క్యాన్సర్పై విజయం
క్యాన్సర్… పేరు విన్నా కూడా భయపెట్టే రోగం. ఏటా లక్షల మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. రేడియేషన్, కిమోథెరపీ లాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నా… వాటికి దుష్ఫలితాలు కూడా ఎక్కువే. ఒంట్లో క్యాన్సర్ కణాలు వేగంగా విస్తరిస్తున్న సందర్భాలలో, ఈ చికిత్సల ప్రభావం అంతంతమాత్రమే! ఇలాంటి పరిస్థితుల్లో ఓ తీపి కబురును వినిపిస్తున్నారు మినెసొటా విశ్వవిద్యాలయ పరిశోధకులు. మన శరీరంలోకి ఏదైనా రోగకారకం చేరినప్పుడు, టి-సెల్స్ వాటికి వ్యతిరేకంగా పోరాడతాయి. కానీ క్యాన్సర్ కణితులు గట్టిపడినప్పుడు, వాటిని ఎదుర్కోవడంలో టి-సెల్స్ ఇబ్బందిపడతాయి. ఊబిలోకి జారిపోయినట్టుగా నిస్సత్తువగా మారిపోతాయి. అయితే ఈ టి సెల్స్లోని ‘Cytotoxic T cells’ అనే కణాలను కాస్త బలోపేతం చేయగలిగితే, అవి ఎంతటి కేన్సర్ కణితులనైనా నిర్వీర్యం చేయగలవని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇమ్యునోథెరపీగా పిలుస్తున్న ఈ చికిత్సతో లక్షలమంది రోగులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.
పాశ్చాత్య ఆహారంతో సమస్యలే
గత కొద్దికాలంగా మన ఆహారంలో పాశ్చాత్య అలవాట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్రైస్లూ సర్వసాధారణం అయిపోయాయి. వెన్న, మాంసం లాంటివి లేకుండా వారం గడవడం లేదు. ఇది జీర్ణవ్యవస్థకు చేటే అంటున్నారు పరిశోధకులు. Cell Host & Microbe అనే జర్నల్లో ప్రచురించిన నివేదిక ప్రకారం… చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మన జీర్ణాశయంలోని పనెత్ సెల్స్, ఇమ్యూన్ సెల్స్ అనే ముఖ్యమైన కణాల వ్యవస్థ దెబ్బతింటుందట. దీనివల్ల Inflammatory bowel diseaseతో పాటు పేగులకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి. ఒకప్పుడు పాశ్చాత్యదేశాలకు పరిమితం అయిన ఈ అనారోగ్యాలు, వారి ఆహారాన్ని అనుకరించేవారిలోనూ కనిపించడం బాధకరం. నాలుగు వందల మంది అలవాట్లను, వారి జీర్ణాశయంలోని కణజాలాన్ని పరిశీలించిన తర్వాత తేల్చిన విషయమిది. దీన్ని రుజువు చేసుకోవడానికి ఎలుకల మీద కూడా పరిశోధన చేశారు. వాటికి చక్కెర, కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని సమృద్ధిగా అందించారు. ఫలితం! ఇంతకుముందే, చెప్పుకున్నట్టు వాటి పనెత్ సెల్స్, ఇమ్యూన్ సెల్స్లో దారుణమైన మార్పులు కనిపించాయి. అదృష్టవశాత్తు… ఈ అలవాట్లను సరిచేసుకుంటే, మన కణజాలం మళ్లీ ఆరోగ్యవంతం అవుతుందని కూడా తేలింది. ఇక మనదే ఛాయిస్!
బధిరులకు శుభవార్త
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న మాట అర్ధసత్యమే! నిజానికి ఇంద్రియాలలో ఏ ఒక్కటి లోటుగా మారినా, జీవితం వ్యథాభరితం అవుతుంది. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్నవారు, మాటలు నేర్చుకోవడంలోనూ ఇబ్బంది పడతారు. అందుకనే ఇప్పుడు వినికిడి లోపానికి సంబంధించిన ఓ పరిశోధన వినసొంపుగా మారింది. మన చెవి బయట కనిపించే వ్యవస్థ ఎంత ముఖ్యమో, లోపలి చెవి (ఇన్నర్ ఇయర్) కూడా అంతే కీలకమని తెలిసిందే! లోపలి భాగాలలో ఉండే otoferlin అనే ప్రొటీన్లో లోపాలే వినికిడి సమస్యకు కారణం అవుతున్నాయని గ్రహించారు శాస్త్రవేత్తలు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు అరెగావ్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. మానవ కణజాలానికి అతి సమీపంగా ఉండే జీబ్రా చేపల మీద ఈ పరిశోధన కొనసాగించారు. వాటి otoferlinలో చిన్నపాటి మార్పులు తీసుకురావడం వల్ల వినికిడి సమస్యను సరిచేయగలిగారు. భారతీయ మూలాలు కలిగిన ఆయుషి మన్చంద ఈ పరిశోధనలో
కీలకపాత్ర పోషించడం గమనార్హం.
ఐస్ పెట్టొద్దా!
సాధారణంగా కండరాలకు దెబ్బ తగిలినప్పుడు ఉపశమనం కోసం, వాపు రాకుండా… గాయం మీద ఐస్ పెడుతుంటారు. ఆట మైదానంలో అయితే తరచూ ఈ పద్ధతిని పాటిస్తారు. ఆటగాడు గాయపడిన వెంటనే, ఐస్ప్యాక్తో సిద్ధమైపోతారు సహచరులు. దీని వల్ల ఉపశమనం సంగతి అలా ఉంచితే, దీర్ఘకాలిక సమస్యలు వస్తాయంటున్నారు జపాన్కు చెందిన కోబె విశ్వవిద్యాలయ పరిశోధకులు. వివిధ జీవుల మీద ప్రయోగాలు చేసిన తర్వాత వీళ్లు తేల్చిన విషయం ఏమిటంటే… కండరాల గాయాలకు ఐస్ తాకించడం వల్ల, గాయం మానే సమయం పెరిగిపోతుందట. గాయానికి ఐస్ తాకించడం వల్ల, ‘మాక్రో ఫెంగస్’ అనే కణాలు ఈ గాయాలలోకి చేరుకోవడం కష్టంగా మారుతుంది. ఫలితంగా, తాత్కాలిక ఉపశమనం కలిగినా, గాయం మానేందుకు మరింత కాలం పడుతుంది.