయ విమానాలు ఎక్కారు. బిడ్డకు జన్మనివ్వడమే అదృష్టమైతే.. పునర్జన్మనివ్వడం ఇంకెంత అదృష్టం! అంతేకాదు, తమ దేశాలకు తీసుకెళ్లాక.. వారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఖరీదైన శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. వినికిడి లోపం ఉన్న బిడ్డకు.. ఈ మధ్యే ఇంప్లాంటేషన్ ద్వారా లోపాన్ని సరి చేయించారు దత్తత తీసుకున్న తల్లి దండ్రులు. ఆ పసివాడు ఇప్పుడు శబ్దాలను వింటున్నాడు. స్వరాలను గుర్తుపడుతున్నాడు. మెల్లమెల్లగా మాట్లాడుతున్నాడు కూడా.
దత్తత విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇదొక దశలవారీ ప్రక్రియ. దత్తత ప్రతిపాదన రాగానే.. ఆ దంపతుల పూర్వా పరాలను లోతుగా పరిశీలిస్తారు అధికారులు. ఆ తర్వాత.. పిల్లల ఫొటోలు, ఆరోగ్య ప్రొఫైల్స్ మెయిల్ చేస్తారు. ఆ దంపతుల ఫొటోలనూ పిల్లలకు చూపుతారు. వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో.. దత్తత తీసుకోవాలి అనుకునేవారు తాము పెంచుకోవాలనుకునే పిల్లలకు ఆన్లైన్లో తమ ఇల్లు, గదులు, ఇంట్లో బొమ్మలు.. చూపిస్తారు. ప్రేమగా పెంచుకుంటామని భరోసా ఇస్తారు. దత్తత తర్వాత కూడా.. అధికారులు బిడ్డ యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉంటారు. ‘నిజానికి ఇక్కడున్న ప్రతి చిన్నారినీ మా బిడ్డలానే చూసుకుంటాం. మా దగ్గర అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయి. పిల్లల భద్రత కోసం ముప్పైకి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం’ అని వివరిస్తారు శిశువిహార్ అధికారులు.