ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తాను రాలేనప్పుడు, పరమాత్మ తన ప్రతినిధులుగా సద్గురువులను భూమికి పంపుతాడని అంటారు. ఆ పరంపరలో రాఘవేంద్ర తీర్థులు కూడా ఒకరు. భక్తులు ఆయనను ప్రహ్లాదుడి అంశగా భావిస్తారు. ఆ రూపంలోనూ కొలుస్తారు. తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన వెంకటనాథుడు.. సుధీంద్రతీర్థుల సమక్షంలో సకల శాస్ర్తాలూ అభ్యసించారు. గురువుల ఆదేశంతో సన్యాసం స్వీకరించి.. సంచారానికి బయల్దేరారు. నేటి కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో శ్రీమఠాన్ని స్థాపించి ధర్మ ప్రచారం చేశారు. మధ్వాచార్యుల మూలగ్రంథాలకు టిప్పణి అందించారు. ‘సుధా పరిమళ’ ఆచార్యుల తాత్విక చింతనకు అద్దంపట్టే రచన. రాఘవేంద్రస్వామి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, పాండిత్యాన్ని, బోధనలను సుబోధకం చేస్తూ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి రాసిన పుస్తకం ‘భజతాం కల్పవృక్షాయ’.
భజతాం కల్పవృక్షాయ
రచన: పోల్కంపల్లి శాంతాదేవి
పేజీలు: 568; వెల రూ.500
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
కన్నీటి గొంతుక
‘అశ్రుస్వరం’ గుండె గోస. కన్నీళ్ల సంభాషణ. పగిలిన హృదయాల పలకరింపు. కవి పెద్దిరెడ్డి గణేష్ గంభీరమైన గొంతుక. ‘లోపలంతా శిథిలమైన చీకట్లు కమ్మినాక.. పైకి తళుకులీనే తన్మయత్వం ఎట్లా కనిపిస్తుంది’ అని ప్రశ్నిస్తారు ‘లోపల్లోపల’ కవితలో. ఉన్న ఊరిపట్ల కన్నతల్లంత మమకారం వినిపిస్తుంది ‘పల్లకీ’లో. మొగుడి అప్పులు తీర్చడానికో, పిల్లల కడుపులు నింపడానికో.. అద్దెకు గర్భాన్ని అమ్ముకొని, గుండెల్లో దుఃఖాన్ని నింపుకొనే అంగడి అమ్మల గుండెల సందడి ‘సరోగసీ మదర్’.
‘సముద్రం’ కవిత దగ్గరికి వచ్చేసరికి కవి ముద్ర మరింత ప్రస్ఫుటం అవుతుంది. వేడివేడి చాయ్లో ఉస్మానియా బిస్కెట్ను అద్దుకుని తిన్నట్టు.. పాటనూ ముంచుకుని తినొచ్చని సలహా ఇస్తారు ‘ఓ కప్పు చాయ్.. పాట’ కవితలో. ఎమ్వీ రామిరెడ్డి అన్నట్టు ‘ఈ పుస్తకంలోని అన్ని కవితలూ ఒక్క ఊపులో చదవడం ఓ అనుభవం’.
అశ్రుస్వరం (కవిత్వం)
రచన: పెద్దిరెడ్డి గణేష్
పేజీలు: 120; వెల రూ.100
ప్రతులకు: రచయిత, ఫోన్: 9848065658