భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే భాష సంస్కృతం. దైవభాషగా భావించే సంస్కృతాన్ని భవిష్యత్ తరాలకు సజీవంగా అందించాలన్న లక్ష్యంతో వేదాంత వర్ధిని సంస్కృత పాఠశాలను స్థాపించారు ఆచార్య కోయిల్ కందాడై అప్పన్ శఠకోప రామానుజాచార్యులు. ఈ విద్యా సంస్థ 1928లో హైదరాబాద్లోని సీతారాంబాగ్లో ప్రారంభమైంది. ఆ తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వెళ్లింది. తొమ్మిది దశాబ్దాలుగా సంస్కృత భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నదీ వాగ్దేవి నిలయం.
తిరుమల తిరుపతి దేవస్థానం భారతీయధర్మానికి పెద్దపీట వేస్తున్నది. భారతీయతకు ఆత్మలాంటిది సంస్కృ తం. ఆ దేవభాషను కాపాడుకుంటేనే మన ధర్మం మనగలుగుతుంది. ఈ లక్ష్యంతోనే బోయిన్పల్లిలోని శ్రీవేంకటేశ్వర వేదాంత వర్ధిని ఓరియెంటల్ హైస్కూల్, వేంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలను నిర్వహిస్తున్నది తితిదే. విద్యార్థుల నుంచి ప్రవేశ రుసుము, ట్యూషన్ ఫీజు వంటివేవీ తీసుకోకుండా.. ఉచిత భోజన వసతులు కల్పిస్తూ విద్యాబోధన చేస్తున్నారిక్కడ. విద్యాసంస్థ కోసం ఏడున్నర ఎకరాల ఆవరణలో సువిశాలమైన భవనాలను నిర్మించారు. ఈ విద్యాలయాల్లో ఏటా జూన్లో ప్రవేశాలు జరుగుతాయి. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా కొంత ఆలస్యమైనా, ఇదివరకే చేరిన విద్యార్థులకు ఆన్లైన్ బోధన సాగుతున్నది. ఇక్కడ ఆరో తరగతినుంచి డిగ్రీ వరకూ చదువుకోవచ్చు.
ఇది సంస్కృత పాఠశాలే అయినా, ఆంగ్లమూ బోధిస్తారిక్కడ. వేంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత పాఠశాలలో చదివిన విద్యార్థుల్లో చాలామంది అధ్యాపకులయ్యారు. పలువురికి ఇదే కళాశాలలో ప్రిన్సిపాళ్లుగా కూడా పనిచేసే అవకాశం దక్కింది. ‘ఈ సంస్కృత పాఠశాలలో చదవడం ఓ గొప్ప అనుభూతి. ఐదేండ్ల కాలంలో మా గురువుల బోధనలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి’ అంటారు భాషావేత్త, ద్రవిడ యూనివర్సిటీ పూర్వ ఉప-కులపతి ఆచార్య రవ్వా శ్రీహరి. ‘ఇక్కడి పూర్వ విద్యార్థినని చెప్పుకోవడానికి ఎంతో గర్వ పడుతున్నా. మా గురువులు మమ్మల్ని బిడ్డలకన్నాఎక్కువగా భావించేవారు. విద్యాజ్ఞానం, సంస్కారం సభ్యత, ప్రేమ, వాత్సల్యం మాకు నేర్పించారు’ అని ఉద్వేగంగా చెబుతారు వేంకటేశ్వర వేదాంత వర్ధిని కళాశాల పూర్వ ప్రిన్సిపల్ కె.రామానుజాచార్యులు. ఆ ఆవరణలో చదివిన వేలమంది విద్యార్థులదీ ఇదే మాట. కొవిడ్ చీడ వదులుతున్నది కాబట్టి, త్వరలోనే ఆ ఆవరణలో వేదమంత్ర ఘోషలు వినబడనున్నాయి.
‘వేదవిద్యను అభ్యసించినవారికి కెరీర్ పరంగానూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సంస్కృతంతోపాటు ఇంగ్ల్లిష్, కంప్యూటర్స్ నేర్పిస్తున్నాం. మాస్టర్స్లో సంస్కృతం, తెలుగు, ఇంగ్ల్లిష్, చరిత్ర వంటి అంశాలను అభ్యసించవచ్చు. బి.ఎడ్; పండిట్ ట్రైనింగ్లను సైతం ఎంచుకోవచ్చు. ఇక్కడ కోర్సులు పూర్తి చేసిన వారు సాధారణ విద్యార్థులతో అవలీలగా పోటీపడగలరు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రస్తుతం సంస్కృత బోధకుల కొరత ఉంది. కాబట్టి, ఉపాధికి ఢోకా ఉండదు. ఆసక్తి కలిగిన వారు… శ్రీవేంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత పాఠశాల, కళాశాల, 170, ఓల్డ్ ఎయిర్పోర్టు రోడ్, న్యూ బోయిన్పల్లి, సికింద్రాబాద్-500011, ఫోన్ నంబర్ 040-27750032, సెల్ నంబర్ 98480 95949ను సంప్రదించాలి.
–ఎం.నిరీష, ప్రిన్సిపల్, వేంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత పాఠశాల