ప్రతియేటా ఆ గ్రామంలో ఒకటి రెండు ఇండ్లు ఖాళీ అవుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటుకాని వాళ్ళూ, వృత్తి పనులకు గిరాకీ లేనివాళ్ళూ, కూలిపని దొరకని వాళ్ళూ గ్రామం విడిచి పెడుతున్నారు. వాళ్ళు బ్రతుకు తెరువుకోసం అటు బెజవాడకో, ఇటు మద్రాసుకో లేక సమీప పట్టణాలకో తరలివెళ్ళుతున్నారు. పుట్టి పెరిగిన గడ్డను వదిలి వెళ్ళడం సులభమైన పనిగాదు. ముప్ఫై ఏండ్లుగా, నలభై ఏండ్లుగా, యాభై ఏండ్లుగా ఈ గ్రామంతో అల్లుకున్న అనుబంధాలు ఒక పట్టాన తెగేవి కావు. ఆ గ్రామం తిండి పెట్టలేదు. ఐనా అది సృష్టించిన బంధాలు చాలా బలమైనవి. చిన్నప్పుడు చెడుగుడు ఆడుకున్న వీధులను, చెమటలు కారుస్తూ దున్నిన పొలాలను, కష్టసుఖాలను పంచుకున్న ఇరుగు పొరుగులను వదిలిపెట్టడం రంపపు కోతగా అనిపించేది.
ఆవు నుండి లేగను పాలు పిదికేవాడు వేరుచేస్తాడు. తల్లికోడి నుంచి పిల్లలను గద్ద వేరుచేస్తుంది. కాని తమ స్వంత గడ్డ నుంచి తమను వేరుచేస్తున్న శక్తి ఏదో వాళ్ళకు తెలియదు. గ్రామాన్ని వదిలి పెట్టేటప్పుడు లేగ లు, కోడిపిల్లల వలె అంగలార్చేవారు; శోకించేవారు. తాము ఊరును విడిచిపెట్టే రోజును ముందుగానే నిర్ణయించుకునేవారు. రాహుకాలం, వారశూల లాంటివి అడ్డురాకుండా చూసుకునేవారు. పొరుగూళ్ళలో ఉండే బంధు, మిత్రులకు ఈ విషయం తెలియజేసే వాళ్ళు. పెండ్లిండ్లు, పెంపకాలు వంటి ఆయా బాధ్యతలను ఆయా వ్యక్తులకు అప్పగించేవారు.
తాము నిర్ణయించుకున్న రోజు ఎప్పుడొస్తుందా అని ఆతురతతో ఎదురు చూసేవాళ్ళు. తీరా ఆ రోజు వచ్చేటప్పటికి వాళ్ళ మనో నిబ్బరం నీరైపోయేది. సామాను సర్దుకోవడానికి చేతులు నిరాకరించేవి. గడప దాటడానికి కాళ్ళు నిరాకరించేవి. వీడ్కోలు చెప్పడానికి నోరు నిరాకరించేది. అప్పుడు వాళ్ళు నల్లకల్లును సీసాలలో తెచ్చి తాగేవాళ్ళు. ఆ మైకంలో వాళ్ళకు కావలసినంత తెంపు, తెగువ లభించేవి. “యలబారండ్రా. రాముడుండాడు రాజ్జివుండాది. యలబారండ్రా” అని ఒకరినొకరు పురమాయించుకునే వాళ్ళు. ఇండ్లకు తాళాలు వేసి, మూటలను, పెట్టెలను నెత్తిన పెట్టుకుని కాళ్ళు తడబడుతూ వీధుల వెంబడి నడిచేవాళ్ళు. ఊరు ముంగటకు వచ్చి, వెనుదిరిగి ఊరును తేరిపార జూసేవారు. అప్పుడు వాళ్ళ కళ్ళలో గంగ సుడులు తిరిగేది.
– డాక్టర్ కేశవరెడ్డి నవల ‘రాముడుండాడు రాజ్జివుండాది’ నుంచి…