136 ఏండ్ల చరిత్రగల సురభి నాటక కళను బతికించుకోవడానికి ఆ కళాకారులు ఎంతో కష్టపడుతున్నారు. ముఖ్యంగా కొవిడ్-19 నేపథ్యంలో వారి కుటుంబాల పరిస్థితి అతలాకుతలమైంది. వారసత్వపు ఆస్తిలా వచ్చిన కళ అంతరించి పోకుండా ‘సురభి డ్రామా థియేటర్’ నిర్వాహకుడు, 27 ఏండ్ల సురభి జయానంద్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ఆధునిక
టెక్నాలజీని అందిపుచ్చుకొని సురభి నాటక కళను ఆన్లైన్లో ప్రేక్షకులకు చేరువ చేస్తున్నాడు.
అది 1885వ సంవత్సరం.
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని ‘సొరుగు’ గ్రామం లో ఆరంభమైంది ‘సురభి’ నాటక ప్రస్థానం. ఆ గ్రామస్తులు ముందుగా తోలుబొమ్మలాటతో ప్రేక్షకులను అలరించేవారు. క్రమంగా రంగస్థలంపై నాటకాలు వేయడం మొదలు పెట్టారు. ఒకప్పుడు ఈ సురభి నాటక కళకు ఎంత పేరు ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాన్రాను సినిమాలు, టీవీలు రావడంతో ఈ ప్రక్రియకు ఆదరణ బాగా తగ్గింది.
అరుగుల నుంచి ఆన్లైన్కు..
ఇప్పుడు అందరి ఇండ్లలో కంప్యూటర్లు, టీవీలు వచ్చేశాయి. చేతుల్లో స్మార్ట్ఫోన్ ఉండనే ఉంది. కానీ, ఈ తరానికి అసలు నాటకాల గురించి, ఘన చరిత్రగల సురభి గురించి అవగాహన తక్కువ. అయితేనేం, సురభి నాటక కళను గౌరవించేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు తమ పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేసేందుకు సురభి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. కానీ, కరోనా సురభి కళాకారుల బతుకుల్లోనూ ఆకలిబాధలను రేకెత్తించింది. అయినా సరే, కళా పోషకులు, మంచి మనసున్న మనుషులు వీరికి నిత్యావసరాలు అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు. తిండి వరకు బాధ లేకపోయినా, కళ ఉనికి గురించి ఆందోళన చెందసాగారు సురభి కళాకారుడు జయానంద్. సృష్టిలో మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు. అది కళ అయినా సరే, పరిస్థితులకు తగినట్టు మారాల్సిందే. ఆ వాస్తవం తెలుసు కాబట్టే, ఆన్లైన్ రంగస్థలాన్ని ఎంచుకున్నది సురభి. 2020 సెప్టెంబర్లో కేఎల్ యూనివర్సిటీ కల్చరల్ ఫెస్ట్లో మొదలైన సురభి వర్చువల్ షోలు మూడు పదుల మైలురాయిని చేరుకొన్నాయి. ‘మాయాబజార్’ నాటకంతో ఓటీటీలోకీ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నది సురభి.
హైదరాబాద్ సురభి కాలనీ
సురభి కళాకారులు తెలుగు నేలంతా తిరుగుతూ నాటకాలను ప్రదర్శించేవారు. అప్పట్లో ప్రభుత్వం 240 కుటుంబాలకు హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలో ఇండ్లు కేటాయించింది. ఆ ప్రాంతానికి ‘సురభి కాలనీ’ అనే పేరూ వచ్చింది. ఇప్పటికీ సురభి డ్రామా థియేటర్లో భాగమైన 60 కుటుంబాలు ఇక్కడే నివాసం ఉంటున్నాయి. అందులో ఏడాది వయసున్న పిల్లలనుంచి ఏడు పదుల అవ్వ, తాతలు కూడా నేటికీ ముఖానికి రంగులు వేసుకొని రాగయుక్తంగా రంగస్థలంపై సత్తా చాటుతున్నారు. వీళ్లంతా ఏనాడూ డబ్బుకోసం ఆశ పడరు. ఇప్పుడు కూడా ఆన్లైన్ద్వారా ప్రేక్షకులను అలరించాలని, కళను ముందు తరాలకు పరిచయం చేయాలని చూస్తున్నారే తప్ప, ఆధునిక మాధ్యమాల ద్వారా డబ్బు సంపాదించే ఆశే లేదంటున్నారు నటరాజు సేవకులైన సురభి కళాకారులు.
తరతరాల ఆస్తిని వదలం
‘సురభి నాటక కళాకారుల్లో నాది ఎనిమిదో తరం. నేను పుట్టింది వరంగల్ జిల్లా ఏనుగల్లులో. కానీ, నాటకాలు ప్రదర్శించడం కోసం మా కుటుంబం ఊళ్లు తిరుగుతూ ఉండేది. అందువల్లే నేను పదో తరగతి వరకూ తొమ్మిది బడుల్లో చదివాను. ఇటు వరంగల్, కరీంనగర్నుంచి మెదక్ వరకు అన్ని ప్రాంతాలో ఒక్కో తరగతి పూర్తి చేశాను. మా నాన్న సురభి వాసుదేవరావు తన చిన్నప్పటి నుంచీ నాటకాలు వేసేవారు. ఆయన మల్టీ టాలెంటెడ్! నాటకాల్లో హీరోగా చేసేవారు. క్యారెక్టర్లకు సరిపోయే డ్రెస్సులు కుట్టేవారు. గొప్ప మేకప్ ఆర్టిస్ట్కూడా. మళ్లీ ఈ ఆన్లైన్ నాటకాలవల్ల నాన్న ముఖంలో ఆనందం కనిపిస్తున్నది. మా అమ్మ తిరుమల కూడా సత్యభామ, రేవతి మొదలైన పాత్రల్లో నటిస్తారు. నేను కడుపులో ఉన్నప్పుడు కూడా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా స్టేజీ దగ్గరకు వచ్చి కర్టెన్లు లాగేదట. ఇది మా జీవనశైలి. నేను ఆన్లైన్ నాటకాల్లో కూడా మాయాబజార్లో కృష్ణుడి పాత్ర పోషిస్తున్నాను. టెక్నికల్ అంశాలన్నీ దగ్గరుండి చూసుకుంటాను. మళ్లీ జనాలు బయటి కొచ్చి నాటకాలు చూసే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే, మమ్మల్ని ఆన్లైన్ ద్వారా ఆదరించాలని, నాటక కళను బతికించాలని ప్రతి ఒక్కర్నీ కోరుకుంటున్నాను’ అని అభ్యర్థిస్తున్నాడు జయానంద్.