‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన ఉత్తరాది భామ ప్రగ్యా జైస్వాల్. తొలి సినిమాతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నా, అనుకున్నన్ని అవకాశాలు అందుకోలేక పోయింది.సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా అభిమానులను అలరిస్తున్నది ప్రగ్యా. రెండేండ్ల విరామం తర్వాత ‘అఖండ’ సినిమాలో ‘నందమూరి నటసింహ’ బాలకృష్ణతో జత కడుతున్న ఈ ముద్దుగుమ్మ గురించి..
ప్రగ్యా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించింది. పుణెలోని సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదివింది. కాలేజీ రోజుల్లోనే అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. తర్వాత, అనేక యాడ్స్లో నటించి సక్సెస్ఫుల్ మోడల్గా పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ‘డేగ’తో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. ‘మిర్చిలాంటి కుర్రాడు’తో టాలీవుడ్లో ఘాటు పుట్టించింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘కంచె’తో ‘టాక్ ఆఫ్ ది టాలీవుడ్’గా నిలిచింది.
‘కంచె’లో నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ, జైస్వాల్కు ఆశించినన్ని అవకాశాలు రాలేదు. అయినా, వచ్చిన ఆఫర్లను వదులుకోకుండా సెకెండ్ హీరోయిన్గానూ చేసింది. ‘ఓం నమో వేంకటేశాయ’, ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘జయ జానకీ నాయక’, ‘ఆచారి అమెరికా యాత్ర’ వంటి చిత్రాల్లో నటించిన ప్రగ్యా, రెండేండ్లుగా ఒక్క సినిమాలోనూ లేదు. ఆ వెలితి త్వరలోనే తీరనున్నది.
అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనక్కి తగ్గనని చెప్పే జైస్వాల్, ‘కంచె’లో మాత్రం సంప్రదాయానికి ప్రతిరూపంగా కనిపించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో తనలోని హాట్ యాంగిల్ను బయటపెట్టింది. కోరికోరి ‘గ్లామర్ డాల్’ ముద్ర వేసుకుంది. ఎప్పటికప్పుడు మత్తెక్కించే ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియానూ హీటెక్కిస్తుంది. అవార్డు వేడుకల్లో, సినిమా ఫంక్షన్లలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో అదర గొడుతుంది.
బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్లోని ‘అఖండ’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రగ్యా. ‘గుల్షన్’తో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ఇప్పుడు
‘అంతిమ్’తో ఏకంగా సల్మాన్ ఖాన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు, యాక్షన్ కింగ్ మోహన్బాబు నటిస్తున్న ‘సన్ ఆఫ్ ఇండియా’లోనూ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందట.
‘కెరీర్ ఆరంభంలో టాప్ యాక్టర్లు, డైరెక్టర్లతో పనిచేయాలని అనుకునేదాన్ని. కానీ, ఊహించని విధంగా విభిన్నమైన పాత్రల్లో నటించాల్సి వచ్చింది. అయినా, నాకేం బాధ లేదు. ఈ ప్రయాణం కూడా సంతృప్తి
కరంగానే ఉంది. గతంతో పోలిస్తే, నా ఆలోచనల్లో పరిణతి వచ్చింది. ప్రతి క్షణాన్నీ పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా’ అంటున్నది ప్రగ్యా. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత హిట్ కాంబినేషన్లో తెర కెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’. ఈ బొమ్మపైనే ప్రగ్యా పెద్ద ఆశలు పెట్టుకుంది. తథాస్తు.