‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
“రామయ్యా!.. ఓ రామయ్యా!”.. అంటూ ఎదురింటి శేఖర్ కేకలేస్తున్నడు.
“బుజ్జీ! ఎవరో చూడమ్మా!.. ఏందో అడుగు బిడ్డా!”..
అని గీతకు చెప్పేసరికి.. భోజనం తింటున్నదల్లా అలాగే ఎంగిలి చెయ్యితోనే లేచి బయటికి వెళ్లి చూసి, ఒకింత నిర్ఘాంతపోయి నిలుచుని.. వెంటనే సర్దుకుంది గీత. కళ్లెదుట జరుగుతున్న దృశ్యం చూసి ఒకింత సిగ్గుగా, ఒకింత అవమానంగా తోచింది.
“నాన్నా! నాన్నా!” అంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి.. కంగారుగా, భయం భయంగా తండ్రికి దగ్గరగా వెళ్లి..
“మరే! శారవ్వనూ..” అంటూ బయట జరుగుతున్న సంఘటన చెప్పింది.
పెరట్లో కట్టెల కుచ్చెన నుంచి తడిసిన కట్టెల్ని తీసి ఆరబెడుతున్న రామయ్య.. చేతిలోని కట్టెల్ని కిందపడేసి, బయటికి వేగంగా వచ్చిండు. పక్కింటి సూరయ్య కొడుకు శేఖర్ కనిపించిండు. అతనికీ రామయ్య కొడుకు వయసు ఉంటుంది. ఇదే వీధిలో ఉంటరు.
‘ఈ పిల్లగాడు రామయ్యను మర్యాద లేకుండా పిలుస్తున్నడు. అంత పొరపాటు ఏం జరిగిందబ్బా?!’..
అనుకోసాగిండ్రు అక్కడున్న జనాలు.
రామయ్యకు ఇంటికెదురుగా సొంత రైస్మిల్లు, పిండిమర ఉంది. వడ్లు పట్టించుకోవడానికి, పిండి పట్టించుకోవడానికి వచ్చినవాళ్లు అక్కడ క్యూ కట్టిండ్రు. అందరూ రామయ్య గుమ్మం ఎదుట గుమిగూడిండ్రు. ఆ వీధిలో దాదాపు 20 ఇండ్లు ఉంటయి. అందరూ వ్యవసాయం చేసుకునేవాళ్లే! పొద్దున సమయం కావడం వల్ల అందరూ ఇళ్లలోనే ఉన్నరు. బయట జరుగుతున్న గొడవకు అందరూ బయటికి వచ్చి..
‘ఏందీ!? ఈ పిల్లగాడు రామయ్య ఇంటిమీదికి పోయిండు!’ అని ఆశ్చర్యంగా చూస్తున్నరు.
వేరే ఊళ్ల నుంచి మిల్లుకు వచ్చినవాళ్లు.. ‘ఏం జరుగుతున్నదో!’ అని చోద్యం చూస్తున్నరు.
శేఖర్ చేతిలో ఒక బట్టతో ముడివేసిన మూట కనిపిస్తున్నది. విసురుగా తెచ్చి రామయ్య గుమ్మంలోకి ఆ మూటను విసిరిండు. విసిరినప్పుడు ముడి ఊడిపోయి అందులో ఉన్న రొట్టెలు బయటపడ్డయి.
అంతే విసురుగా నాలుగడుగుల్లో వెనక్కి వెళ్లి, వాళ్లింటిలోంచి శర్వమ్మను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి.. రామయ్య వాకిట్లోకి నెట్టిండు. తూలి కిందపడబోయిన శర్వమ్మను రామయ్య రెక్కపట్టుకుని ఆపిండు.
“ఏం శేఖర్!? నాయనమ్మను అట్లనేనా తోసేది!” కోపంగా అన్నడు రామయ్య.
“ఆమె నాకెందుకు నాయనమ్మ అయితది!?” విసుగ్గా అన్నడు శేఖర్.
“ఏం పిల్లగా! మీ నాయనమ్మ కాదా!? మరి ఎవరామె?” అన్నరు అక్కడున్న వాళ్లు.
“మీరు ఇందుట్ల మాట్లాడకుండి. ఇది మాకు మాకు జరిగిన ముచ్చట” అన్నడు శేఖర్.
“మీకు మీకు జరిగితే మీ ఇండ్లల్ల చూసుకోండి.
బజార్లకు వచ్చి కొట్లాట ఎందుకయ్యా!? ఆ ముసలామెను దొబ్బితివి, కిందపడి ప్రాణం పోతే!?”.. అన్నడు అక్కడున్న మరొకాయన.
“ఆమె ప్రాణంపోతే ఎవళ్లకు అక్కెర?”
అన్నడు శేఖర్.
“వేలెడంత లేవు.. పెద్దాయనను పట్టుకొని పేరువెట్టి పిలుస్తున్నవేందయ్యా!” అన్నడొకాయన.
“మీకు పెద్దాయన అయితే అయ్యిండు.. మాకెందుకు అయితడు! అసలు గీ పెద్దమనిషి ఏం జేసిండో ఎరుకేనా మీకు?” అన్నడు శేఖర్.
“అంత చెడ్డ పని ఏంజేసిండయ్యా?”.. అంటూ కోపంగా ముందుకొచ్చి అన్నడొక పెద్దమనిషి.
శేఖర్ రామయ్య దిక్కు తిరిగి..
“మేము తిండిలేక బాధపడుతున్నమని మీకు చెప్పినమా!? ఈ ముసల్ది చెప్పిందా!? బిచ్చమేసినట్లు రొట్టెలు చేసి మూటగట్టి ఇచ్చిండ్రు! అంత మీకు ఎక్కువైతే ఇంకెవరికన్నా దానంజెయ్యుండ్రి. మాకు మీ ముష్టి అవుసరం లేదు!” అన్నడు.
రామయ్యకు తల తీసేసినట్లు అయ్యింది.
‘ఈ ముసల్ది’ అని శేఖర్ అంటున్న సమయంలో శర్వమ్మను చూస్తే జాలేసింది.
“ఏం మాట్లాడవూ! ముసల్ది వచ్చి నిన్ను అడిగిందా!? చెప్పు..” అంటూ నోటికొచ్చినట్లు అంటున్నడు శేఖర్.
శర్వమ్మ దిక్కు చూసిండు రామయ్య. భయంభయంగా బిక్కు బిక్కుమంటూ వణుకుతూ, బిత్తరపోయి..
‘రామయ్య నిజం చెప్తడేమో!?’ అని భయపడుతున్నది ఆమె.
‘నేనడిగితేనే ఇచ్చిండని చెప్తదేమో!’.. అని రామయ్య భార్య లక్ష్మి దిక్కు చూసింది శర్వమ్మ.
కానీ, ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు.
నిన్న..
‘ఆకలైతుంది.. ఏమన్న ఉంటే ఇయ్యుండ్రి!’ అని శర్వమ్మ బతిమాలితే..
“లక్ష్మీ! పాపం పెద్దమనిషి అడుగుతున్నది. మనతోపాటే నాలుగు రొట్టెలు ఎక్కువ చేసియ్యే!” అన్నడు రామయ్య.
అక్కడికీ.. లక్ష్మి వద్దనే చెప్పింది. వాళ్లింటోళ్లకు తెలిస్తే రాద్దాంతం చేస్తరని కూడా అన్నది.
కానీ, రామయ్య మాత్రం..
“ఎవరిపాపం వాళ్లది.. పోనీయే!” అన్నడు.
ఇచ్చిన రొట్టెలను అక్కడే ఒక్క నిమిషంలోనే ఆబగా తిన్నది శర్వమ్మ. పాపం అనిపించింది లక్ష్మికి.
కడుపు నిండినంక..
“మీ కుటుంబం సల్లగుండాలె కొడుకా! నాలుగు దినాలైంది తినక. కొడుకూ, కోడలు.. వాళ్ల పిల్లలను తీసుకొని ఊరుకు పోయిండ్రు. సౌదలన్నీ తనాబిల పెట్టుకున్నరు. ఆకలికి తట్టుకోలేక అడిగిన. ఎవ్వరికీ చెప్పకుండ్రి కొడుకా! వాళ్లకు తెలిస్తే నన్ను బతుకనియ్యరు!” అంటూ రెండు చేతులూ పట్టుకుని బతిమాలుతున్నట్లు అన్నది శర్వమ్మ.
“సరేనవ్వా.. ఎవ్వరికీ జెప్పంగానీ నువ్వు ఇంకపో!” అన్నరు వాళ్లు.
ఆమెను చూస్తే రామయ్య భార్యకు కూడా జాలేస్తున్నది. అమాయకంగా రామయ్య మొఖం చూస్తూ దండం పెడుతున్నది శర్వమ్మ. శేఖర్ గొడవతో రామయ్య పిల్లలకు కోపం కట్టలు తెంచుకున్నది.
ముందుకొచ్చి శేఖర్ను నాలుగు తందామన్నంత కోపంగా ఉన్నరు వాళ్లు. తండ్రిని అంతలేసి మాటలంటుంటే.. ఆయన కూడా ఏమీ అనడంలేదని వాళ్లకు ఉక్రోషం వస్తున్నది.
తండ్రి దిక్కు చూస్తే.. ‘వద్దు’ అని కళ్లతోటే సైగ చేసిండు రామయ్య.
కాసేపు అంతా మౌనంగా ఊరుకున్నరు.
అంతలోనే శేఖర్ తల్లిదండ్రులు వచ్చిండ్రక్కడికి. వస్తనే..
“ఏమయ్యా రామయ్యా! మనం ఒక గేరిలో ఉన్నంత మాత్రాన మీ ఇంట్లో వండింది మా ఇంటికి పంపుతవా!?. నీ కులం ఏంటిది? మా కులం ఏంటిది?” అంటూ కొట్లాటకు దిగిండ్రు.
అంతసేపు ఊరుకున్న రామయ్యకు.. వాళ్లు అలా మాట్లాడగానే కోపం కట్టలు తెంచుకుంది.
“అవును! వాయ నేనే ఇచ్చిన. ఏంది సంగతి?” అన్నడు ధైర్యం తెచ్చుకుని.
“ఇచ్చిందే గాక.. ‘నేనే ఇచ్చిన’ అని ధైర్యంగ చెప్తున్నవేంది!? అది దాని దగ్గరున్న బంగారం గానీ నీకు ఇచ్చిందా? ఆస్తిపాస్తులేమన్న రాస్తనన్నదా!?” అన్నరు వాళ్లు.
“ఇంతసేపు ఊరుకున్ననని నోటికెంతొస్తే అంత అంటరా!? ఓ! తెగ ఎగురుతున్నరు. పిల్లగానితోటి ఎందుకని గమ్మునున్న! సిగ్గు లేదు మీకు. పక్షులసొంటిది తెచ్చుకున్న ఆహారాన్ని మరోపక్షికి పంచుతయి. సాటి మనిషి ఆకలితోటి ఉంటే మనిషన్నోడికి కడుపు తరుక్కపోతది! అసొంటిది ఆ ముసలామె నాలుగు రోజులనుంచి తిండిలేక అల్లాడుతున్నది. సౌదలన్నిటికి తాళాలేసుకొని అందరూ కట్టగట్టుకొని ఊరికి పోతె.. ఆమె ఏం తినాలే!? ఆలోచించిండ్రా! కులం, మతం అనుకునేటోల్లయితే.. అన్ని అందేటట్టు పెట్టి పోయేదుండె. మీరు సక్కగ జూసుకున్నంక మేమెందుకు వస్తం మీ ఇంటికి!” అన్నడు రామయ్య.
రామయ్య ఎదురుదాడితో వాళ్లంతా మారు మాట్లాడకుండా నిల్చున్నరు.
శేఖర్ కల్పించుకుని..
“ఏందీ! ఈ ముసల్ది మీ దగ్గరికొచ్చి చెప్పిందా? ఇంట్లో ఏమీ లేవని..” అన్నడు.
“చెప్పాల్నా! మాకు తెల్వదా!? ఈ సుట్టుపక్కల ఇండ్లోల్లను ఎవరిని అడిగినా.. మీ ఇంటి భాగోతం చెప్తరు. అసలు మీరు మనుషులేనా!? మీకంటే పెద్దది. ఒంట్లె పాణం లేదు. ఆ పెద్దామెతోని గొడ్డు చాకిరీ చేయిస్తున్నరు. ఆమెకేం కర్మ పట్టిందయ్యా!? కనకపోయినా.. నిన్ను పెంచి పెద్దజేసింది. ఆమె ఆస్తినంతా నీ పరంజేస్తే.. ఈ వయసులో తిండికి గూడా సక్కగ నోచుకుంటలేదు! నిన్న రొట్టెల పండుగ ఉండె. మా లక్ష్మి రొట్టెలు చేస్తే.. ఇంట్లో మీరెవరూ లేరని.. అవ్వ తింటదని ఇచ్చిన. నా తల్లితోపాటు ఆమె అనుకున్న.. అంతేగానీ ఏంలేదు” అన్నడు రామయ్య.
“నీ తల్లిని నువ్వు సక్కగ చూసుకో! మా ఇంట్లోళ్ల దగ్గరికి రాకు చెప్తున్న!”.. వేలు చూపిస్తూ అన్నడు శేఖర్.
శేఖర్ మాటలు, చేతలతో అక్కడున్నవాళ్లందరికీ కోపం వచ్చింది.
“అరే.. ఓ పోరగా! మీరు పెద్ద కులపోళ్లు. గిస్వంటి విలువ తక్కువ పనులు ఎందుకు చేస్తున్నవు. ఏమనుకుంటున్నవ్? మాముందలనే ఆ పెద్దమనిషిని ఇంతగనం తిప్పల వెడుతున్నరు! ఇంకజెరసేపు ఇక్కడున్నరంటే మీరు పెద్దింటోళ్లని.. చిన్నింటోళ్లని ఏమీ చూడం. ఆమెను ఇంట్లెకు తీసుకుని పోండ్రి!” అన్నరంతా ఏకకంఠంతో!
చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఎగబడేసరికి.. అందరూ ఇంట్లోకి వెళ్లిపోయిండ్రు.
శర్వమ్మ – సుబ్బయ్య దంపతులది బాగా ఉన్న కుటుంబం. లక్షల ఆస్తి ఉన్నా.. శర్వమ్మకు కొంచెం కూడా గర్వం ఉండేది కాదు. ఊళ్లో వాళ్లకు తలలో నాలుకలా ఉంటూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేసేది.
“శర్వమ్మది పెట్టే చెయ్యేకానీ.. పట్టే చెయ్యికాదు. సల్లగ బతకాలే!” అనేవాళ్లు ఊరివాళ్లు.
అయితే, పిల్లలు లేకపోవడమే.. ఆ దంపతులకు ఉన్న లోపం. దీంతో తన అన్న కొడుకునే తెచ్చి పెంచుకున్నడు సుబ్బయ్య. పెద్దయ్యాక ఘనంగా పెండ్లి చేసిండ్రు. కొంతకాలానికి అనుకోకుండా సుబ్బయ్య చనిపోయిండు. తండ్రి ఇన్సూరెన్స్తోపాటు బ్యాంకులో ఉన్న డబ్బులు కొడుకు, కోడలు చేతికి అందినయి. భర్త మరణం శర్వమ్మను కుంగదీసింది. చాలా రోజులు ఇంటినుంచి బయటికి రాలేదు. అదే అదునుగా పొలం, డబ్బు లావాదేవీలన్నీ తమ చేతుల్లోకి తీసుకున్నరు కొడుకు, కోడలు. క్రమంగా ఆస్తిపాస్తులు, ఇంటి బాధ్యతలు కూడా వాళ్ల అధీనంలోకే వెళ్లిపోయాయి. రానురాను శర్వమ్మను పరాయిదానిలా చూడటం మొదలుపెట్టిండ్రు. ఇంటికి పెద్దదిక్కు, ఆస్తంతా ఆమెదే అనికూడా చూడకుండా.. శర్వమ్మను పనిమనిషిని చేసిండ్రు. ఇంటెడు చాకిరీ చేయించేవాళ్లు. దొడ్లో పశువుల పాక ఊడ్పించి, ఆ తర్వాతే తిండి పెట్టేవాళ్లు. కొన్నిరోజుల్లోనే ఆమె పరిస్థితి దారుణంగా తయారైంది.
ఒకరోజు తీవ్రమైన జ్వరంతో శర్వమ్మ నిద్ర లేవలేదు. కొడుకు, కోడలు వచ్చి..
“ఏం సోంగులు పడుతున్నవే!” అని కోడలు..
“అమ్మా లేవే! ఇంకా లేవకపోతే ఇంట్లో పని మొత్తం నా పెళ్లాం ఒక్కతే ఎట్ల జేస్తది” అంటూ కొడుకు నోటికొచ్చినట్లు తిట్టిండ్రు.
“ఒరేయ్ సూరయ్యా! నాకు చేతనైత లేదురా.. బాగా సుస్తీ చేసినట్టుంది. డాక్టర్ను పిలిపించి సూదిమందు ఇప్పించురా! నీకు పుణ్యం ఉంటది” అన్నది శర్వమ్మ.
“అంతగనం ఏం సుస్తీ చేసిందే నీకు! డాక్టర్ను తోలుక రావడానికి నాకాడ పైసలు లేవు. ‘లంకణం.. పరమౌషధం’ అంటవ్ గదా.. అట్లనే పండుకో! తగ్గి
పోతది” అన్నడు కొడుకు.
జ్వరంతో మూలుగుతున్న శర్వమ్మను ఎవరూ పట్టించుకోలేదు. అందరూ చేను కాడికి వెళ్లిపోయిండ్రు.
ఓరోజు పెరటి వైపు తలుపుల దగ్గరికొచ్చి..
“లక్ష్మమ్మా!” అని కేకలు వేసింది శర్వమ్మ.
వంటచేస్తున్న లక్ష్మి..
“ఏంది పెద్దమ్మా!” అంటూ తలుపు తీసింది.
శర్వమ్మ తూలుతూ వచ్చి.. లక్ష్మి రెండు చేతులూ పట్టుకొని బోరున ఏడ్చేసింది.
లక్ష్మికి ఏం అర్థం కాలేదు.
“ఏడ్వకు.. ఊకో!” అంటూ, పక్కనే ఉన్న ముక్కాలి పీట జరిపి శర్వమ్మను కూర్చోబెట్టింది.
కొన్ని మంచినీళ్లు ఇచ్చి, పొయ్యి మీది నుంచి ఉడుకు రొట్టె, పప్పు తీసుకొచ్చి ముందుపెట్టింది.
“తిను పెద్దమ్మా!” అన్నది.
“నేను తిననీకి రాలేదు బిడ్డా! ఏమన్న గోలి ఉంటే ఇయ్యవా!” అని అడిగింది శర్వమ్మ దీనంగా!
ఒళ్లు పట్టుకుని చూస్తే సలసలా కాలిపోతున్నది.
“నేను నీ బిడ్డలాంటిదాన్ని కానా పెద్దమ్మ. ఒక్క రొట్టె తిను!” అని ఇస్తే, ఆవురావురుమని తిన్నది.
లక్ష్మి ఇచ్చిన గోలి వేసుకొని, ఇంటికి వచ్చి పడుకున్నది. సాయంత్రం కొడుకు, కోడలు వచ్చి చూసేసరికి శర్వమ్మకు జ్వరం తగ్గిపోయింది.
అది చూసిన కొడుకు..
“నేను జెప్పలేదానే! ఉపాసం ఉంటే అదే తగ్గిపోతదని” అని అన్నడు.
‘ఒరేయ్.. నాకొచ్చింది ఆకలి జ్వరం రా నాయనా! నేను చస్తే.. గొంతులో ఇన్ని తులసి నీళ్లయినా పోస్తవో.. లేదో!’ అని మనసులోనే అనుకున్నది శర్వమ్మ.
రానురాను తన పరిస్థితి ఏంటో అర్థం కాసాగింది.
ఆరోజు లాగే.. ఈరోజు కూడా పక్కింట్లో తెచ్చుకుని, దాచుకొని తింటే ఎవరికీ తెలియదేమో అనుకున్నది. లక్ష్మి ఇచ్చిన రొట్టెలు చూసిన మనవడు లొల్లి లొల్లి చేసిండు. అంతమంది ముందు పంచాయితీ పెట్టి, ఇన్నేండ్లు కడుపుల పెట్టుకున్నదంతా వెల్లడి చేసిండు.
వారం రోజులు గడిచినయి! ఆరోజు జరిగింది అందరూ మర్చిపోయిండ్రు. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నరు.
శర్వమ్మ పరిస్థితి మాత్రం ఏమీ మారలేదు.
ఒకరోజు పొద్దున్నే.. ఆ వీధిలోకి ఓ అంబులెన్స్ కూతపెడుతూ వచ్చింది. ఇండ్లల్ల ఉన్నోళ్లంతా బయటకొచ్చిండ్రు. అందులో నుంచి ఇద్దరు పోలీసులు దిగి..
“ఇక్కడ సూరయ్య ఎవరయ్యా!” అని అడిగిండ్రు.
అక్కడున్నోళ్లంతా.. ‘ఇతనే!’ అంటూ, బయట నిల్చుండి వేపపుల్ల నములుతున్న సూరయ్యను చూపించిండ్రు.
“నన్ను ఎందుకు అడుగుతున్నరు?” అన్నాడు సురయ్య.. వాళ్ల దగ్గరికెళ్లి.
“శర్వమ్మ మీ అమ్మనా?” అన్నడు ఓ పోలీస్.
“అవును.. పిల్వాల్నా?” అన్నడు, ఇంట్లో శర్వమ్మ లేదని తెలియని సూరయ్య.
“మీ దగ్గరికి కూడా అడుక్కోడానికి వచ్చిందా ఏంది? మా అమ్మకు జర మతిస్థిమితం లేదయ్యా!”.. అని మళ్లీ తనే అన్నడు సూరయ్య.
ఆ వచ్చిన పోలీసులు తల పైనుంచి టోపీ తీసి..
“నిన్న రాత్రి రైలు పట్టాలపై ఒక ముసలామె శవం దొరికింది. ఆమె దగ్గరున్న దొరికిన ఆధార్ కార్డు ద్వారా మీ అమ్మ అని తెలిసింది.
మీ తండ్రిగారు పోతుపోతూ..ఈ ఆస్తులపై సర్వ హక్కులనూ మీ అమ్మకే ఇస్తూ వీలునామా రాసిండు. శర్వమ్మను మీరు సరిగా చూసుకోకపోతే, తన తదనంతరం ఈ ఆస్తులన్నీ ఎవరికైనా ఇచ్చేసే అధికారం కూడా ఆమెకే ఇచ్చిండ్రు. ఈ విషయం శర్వమ్మ గారికి తెలుసు. నెల కింద ఆమె నన్ను కలిసి.. తన ఆస్తినంతా అనాథాశ్రమానికి చెందేలా పత్రాలు రాయించు కున్నది. తనకేమైనా జరిగితే..ఆస్తి పంపకాల బాధ్యతను నన్నే తీసుకుని, పూర్తిచేయమని అంగీకార పత్రం రాసిచ్చింది.
చేతిపై నీపేరు పచ్చబొట్టు ఉంది. అదిచూసి గుర్తుపట్టినం” అన్నరు వాళ్లు.
లేని దుఃఖం నటిస్తూ.. “అమ్మా!” అంటూ పరుగెత్తిండు సూరయ్య.
తన తల్లేనని గుర్తించిండు.
‘పీడా పోయింది. ఆమె చస్తే ఎవరికంటా నష్టం!’ అని మనసులో మురిసిపోతూ, బయటికి మాత్రం దుఃఖం నటిస్తూ వచ్చిండ్రు సూరయ్య భార్యా పిల్లలు.
అయితే, శర్వమ్మ దహన సంస్కారాలను మాత్రం చాలా గొప్పగా చేసిండ్రు. పూలరథంలో శవయాత్ర తీసిండ్రు. యాత్ర సాగిన దారి మొత్తం పూలతోనే నిండిపోయింది. పాలరాతితో సమాధి కట్టిండ్రు. ఘనంగా దినకర్మ నిర్వహించిండ్రు. వచ్చిన బంధువులంతా..
సూరయ్యకు తల్లిమీద ఎంతో ప్రేమ ఉన్నదని కొనియాడిండ్రు.
‘ఇంతమంచి కొడుకు ఉండగా.. పోయి రైలు పట్టాలమీద ఎందుకు పడ్డదో!’ అని అనుకున్నరు.
‘నిజంగానే మతి తప్పిందేమో!’ అని నసుగుతూ వెళ్లిపోయిండ్రు.
ఊర్లోవాళ్లు మాత్రం..
‘శర్వమ్మ బతికున్నప్పుడు ఒక్కపూట తిండి సరిగా పెట్టలేదు ఈ పాపాత్ముడు. పోయినంక పైసలు సల్లుతున్నడు’ అనుకున్నరు.
నెల రోజులు గడిచిపోయినయి. ఒకరోజు సూరయ్య ఇంటికి ఓ లాయర్ వచ్చిండు.
“నాపేరు రామనాథం. లాయర్ను. సూరయ్య అంటే నువ్వేనా?” అని అడిగిండు.
“ఆ! అవును” అన్నడు సూరయ్య.
“ఈ పత్రాల్లో ఉన్న ఆస్తిపాస్తులు ఎక్కడెక్కడ ఉన్నయో చెప్పగలవా?” అడిగిండు రామనాథం.
“ఎందుకు చెప్పలేను! ఇదంత మాదే!” అన్నడు సూరయ్య.. పత్రాలలో ఉన్న నక్షను చూస్తూ!
“అయితే ఇక్కడ సంతకాలు చేయి!” అన్నడు లాయర్. ‘ఎందుకు? ఏమిటి?’ అని కూడా అడగకుండా, తల్లి పేరుమీద ఏమన్నా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయేమో అనుకొంటూ.. అందరూ సంతోషంగా సంతకాలు చేసిండ్రు.
“ఇక నేను వెళ్తున్న. ఒక వారం రోజుల్లో వస్తం! ఈ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవడానికి” అన్నడు లాయర్.
“ఏమంటున్నరు సార్!” అన్నడు సూరయ్య.
“మీ తండ్రిగారు పోతుపోతూ.. ఈ ఆస్తులపై సర్వ హక్కులనూ మీ అమ్మకే ఇస్తూ వీలునామా రాసిండు. శర్వమ్మను మీరు సరిగా చూసుకోకపోతే, తన తదనంతరం ఈ ఆస్తులన్నీ ఎవరికైనా ఇచ్చేసే అధికారం కూడా ఆమెకే ఇచ్చిండ్రు. ఈ విషయం శర్వమ్మ గారికి తెలుసు. నెల కింద ఆమె నన్ను కలిసి.. తన ఆస్తినంతా అనాథాశ్రమానికి చెందేలా పత్రాలు రాయించుకున్నది. తనకేమైనా జరిగితే.. ఆస్తి పంపకాల బాధ్యతను నన్నే తీసుకుని, పూర్తిచేయమని అంగీకార పత్రం రాసిచ్చింది. మీరు శర్వమ్మకు చూపిన నరకం, చేసిన అన్యాయం మొత్తం రికార్డు చేయించింది. ఆ క్యాసెట్, మిగతా అన్ని పత్రాలన్నీ నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. మీరేమైనా చెప్పాలనుకున్నా, సందేహాలున్నా కోర్టు ద్వారా తెలుసుకోవచ్చు! ఇక నేను వెళ్తున్న..” అని చెప్పి వెళ్లిపోయిండు లాయర్!
‘ఈమె బతికి ఇంకా ఎవరిని ఉద్దరిస్తుందంట!? చస్తే ఎవరికి నష్టం!’ అని అంతకుముందు అనుకున్న సూరయ్య దంపతులు ఇప్పుడు ఏంచేయాలో తెలియక నిశ్చేష్టులై అలాగే చూస్తూ నిలబడిపోయిండ్రు.
వాసరచెట్ల జయంతి
వాసరచెట్ల జయంతి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపురం. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఎం.ఏ, బీఈడీ చేశారు. 2017లో ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ప్రేరణ పొంది, రచనా వ్యాసంగం వైపు అడుగులేశారు. ఈమె రాసిన మొదటి కథ ‘మోడ్రన్ భక్తి’. ఇప్పటివరకూ 20కిపైగా కథలు రాశారు. వీటిలో కొన్ని కథలు ప్రముఖ తెలుగు దినపత్రికలు, వెబ్సైట్లలో ప్రచురితం అయ్యాయి. నవతెలంగాణ ఆదివారం అనుబంధంలో వచ్చిన ‘తండ్రి రుణం’ కథ విశేష పాఠకాదరణ పొందింది. కథలతోపాటు కవిత్వం, పుస్తక సమీక్షలూ చేస్తుంటారు. పలు దినపత్రికలు, సాహితీ సంస్థలు నిర్వహించిన కథలు/ కవితల పోటీల్లో బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు. వివిధ సంస్థల నుంచి సన్మానాలు పొందారు. బాల్యంలో చూసిన ఒక సంఘటనను ఆధారం చేసుకొని ‘శర్వమ్మ మరణం’ కథ రాసినట్లు రచయిత్రి చెబుతున్నారు.
వాసరచెట్ల జయంతి
99855 25355